పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కథలు - గాథలు

ఆచారం వచ్చింది. శిస్తువసూలుకు గ్రామాధికారులే నవాబుగారికి జవాబుదారులై నందువల్ల వారు నిరంకుశులై అక్రమాలు జరిగించడం మొదలుపెట్టారు. పంటలు పండినా పండకపోయినా పన్నులు పూర్తిగ వసూలుచేసేవారు. పంటలు బాగాపండిస్తున్నప్పుడు నవాబుగారి సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా యెత్తుకునిపోయేవి. ఈ బాధలు పడలేక నంద్యాల ప్రాంతపు జనులు రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయము చెయ్యడమే మానుకున్నారు.

నవాబుగారి అధికారుల జులుముకు హద్దుపద్ధులు లేకుండా పోయినవి. నర్నూరు గ్రామంలో నవాబుగారి గుఱ్ఱం చచ్చిపోతే నవాబుగారి ఉద్యోగులు ఆ గ్రామస్థులవల్ల ఐదువేలు రూపాయిలు అపరాధంగా వసూలు చేశారు!

కర్నూలు నవాబైన గులాం రసూలుఖానుకు మొదటినుంచీ కొన్ని కొన్ని పిచ్చికళలు ఉండేవి. అతనికి నిజంగా కొంత చిత్తచాంచల్యము కూడా వుండేదని అనుకునేవారు. అతనికి ఎంత తోస్తే అంతచేసేవాడేగాని ఒకరు చెబితే వినెవాడు కాదు. అతడు తన సైన్యాన్ని సముద్రయాత్రకు పంపించి వారికి జీతబత్తెములకు బదులుగా బట్టలు, గడ్ది, యిచ్చేటట్లు నిశ్చయించాడు. తన పెంపుడు కోడిపుంజుల మెడలో వజ్రాలను కట్టించాడు. ఒకసారి తానే మహమ్మదు ప్రవక్తనని ప్రకటించాడు. ఈ నవాబు కాలంలో తక్కిన వ్యవహరా లెలాగనున్నా పోలీసు రక్షకశాఖమాత్రం చాలా సమర్ధతతో పనిచేసేది. అతడు విధించే క్రూరశిక్షలవల్ల అతనిరాజ్యంలో దొంగతనాలు అణగిపోయినవి. చోరీ జరిగిన గ్రామంలో చోరీ ఆస్తిని పట్టి యివ్వలేక పోతే ఆ గ్రామస్థులే ఆసొమ్ము యిచ్చుకోవాలని శాసించాడు. అందువల్ల దొంగతనాలు చాలా అరుదుగా జరిగేవి. కర్నూలునుంచి హైదరాబాదుకు పంపించే ఖజానాకు సైనిక సిబ్బంది గాని ఇనుపపెట్టెలు బందోబస్తుగాని లేకుండా గంపలలోనే పంపించేవాడు.

ఇంగ్లీషు కుంఫినీవారి రాజ్యాన్ని కూలద్రోయాలని ఇతడు కుట్ర చేస్తూవున్నట్లు అనుమానించి 1839 లో కుంఫినీవారు ఇతని రాజ్యం