పుట:Dvipada-Bagavathamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

209

లచ్చుగ భోగించుఁ డరుగుడు వేడ్క
మదమత్సరంబులు మాని యేప్రొద్దు
మదిలోన నన్ను నేమఱకుండుఁ” డనుచు
రాజుల ననిచి జరాసంధి చేతఁ
బూజలు గొని రథంబులు వేడ్క నెక్కి
యనిలజార్జునులతో యతివైభవమున
దనుజారి వచ్చె నింద్రప్రస్థపురికి.

శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో నింద్రప్రస్థపురికి మఱలి వచ్చుట


వచ్చి యాపట్టణద్వారంబు నందు
సచ్చరిత్రుఁడు పాంచజన్యమొత్తుటయు600
నారవమాలించి యరుదెంచి పౌరు
లారూఢమగు మహా హర్షంబుతోడఁ
గామాది రహితు నిష్కాము శ్రీకృష్ణు
రామానుజన్ముఁ బురాణ పూరుషునిఁ
గనిమొక్కి సంతోష కలితులై రంత;
అనుజులు కృష్ణుఁడు నరుదెంచి మ్రొక్క
పరమసమ్మదమునఁ బాండవాగ్రజుఁడు
కరమర్థి మువ్వురఁ గౌఁగిటఁ జేర్చి
హరిమోముఁ గని ముదితాత్ముఁడై పలికె
“పురుషోత్తమాచ్యుత! పుండరీకాక్ష!
వరద! వామన! భక్తవత్సల! కృష్ణ!
సరసిజాసనవంద్య! సారసనేత్ర!
నీదాసులగు మాకు నిఖిలలోకముల