డలమున సుస్థిరముగా నెలకొల్పి చనిన యీకవిపుంగవు నెఱుంగనివా రెవరు?
భట్టుమూర్తివలెనే యీతఁడును కృష్ణదేవరాయన యాస్థానకవియె. ఈ యిరువురకును నిరంతరవైరము.
రామకృష్ణకవి స్నానముఁ జేయడనియు, సంధ్యానుష్ఠానముల నెఱుఁగనేయెఱుఁగడనియు, ననాచారుఁడనియు, బట్టుకవి యాక్షేపించెనఁట. దానికి వికటకవి, వచింపరాని వాక్యములతో నొకపద్యపాద మల్లి జవాబు నొసంగెనఁట. అందుచే భట్టుమూర్తి యవమానముఁ జెంది యాసంగతిని రాయలవారికి విన్నవించుకొనెనఁట. దానిపై రాయలు కోపించి “కృష్ణకవీ! ఇట్టిజవాబేనా యొసంగఁదగిన” దనెను. రామకృష్ణుఁడు “మహాప్రభూ! నాయంతటివాని నీశూద్రుఁ డాక్షేపించుట తగవా? వాని కెట్టిజవాబు నొసంగవలయునో అట్టిజవాబే యొసంగితి” ననెను. రాయలు “నేనే యాక్షేపించితి నేమిజవాబు నొసంగెద” వని యాగ్రహముతో ననెను. వెంటనే రామకృష్ణకవి తానల్లిన పద్యపాదములోని పదములనించుక మార్చి పద్యముఁ బూర్తిఁజేసి యీక్రిందిరీతిని వినిపింపఁగా రాజుగారు మనరామకృష్ణుని సామర్థ్యమున కానందించిరి.
శా. శ్రీనీరేజదళేక్షణాహృదయరాజీవభ్రమచ్ఛంచరీ
కానూనాస్త్రధురంధరుండు హరుఁ డార్యాప్రాణనాథుండు ని
త్యానందుండు శివుండు నాహృదయపద్మాసనస్థుఁడై యుండఁగా
స్నానంబా తలకా? జపంబు మడికా? జందెంబు నాతప్పుకా?