పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భట్టుకవియందు కృష్ణదేవరాయలకు గౌరవము హెచ్చు. అక్కతన రాయలు బట్టుకవికి యర్ధాసనం బొసంగెను. అందులకుఁ దక్కినకవులందఱు నీర్ష్యాసూయాగ్రస్తు లయ్యును, నేమనుటకు ధైర్యము చాలక మిన్నకుండిరి. అప్పుడు రామకృష్ణుఁడు లేచి

ఉ. పండితు లైనవారలు సభస్థలి నుండఁగ నల్పుఁ డొక్కఁ డు
   ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబును కేమి లోటగున్
   గొండొకకోఁతి చెట్టుకొనకొమ్మకు నెక్కినఁ గ్రిందిమత్త వే
   దండ మహోగ్రసింహములు తాలిమినందవె రాజచంద్రమా!

అనుపద్యమును జదివెను. బట్టుకవి యేమియు ననఁజాలక శిరమ్ము వంచుకొనెను.

ఉ. గండము తప్పె నాంధ్ర కవిగానికి నిన్నటిరేయి........
   ........................................
   ...........................................
   ................................................

ఈపద్యమును గృష్ణకవి యాంధ్రకవితాపితామహునిఁగుఱించి చెప్పెనందురు; కాని రామకృష్ణునకుఁ బెద్దనపై నతిగురుత్వము కలదు. ఈవిషయమును రామకృష్ణునిదైన యీక్రిందిపద్యము దృఢపరుచుచున్నది.

క. కవి యల్లసానిపెద్దన
   కవి తిక్కనసోమయాజి గణుతింపంగాఁ
   గవి నేను రామకృష్ణుఁడఁ
   గవి యనునామంబు నీరుకాకికి లేదే?