పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళ్ళను చీవాట్లు పెడుతూంటుంది. కావున వాళ్ళు నిరంతరమూ పండ్ల కొరుకుకొంటూ దుఃఖిస్తూంటారు. ఆ దుఃఖం ఘోరాతిఘోరమైంది.

మత్తయి 25వ అధ్యాయంలో కడతీర్పుసామెత వస్తుంది. ఈ కథలో విభిన్న భావాలు జంటలు జంటలుగా కన్పిస్తాయి. న్యాయాధిపతికి కుడివైపున గొర్రెలూ ఎడమవైపున మేకలూ ఉంటాయి. అతడు దీవింపబడినవాళ్ళను తనచెంతకు రండని పిలుస్తాడు. శపింపబడిన వారలతో పొండని చెప్తాడు. ఈ యధ్యాయంలో కడపటిదైన 46వ వాక్యం "వాళ్లు నిత్యశిక్షకు వెడలిపోతారు, నీతిమంతులు నిత్యజీవంలో ప్రవేశిస్తారు" అని చెప్తుంది. ఈ వాక్యం చెప్పేదాన్నిబట్టి నీతిమంతులు "నిత్యజీవం" పొందుతారు. ఈ నిత్యజీవం కొన్నాళ్ళు మాత్రమే ఉండేది కాదు, శాశ్వతమైంది. ఇక, దీనికి భిన్నంగా పాపాత్ములకు సిద్ధించే నిత్యశిక్షకూడ శాశ్వతమైంది. అనగా ఆ శిక్షగూడ కొన్నాళ్ళు మాత్రమే ఉండేది కాదు, అనంతమైంది. ఇక్కడ నిత్యజీవముంటే మోక్షం. నిత్యశిక్ష అంటే నరకం. ఐతే మోక్షమేలా శాశ్వతమైందో, నరకంకూడ అలాగే శాశ్వతమైంది. అవి రెండూ నిత్యమైనవే. నరకం నిత్యమైందనడానికి మత్తయి 25,#6 గట్టి ఆధారం.

కనీసం ఐదవ శతాబ్దంనుండయినాసరే నరకం శాశ్వతమైందనే భావం తిరుసభలో కన్పిస్తూంది. 1215లో తిరుసభ ఈవేదసత్యాన్ని అధికారపూర్వకంగా ప్రకటించింది కూడ.

ప్రార్ధనా భావాలు

1. మనం నరుల్లో అధిక సంఖ్యాకులు నరకానికి వెళ్తారని అనుకోగూడదు, దేవుని కరుణవల్ల చాలమంది రక్షణం పొందుతారు. అలాగంటే అక్కడి కెవ్వరూ వెళ్ళరని భావించకూడదు. నరకానికి పోయేవాళ్ళుకూడ లేకపోలేదు. ప్రభువు చెప్పిన కడతీర్పు సామెతను బట్టి కొందరు రూఢిగా నిత్యశిక్షను పొందుతారని అర్థంచేసికోవాలి. కనుక మనంకూడ నరకానికిపోవచ్చు. ఇది అసంభవంకాదు. ఈ జీవితంలో మనం మాటిమాటికీ మంచికీచెడ్డకీ మారుతూంటాం. పుణ్యంతో పాటు పాపాన్ని కూడ చేస్తూంటాం. కనుక మన తరపున మనం ఎల్లప్పడూ భయభక్తులతో జీవిస్తూండాలి. దైవభీతి లేనివాడు, నరకాన్ని పట్టించుకోనివాడు, తప్పక చెడతాడు. ఇగ్నేష్యస్ భక్తుడు మనలోని దైవప్రేమ చల్లారినపుడు నరక భయం వలనైనా మనం పాపంనుండి వైదొలగాలని చెప్పాడు. కనుక నరకభయం మంచిది. దాన్ని ఏనాడూ మర్చిపోకూడదు.

2. కాని ఈ భయంతోపాటు మనకు దేవునిపట్ల నమ్మకం కూడ ఉండాలి. మానవులందరూ రక్షణాన్ని పొందాలనే దేవుని కోరిక - 2తిమో 2,4. దేవుడు మనలను నరకానికికాదు, మోక్షానికే సృజించాడు. మనం బుద్ధిపూర్వకంగా దేవునికి