ఆ దేవుడు వానను ఆపివేసాడని రాజు భావం. దేశానికి నా పీడ కాదు నీ పీడే పట్టిందని ప్రవక్త రాజుని నిందించాడు. అనగా రాజు బాలుని కొల్చినందున యావే వానను ఆపివేసాడని ప్రవక్త భావం.
ప్రవక్త రాజుని సవాలు చేసాడు. నీ రాణి పోషించే 450 మంది బాలు ప్రవక్తలనీ యిస్రాయేలు ప్రజలనీ కర్మెలు కొండమీదికి తీసికొనిరా. అక్కడ ఏ దేవుడు నిజమైనవాడో నేనే నిరూపిస్తాను అన్నాడు, రాణి ఈ ప్రవక్తలను రాజు కోశాగారంలోని ధనంతో పోషిస్తూంది. రాజు ప్రవక్త సవాలుని అంగీకరించాడు. కర్మెలు కొండమీద ఇద్దరు దేవుళ్ళకూ పోటి జరగబోతూంది.
రాజూ బాలు ప్రవక్తలూ యిస్రారాయేలీయులూ ఏలీయా అంతా కర్మెలు కొండమీద పోగయ్యారు. ఈ కొండమీదనే ఏలీయా చాలాకాలం ఏకాంతంగా వసించాడు. అది దైవసాన్నిధ్యానికి నిలయం. అతడు ప్రజలను ఈలా షరతు పెట్టాడు. "మీరు ఇప్పటివరకు బాలనీ యావేను కూడ పూజిస్తున్నారు. ఇకమీదట ఎవరో వొక దేవుణ్ణి మాత్రమే ఎన్నుకోండి. ఏలా ఎన్నుకోవాలి? బాలు ప్రవక్తలను ఒక యెదుని కోసి దాని మాంసాన్ని బలిపీఠంమీద పెట్టమనండి. నేనూ ఒక యెదుని కోసి దాని మాంసాన్ని బలిపీఠంమీద పెడతాను. ఇద్దరమూ మా దేవుళ్ళకు ప్రార్థన చేస్తాం. ఏ దేవుడు నిప్పనిపంపి బలిపీఠంమీది మాంసాన్ని దహిస్తాడో అతడే నిక్కమైన దేవుడు, మీరు ఇకమీదట అతన్ని మాత్రమే కొల్వాలి సుమా" అన్నాడు. ప్రజలంతా ఆ షరతుని అంగీకరించారు.
మొదట బాలు ప్రవక్తల వంతు, వాళ్ళు ఎద్దునికోసి మాంసం పీఠంపై పేర్చి వాళ్ళ దేవుణ్ణి ఆవాహనం చేసారు. ఉదయం నుండి సాయంకాలందాకా పెద్ద శబ్దంతో జూలుకి ప్రార్ధన చేసారు. కాని ఆ దేవుడు పలకలేదు వులకలేదు. ఏలీయా వాళ్ళను వేళాకోళం చేసాడు. మీ బాలు ఏదో ఆలోచనలోనో పనిలోనో పడివుండవచ్చు లేదా ప్రయాణంలోనో నిద్రలోనో మునిగివుండవచ్చు. ఇంకా పెద్దగా అరవండి. అతనికి విన్పిస్తుంది అని యెగతాళి చేసాడు. బాలు ప్రవక్తలు ఆవేశం తెచ్చుకొని ఇంకా పెద్దగా అరుస్తూ ప్రార్థనలు చేసారు. తమ శరీరాలను కత్తులతో కోసుకొని నెత్తురు కార్చుకొన్నారు. ఐనా వారి దేవత నుండి ఏ జవాబూ రాలేదు.
తరువాత ఏలీయా వంతు వచ్చింది. అతడుకూడ కొండపైన బలిపీఠం కట్టించాడు. ఎద్దుని కోయించి మాంసాన్ని పీఠంపై పేర్పించాడు. పన్నెండు కడవల నీళ్లు తెప్పించి పీఠంపై కుమ్మరించాడు. అది తడిసి మద్దయి పోయింది. ఆ నీళ్ళ పీఠంనుండి క్రిందికి కారి దానిచుటూ వున్న కందకాన్ని నింపాయి. అలా జలమయమైవున్న బలివేదికమీది మాంసాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయాలి.