అసలు పిల్లలే కలక్కపోవడం సిలువ. కొద్దిజీతాలు, పెద్దసంసారం సిలువ. ఈలాంటి బాధలన్నీ మనం క్రీస్తునందు ఓపికతో భరించాలి. క్రీస్తు బాధామయుడు. గురువుకంటె శిష్యులు గొప్పవాళ్ళ కాదు. అతనికొక త్రోవ మనకు వేరొక త్రోవ అంటూలేదు. పచ్చి మ్రానుకే అలాంటి బాధలు సంభవించాయి. ఎండు ప్రమానులాంటి వాళ్ళమైన మనకు ఎంతటి విపత్తులైనా కలుగుతాయి. ఈలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకానుగ్రహం మనకు సహాయపడుతుంది.
వివాహం సిలువబలిని తలపిస్తూంటుంది. క్రీస్తు తిరుసభ కొరకు తన్నుతాను అర్పించుకొన్నాడు. అదే సిలువ బలి. క్రీస్తు తిరుసభను పోలింది వివాహజీవితం. కావున ఈ సంసారజీవితం సిలువబలికి పోలికగా వుంటుంది. క్రీస్తు పూజాబలిలో దినదినం మనకొరకై పరలోకపితకు అర్పించుకొంటాడు. ఇదే విధంగా వివాహజీవితంలో గూడ జరగాలి. భర్త భార్యతోపాటు క్రీస్తుద్వారా తన్నుతాను దేవునికి అర్పించుకోవాలి. ఇద్దరూ సంతానంతోపాటు తమ్ముతాము దేవునికి అర్పించుకోవాలి. ఈలా మనం క్రీస్తు సమర్పణంతో పాటు తమ సమర్పణనూ రోజురోజు కొనసాగించాలి. క్రీస్తు జీవితం సమర్పణాత్మకమైన జీవితం, కుటుంబజీవితం గడిపే గృహస్థులు పూజబలితో సంబంధం పెంపొందించుకొనే మార్గం ఇది.
సంసారజీవితంలో వ్యక్తిగత లోపాలుగూడ బాధను తెచ్చిపెడతయి. వివాహ జీవితం మొదట క్రొత్తగా, బులపరంగా వుంటుంది. వధూవరులు ఒకరికొకరు అందంగా, గొప్పగా కన్పిస్తారు. కాని కొద్దికాలం గడిచాక ఈ యందచందాలు మాసిపోతాయి. రోజూ చూచిన ముఖమే చూచుకోవడం, విన్నమాటలే వినటం జరుగుతుంది. క్రమేణ ఒకరి లోపాలు ఒకరికి తెలిసిపోయి ఒకరంటే వొకరు విసుక్కోవడం గొణుక్కోవడం రుసరుసలాడ్డం మొదలుపెడతారు. ఈలాంటప్పడు భార్యాభర్తలు చాల జాగ్రత్తగా మెలగాలి. ఒకరి లోపాలనొకరు ఓర్పుతో భరించాలి. భర్త భార్య మేలిగుణాలతోపాటు లోపాలనుగూడా జీవితాంతంవరకు అంగీకరించాలి. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమతో మృదువుగా సంస్కరించుకోవాలి. ఒకరినొకరు చిన్నపిల్లలను లాగ నేర్పుతో, ఓర్పుతో సరిదిద్దుతూండాలి. క్రీస్తును కానావూరి వివాహానికివలె మన వివాహానికిగూడ ఆహ్వానించాలి. యేసు వుండడంవల్ల అక్కడ రసం కొరత తీరిపోయింది. ఆ ప్రభువు ప్రత్యక్షమై వుంటే చాల మన జీవితంలోని కొరతలుగూడ తీరిపోతాయి.
3. ప్రాపంచిక విషయాల్లో నిమగ్నులు కావాలి
గురువులు మఠకన్యలు దైవసంబంధ కార్యాల్లో నిమగ్నులౌతారు. కాని వివాహజీవితం గడిపేవాళ్ళ ప్రపంచసంబంధ కార్యాల్లో నిమగ్నులుకావాలి. పొలాలు ఆఫీసులు