త్రీత్వంలోని తండ్రిలో పితృత్వం పరిపూర్ణంగా ఉంటుంది - ఎఫె 3,15. ఇక్కడ పితృత్వమంటే జననీజనకుల గుణాలు రెండూ కూడ. మన తల్లిదండ్రుల్లో వుండే పితృగుణమూ మాతృగుణమూకూడ పరలోకపు తండ్రిలో పరిపూర్ణంగా వుంటాయి. అతడు తండ్రులందరికి తండ్రి, తల్లలందరికి తల్లి, భూలోకంలోని తల్లి తండ్రీ ఏకవ్యక్తిగా ఐక్యమై ఈ పరలోకంలోని తండ్రిని పోలివుంటారు. ఈ యేకవ్యక్తియైన తల్లిదండ్రులే సంతానాన్ని కనేది. కుటుంబం పవిత్రత్రీత్వాన్ని పోలివుంటుంది కనుక పవిత్రమైంది. దైవరూపాన్ని ప్రతిబింబించేది. కుటుంబ సభ్యులంతా తమ ఔన్నత్యానికి తగినట్లుగా పవిత్రజీవనం గడపాలి.
ప్రార్ధనా భావాలు
1. సీనాయి నిబంధనం వివాహం లాంటిది
పూర్వవేద ప్రవక్తలు యిస్రాయేలీయుల వివాహజీవితాన్ని గూర్చి చెప్పదల్చుకోలేదు. ప్రభువు ప్రజలతో చేసికొన్న నిబంధననుగూర్చి చెప్పదలచుకొన్నారు. ఆ నిబంధనం వధూవరులు చేసికొనే వివాహ నిబంధనం లాంటిది అన్నారు. వరుడు వధువును పెండ్లియాడినట్లే సీనాయి నిబంధనంద్వారా ప్రభువు యిప్రాయేలీయులను పెండ్లియాడాడని చెప్పారు. అనగా దేవుడు యిస్రాయేలీయులను అనురాగంతో చూస్తాడని భావం. ఈ ఉపమానాన్ని మొదట పేర్కొన్నవాడు హోషేయ. ఇతని భార్య గోమెరు. ఈమె వ్యభిచారిణియై భర్తకు ద్రోహం చేసింది. ఐనా ప్రవక్త దేవుని ఆజ్ఞపై ఈమెను మళ్ళా భార్యనుగా స్వీకరించి గాఢా0గా ప్రేమించాడు–3,1. ఈ గోమెరులాగే యిస్రాయేలీయులు అన్యదైవమైన బాలుని కొల్చి ప్రభువుకి ద్రోహంచేసినా, ప్రభువు కరుణతో మళ్ళా వారిని తన ప్రజలనుగా స్వీకరించాడు. ఇస్రాయేలీయులు భార్య యావే భర్త, హోషేయ తర్వాత ఇతర ప్రవక్తలు కూడ ఈ భావాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. నూత్నవేదంలో పౌలు ఈ భావాన్ని ఎన్నుకొని దాన్ని క్రీస్తుకీ తిరుసభకీ అన్వయించాడు.
2. సంతాన భాగ్యం
దేవుడు ఆదామేవలను జతపరచి మీరు చాలమంది బిడ్డలను కని వృద్ధిచెందండని ఆశీర్వదించాడు - ఆది 1,28. పూర్వవేద ప్రజలు సంతానాన్ని మక్కువతో ఆశించారు. వాళ్ళ దృష్టిలో బిడ్డలను కనడమంటే దేవుని దీవెనలు పొందడం. బిడ్డలు కలుగకపోవడమంటె దేవుని శాపానికి గురికావడం. చాలకాలం గొడ్రాలుగా వుండిపోయిన రాహేలు నీవు నాకు బిడ్డలనిస్తావా లేక చావమంటావా అని యాకోబు నెదుట