పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంటాయి. ఈ యనుభవాలనే కీర్తనకారుడు ఇక్కడ కళాత్మకంగా వివరించాడు. మనకు కూడా కలిగే అనుభూతులు కనుకనే, ఈ భక్తుని భావాలు మనకు ప్రీతిని పట్టిస్తాయి.
3 దేవుని యెదుట మన పాపాలను అంగీకరిస్తే ఆ ప్రభువు మనకు గొప్ప చిత్తశాంతిని దయచేస్తాడు. ఈ సందర్భంతో సామెతల గ్రంథం ఈలా వాకొంటుంది.
"తన పాపాలు కప్పిపెట్టుకొనేవాడు బాగుపడడు
 ఆ పాపాలను వొప్పకొని వాటిని పరిత్యజించేవాడు
 దేవుని దయను సంపాదిస్తాడు
 దేవునిపట్ల భయభక్తులు కలవాడు సుఖాన్ని పొందుతాడు
 గుండెరాయిచేసికొనేవాడు నాశమౌతాడు” - 28, 13,14.
ఇంకా యోహాను మొదటి లేఖ ఈలా అంటుంది. “దేవుని యెదుట మనపాపాలను ఒప్పకొంటే అతడు వాటిని క్షమిస్తాడు. మన అవినీతినుండి మనలను శుద్ధిచేసి నీతిని చేకూరుస్తాడు” - 1,9. పశ్చాత్తాపాన్ని గూర్చిన ఈ వాక్యాలు చక్కగా ఆలోచింపదగ్గవి. ఇక, నూత్నవేదంలో క్రీస్తు మనకు దయచేసే ప్రధాన పాపక్షమా సాధనం పాపోచ్చారణమే. కనుక భక్తులు దీన్ని చక్కగా వినియోగించుకొని హృదయశాంతిని పొందుతూండాలి.
4 పాపోచ్చారణం తర్వాత ఈ కీర్తనను భక్తితో, ధ్యానాత్మకంగా జపిస్తే గొప్ప ఆనందానుభూతి కలుగుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది.

కీర్తన - 139

సర్వజ్ఞుడైన ప్రభువు

1.ప్రభూ! నీవు నన్ను పరిశీలించి తెలిసికొనియున్నావు
2 నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియును
  నీవు దూరమునుండియే నా యాలోచనలను గుర్తుపట్టుదువు
3 నేను నడచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు
  నా కార్యములెల్ల నీకు తెలియును