పుట:Bhagira Loya.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగ్గన్నగంటం

నిష్కములు సమర్పిస్తూ వుండేవాడు. ఏ మాండలిక ప్రభువో, ఏ ఉన్నత రాజోద్యోగో, ఏ సంపన్నుడో జక్కన్న వ్రాసి వుంచిన ఉత్తమ గ్రంథాలను తనకు తోచిన పారితోషికం అర్పించి తీసుకుపోతూ వుండేవాడు.

జక్కన తండ్రివలెనే పలచని పొడుగాటి మనిషి. బంగారు మేని ఛాయ. అమోఘమైన బలం పుంజింప జేసుకున్న ఉక్కులాంటి దేహము. గరుడ నాశికము. చిన్నవైనా అందమైన రేఖలు కలిగి కాంతివంతమైన కళ్లు.

తండ్రిగారి కడనే శుశ్రూష చేసి సంస్కృతంలో అఖండపాండిత్యము సంపాదించుకున్నాడు. తెలుగు భాషలో పూర్ణపండితు డనిపించుకున్నాడు. కన్నడ, ద్రావిడాది ఇతర దక్షిణ భాషలలో, పారసీకం, ఓఢ్రం, హిందీ మొదలగు ఉత్తరాది భాషలలో ఉత్తీర్ణు డయ్యాడు. ఐదారు లిపులు మహా ప్రవాహం వలె రచింపగలడు.

జగ్గన తండ్రిగారితో పాటు వ్యవసాయము చేయుటలో ఆరితేరిన బంటు. తమకున్న రెండు నివర్తాల వ్యవసాయము త్వరలో ముగించి తండ్రి కుమారు లిద్దరు యితర భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ వుండిరి. దాని వల్ల కుటుంబానికి ఓ మోస్తరుగా సరిపోయే రాబడి వస్తూ వుండెను.

103