ఎనిమిదవ ప్రకరణము
బెంజమిను - మెరిడిత్తు:- ముద్రకులు
జాగరూకతతో వీరు పని నారంభించిరి. సంవత్సరమున కిరువదినాలుగుకాసు లద్దె కొప్పందముచేసికొని, బసను మాటలాడిరి. కొంతభాగమును తమ స్వంతమున కుంచుకొని, శేషించినదాని నితరుల కద్దెకిచ్చివేసిరి, అక్షరకూర్పులనువిప్పి, యంత్రమును స్థాపించి, కావలసిన వస్తువులనుగొని, పనినారంభము చేయుసరికి, దగ్గిఱనున్న రొక్కము వ్యయమయి పోయినందున, చేతిలో నొక కాసులేకయే, వీరు పనినిసాగించిరి.
దినచర్యకు దగినసొమ్ము, వీరికీపనిలో వచ్చుట లేదు. అప్పుడప్పుడు 'జంటో' సమాజమువారును, వారు శిఫారసుచేయుటచే వచ్చినవారు మాత్రము వీరికి బని నిచ్చుచుండిరి. ఇంతమాత్రమున, పని నడచునా ! అయినను, సమాజమువారి ప్రాపకము కలదు. అందుచే, వారు దీనిని నిలబెట్టుటకు తగిన ప్రయత్నములు, వ్రాత, మాటల మూలమున జేయుచుండిరి. బెంజమినుయొక్క శ్రద్ధాభక్తులను, పని నేర్పును, బుద్ధికుశలతను, సవిస్తరముగ వీరు పొగడుచు వచ్చిరి. చేయవలసినపనిని జాగ