పుట:AndhraRachaitaluVol1.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకటమహీపతి గంగాధర రామారావు" అనివరుసగా వచ్చునటులొక కందము చెప్పుడని మల్లపరాజుగా రడిగిరి. అప్పుడు వీరిటులు చెప్పిరి.

శ్రీధర! శౌరీ! వైకుం
ఠా! ధర శ్రీరావువేంకటమహీపతి గం
గాధరరామారాయ
క్ష్మాధరునిం బ్రోవు మెపుడు కరుణాదృష్టిన్.

ఈచాటువులు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు సేకరించి వెలువరించిరి. సుబ్రహ్మణ్యకవిది పండితవంశము. ఇతని తండ్రి రంగధామాద్యుడు. నారాయణాచల మాహాత్మ్య కృతికర్త. కవిచోర చంద్రోదయ, సత్యభామా విలాసాదులు రచించిన రామకృష్ణకవి కితడు భిన్నోదర సోదరుడు. సుబ్రహ్మణ్యకవి నాగాభట్ల నరసకవితో నుభయభాషల పఠించెను. చాలావఱకు స్వయంకృషి చేసి సాహిత్యనిష్ణాతుడాయెను. మనుచరిత్రము-ఆముక్తమాల్యద వీరి కభిమానిత గ్రంథములు. జ్యోతిషభాగముకూడ నీయన చక్కగనెఱిగెను. అదికొంత తొలుత జీవనాధారమైనది. క్రమముగా గవిత్వరచనమే ప్రధానవృత్తిగా బెట్టుకొని రాజ దర్శనము చేయుచు సుబ్రహ్మణ్యకవి తనలేవడి నెట్టుకొనుచుండెను. 1853లో మాడుగల్లు సంస్థానాధిపతియగు శ్రీకృష్ణభూపతిపై నీకవి సీసపద్యములశతక మొకటి చెప్పెను. అది "శ్రీకృష్ణభూపతి లలామశతకము." అప్పటికి గవియీ డిరువది రెండేడులు. మాడుగల్లుసంస్థాన పండితులు మనకవి నెన్నో తిప్పలు పెట్టిరట. మంత్రిప్రెగడ సూర్యప్రకాశరాయకవి మున్నగువారు నాడు తత్సంస్థాన విద్వత్కవులు. అక్కడివారు "కుట్రయొనర్చె లేమ తన గుబ్బలయుబ్బు సహింపలేమిచేన్." అను సమస్య నిచ్చి, నిలుచుండగా బూరింపుమనిరి. అది యీకవిచే నిటు పూరింపబడియె.

వట్రువహారరత్నములు వన్నె నగల్ పులిమీదవచ్చు నా
పుట్ల యటన్నరీతి జిగి బొల్పగు చూచుకలీల జూచుచున్