పుట:AndhraRachaitaluVol1.djvu/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్షయకాలమున రేగు సప్తమారుతధాటి

దేటిరెక్కల నాప దివురునట్టు

గీ. లని జగము నన్ను బరిహాసమాడుగాక!

యెక్కటిని నిల్చి బలమెల్ల నెదురువెట్టి

విధికి మాఱొడ్డి స్వాతంత్ర విజయలక్ష్మి

యడుగులకు నిత్తు గల్యాణహారతులను.


ఇట 'హారతి' వైకృతము. కల్యాణ శబ్దముతో దీనిని సమసింపజేసిన కవిగారి నిరంకుశత మెచ్చదగినది. ఆమాత్రము స్వాతంత్ర్యము కవి తీసుకోవలయును. 'పలువిధాలంకరణములు' మున్నగు ప్రయోగములు కొన్ని 'ప్రతాప' లో జూపట్టును. సువర్ణ ఖండములవంటి యీ దిగువ సీసములు పఠింపదగినవి. రాజశేఖరకవిలో నకృతకమైన భావనావేశ ముండుటచే నాయనశైలి యమృత వాహినివలె నడచును. మఱి యివి యెంతబాగుగానున్నవి!


సీ. తెగినహారమున ముత్తియములువోలె భా

రతరాజ్య మది పెక్కు వ్రక్కలగుచు

జినచిన్న పాయలై చెడె; రాష్ట్రపతులలో

నొండొరులకు మైత్రి యొదవదెపుడు;

నిత్యలక్ష్మి శుభనిలయములై యుండ

వలయు రాజ్యములు శాశ్వత రణముల

ధనజన వస్తు వాహన శూన్యమై పాడు

పడి శ్మశానములట్లు ప్రభ దొలంగె


గీ. నిట్టి కుబ్జావతారంబు లెల్ల బోయి

భరతఖండ మఖండకై భాగ్య విభవ

నిలయమై యుండ జూడగా వలయుననుచు

గడుపులో గొండయంతాస గలదు నాకు