పుట:AndhraRachaitaluVol1.djvu/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. ఒక్కొక్కరుండు సమస్తోర్వీతలము నిండ

నిరుపమామోదంబు నెఱపునట్టి

పూవు లసంఖ్యముల్ పూచె, రాజస్థాన

నందన దేవ మందార తరపు;

తడవొకింతయు లేని తౌరుష్క వాహినీ

జైత్ర యాత్రా ప్రభంజనము ధాటి

గూకటి వ్రేళ్ళతో గూడ గంపించె జె;

ట్టా పూవు లన్నియు నవనిరాలె


గీ. నీ వలెడి దొడ్డ పూవైన నిలుచు బొలుచు

విశ్వ విశ్వంభరామోద విజయలక్ష్మి

నలుదెసల నించునం చని తలచుచుండ

నగ్బ రనెడి ఝంఝూనిలం బలమె నేడు.


ఇట్టి ధారాచారుత్వము గల పద్యములకు బ్రతాపచరిత్రము పురుటిల్లు. ఈకావ్యమును మించు కావ్యములుపుట్టుచున్నవి. ఇంతయావేశముగల కవిత బయలు దేరుట మాత్రము కష్టము. అభినవ చరిత్ర కావ్యనిర్మాతలలో నీయన మొదటివా డనుటలో నాక్షేపణ ముండదు. నన్నయ - తిక్కన - పోతనాదుల కవితా శైలలు నలవఱుచుకొని, క్రొత్తపోకడలు పెక్కు లాకళించుకొని, చక్కని యితివృత్త మేరుకొని, యుగమున కనుగుణు డైననాయకుని సంపాదించుకొని, తియ్యని చిక్కని తెనుగులో నిట్టి యుదాత్త చరిత్ర కావ్యము సంతరించి తెలుగు మాతకు గాన్క వెట్టిన శ్రీ రాజశేఖరకవి కృతార్థ జీవి.


రాజశేఖర శతావధానులు చాల గ్రంథములు రచింపనిండు; రచించి యుండనిండు; వానియెల్ల ముందు 'ప్రతాప చరిత్ర' ధ్రువతామ్యై నిలబడు కబ్బము. కవిగారు తమ యీ కావ్యము కామేశ్వరీదేవి కంకిత మిచ్చుచు వ్రాసిన యీ రసఘుటికలు విలువ కట్టరానివి: