పుట:AndhraRachaitaluVol1.djvu/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈవిధముగా సప్రయత్న ప్రహసనరచనాకౌశలము చిలకమర్తి కవి కలవడినది. లక్ష్మీనరసింహగారు బహుచమత్కారభాషి. మాటమాటకు జమత్కారముచూపి మాటాడుటలో వీరిది మేనమామపోలిక. సుప్రసిద్ధపండితులైన పురాణపండ మల్లయ్యశాస్త్రులుగారు లక్ష్మీనరసింహకవికి మాతులుడు. వారి మాట నేర్పు నాంధ్రమండలిలో జాలమంది యెఱుగుదురు.


లక్ష్మీనరసింహకవిగారి ధారణాబల మసాధారణము. తమ కుటుంబములో గాని, తా మెఱిగియున్న బంధుమిత్త్రకవి కుటుంబములలో గాని: యెవరేనా డెన్ని గంటల యెన్ని నిమిషములకు జన్మించినదియు - ఎవ రెప్పుడేమేమి యొనరించినదియు మున్నగువిషయములు చెప్పుచు నత్యాశ్చర్యము గలిగించుచు కక్కని ప్రస్తాననము చేయుచుందురు. వీరి ధారణాశక్తికి 1897 సంవత్సరమునాడు జరిగిన చిన్న కథ యిది.


కందుకూరి వీరేశలింగము పంతులుగారు అతిప్రయత్నముమీద తంజావూరునుండి నాచనసోమనాథుని "ఉత్తరహరివంశము" సంపాదించి తెచ్చి రాజమహేంద్రవరములో బ్రథమముద్రణము వేయించుచుండిరి. ఆసందర్భమున మన కవిగారు ఆముద్రాలయమున నున్న "ప్రూపురీడరు" నొద్దకు బోయి యేనాటికానాడు మెల్లమెల్లగా ప్రూపు కాగితము లింటికి గొనివచ్చుచు గవితాప్రౌడత కబ్బురపడుచు హరివంశమంతయు నించుమించుగ ధారణపట్టిరి. గ్రంథముద్రణము పూర్తికాగా వీరేశలింగముపంతులుగారు లక్ష్మీనరసింహముగారి కొకప్రతి యీయబోయిరట. అంతట మన కవివరుడు సోమనాథుని కవిత్వము నుగ్గడించుచు గ్రంథములోని పద్యములెన్నో గబగబ చదివి యుపన్యాసరీతిగా విశేషములు వెల్లడింప మొదలుపెట్టిరట. అది విని వీరేశలింగముగా రాశ్చర్యభరితులై "ఉత్తర హరివంశము" ప్రాచీనపు బ్రతి