“అప్పుడు తినే ఫలహారాలు ఏమిటి యశోదా?”
“లేత కందికాయలు కాల్చుకుని గింజలు వలుచుకు తింటాము. అలాగే సెనగలు, పెసలు, బొబ్బర్లూ, ఊచబియ్యమూ తింటాము. ఒసేతారా, అప్పుడు బంతిపూలు, చేమంతులు, పొగడబంతులు, సీతామ్మవారి జడపూలు, పొద్దుతిరుగుడులు మా పొలాలంతా నిండి ఉంటాయి. ఆ పూలు జడలో కుట్టుకుంటాము. చెవులలో పెట్టుకుంటాము. జడకుచ్చులకు అలంకరిస్తాము.
“మీ పల్లెటూరి జీవితము వింటే నాకు నోరు ఊరుతోంది. ఇంకా పొలాల్లో జనులు కాపురాలు ఉన్నారే?”
“ఆ! చాలామంది వేసవికాలంకూడా పొలాల్లో గడిపివేస్తారు. ఆ తాటాకుల పాకలన్నీ అందుకే.”
“తాటాకుల ఇళ్ళు అసహ్యంగా ఉండవూ?”
“ఎంత చల్లగా ఉంటాయనుకొంటావు! మా మోటబావులలో నుంచి చల్లటినీరు తోడుతూ ఉంటారు. పొలాల్లో దిమ్మలమీద మామిడితోటలూ, నాగరంగం తోటలూ ఉంటాయి. పొలాల కంచెలలో సీతాఫలము, కలిమి కాయలు విరివిగా ఉంటాయి.”
“నన్ను ఊరించేస్తున్నావే!"
“ఈపాటికి మా అన్నయ్య యుద్ధయాత్రనుంచి తిరిగివచ్చి ఇల్లు చేరి ఉంటాడు.”
“ఆ సైన్యంలో మీ అన్న ఉన్నారా?”
“అవునే! బ్రహ్మదత్తప్రభువు ఆుగరక్షకులలో ఉన్నాడుగా!”
“అయితే ఇంటికి ఏలాగు రావడం?”
“యుద్ధయాత్రలు లేనిదినాల్లో స్వగ్రామాలకు వెళ్ళవచ్చునుగా?”
“మీ అన్నగారు ఇంటికి వెడుతున్నానని విజయపురంలో నిన్ను కలుసుకొని తెలిపినారా?”
“నీవు దగ్గరలేకుండా నన్ను ఎవరు కలుసుకున్నారే?”
“అయితే నీకు ఏలా తెలిసింది?”
“నాకు ఏలా తెలుస్తుంది? ప్రతిసంవత్సరమూ వసంతోత్సవాలకు మా అన్న మాగ్రామం వెడుతూ ఉంటాడు.”
“నువ్వూ వెడుతూ ఉండేదానవుగా?”
“అదుగో అప్పుడే మా చిట్టన్నను కలుసుకోవడము.”
తారానిక : ఎవరే ఆ చిట్టన్నా
ఆ పొట్టన్నా?
ఎంత పొట్టిగా ఉంటాడే?
ఎంత చిట్టిగా ఉంటాడే?
యశోద : నీ చిన్న కొంగులో ఇమిడేనే
మాచిట్టన్న
మా గట్టన్న
అడివి బాపిరాజు రచనలు - 6
63
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)