నీ కొప్పు పూలలో తుమ్మెదలా
నీ చెవులను వెలిగే తమ్మటలా
మా చిట్టన్నా
మా గట్టన్నా!
“మీ అన్న నా కొప్పుపూవులో తుమ్మెద అయితే ఉపున ఊదేస్తా.”
“నీ పెదవి కుట్టి వదులుతాడు.”
“ఈ అల్లరి మాటలు చాలించు.”
“నీకు అంతకోపంవస్తే గడ్డంక్రింద బెల్లం గెడ్డ పెట్టి బ్రతిమాలు కుంటాలే.”
రథం సాలగ్రామం ఊరిబయటకు వచ్చింది. సాలగ్రామంలోనూ, గ్రామం చుట్టూ పొలాలోనూ తాళవృక్షాలు నిండి ఉన్నాయి. ఆ చెట్లను వింతగా చూస్తూ తారానిక, ఈ చెట్ల ఆకులు పాకలూ, పందిళ్ళూ వేసుకోడానికి పనికివస్తవి కాబోలు అంతేనా?” అని అడిగింది.
“ఈ చెట్టు నిలువునా ఉపయోగం తారా! తాటిపళ్ళు వానాకాలంలో తింటాము. వేసంకాలంలో లేతనీటిముంజెలు అమృతమే. ఈ చెట్ల డొలకలూ కమ్మలూ చక్కని వంటసరుకుగా ఉపయోగిస్తాయి. పళ్ళలోఉండే టెంకలు చెట్ల విత్తనాలు ఈ విత్తనాలు పాతినప్పుడు మొక్క రాబోతున్నప్పుడూ అవి బద్దలుకొడితే అమృతమువంటి బుజ్జగుంజు వస్తుంది. లేతమొక్కలు అకులు వెయ్యకమునుపు తేగలంటారు. అవి కాల్చుక తింటే పిండివంట లెందుకూ పనికిరావు. నువ్వు వట్టి పట్నంవాసం దానపు. నీకేమి తెలుసు మా పల్లెటూరి జీవితాల అందమూ, రుచీ!”
“మళ్ళా నోరు ఊరించేస్తున్నావు.”
“ఉండు. మా పశువులుదొడ్డిలో, జొన్నచొప్ప, వట్టిగడ్డి, కందికంప నిలవ చేసుకొనే పెద్దదొడ్డిలో ఒకపక్క తేగలపాతళ్లు ఉన్నాయి. ఆ పాతళ్లలో తేగలు, బుఱ్ఱగుంజూ దొరుకుతాయి. రుచి చూద్దువు కాని.”
రథం యశోదనాగనిక ఇంటిముందు ఆగింది. ఇంటిలోనుంచి పిల్లలు, “చిన్నత్త వచ్చిందో” అంటూ రథందగ్గరకు పరుగెత్తుక వచ్చారు. ఇంటి చాకళ్ళువచ్చి సామాను లోపలికి చేరవేశారు. యశోదనాగనిక తల్లి వచ్చి ఇరువురు బాలికలకు పారాణినీరు దృష్టితీసి లోనికి తీసుకుపోయింది. “పట్నం నుంచి ఏమి పట్టుకువచ్చావు చిన్నత్తా” అని ఒక చిన్న బాలకుడు. యశోద ఒక బిడ్డ తరువాత ఇంకోబిడ్డను ఎత్తుకొని ముద్దులాడి, రాకుమారి మహానస గృహానవుండే అపూపాలు మొదలయినవి లక్కబరిణలలో నుంచి తీసిబిడ్డలకు పెట్టనారంభించింది. ఇంతలో ఆగది గుమ్మందగ్గరకు ఒక ఆజాను బాహుడగు యువకుడు అందాల మిసిమివయసువాడు వచ్చి “చెల్లీ, ఎప్పుడు వచ్చావే?” అని ప్రశ్నించినాడు.
అడివి బాపిరాజు రచనలు - 6
64
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)