ఆ యాలోచననే నరసింహవర్మ తండ్రికి వేగు బంపినాడు. విష్ణువర్ధనుడు పుట్టెడు బుద్దుల పొట్టివాడనియు జండ విక్రముడనియు నాతని ధాటిని నీ సమయమున నెవ్వరు నాపలేరనీయు గావున విష్ణువర్ధనుని సగౌరవముగ దండ్రిగా రాహ్వానించి కొంచెము పెద్దమొత్తమును సమరాజోప గ్రాహ్యముగ నర్పించుడనియు, నుత్తముడైన యతిధి వచ్చినప్పుడు సేయదగు వినోదములన్నియు జేయింపుడనియు గుమారుడు నరసింహవర్మ తండ్రికి రహస్య సందేశ మంపెను.
కావున విష్ణువర్ధనుడు విక్రమసింహపురమునకు వచ్చునప్పటికి నగరపాలకులు, రాజప్రతినిధియైన సేనాపతియు, విష్ణువర్ధను నెదుర్కొని, సర్వోపచారముల నతని కర్పించుచు గోటను ప్రవేశపెట్టిరి. మూడుదినములైన వెనుక పల్లవ ప్రధానియు రాజపురోహితుడును, పల్లవ మహారాజు ప్రేమతో విష్ణువర్ధను నాహ్వానించుచున్నట్లున్న లేఖను గొనివచ్చిరి.
విష్ణువర్ధనున కేదియో అనుమాన ముదయించెను. చాళుక్యులకు నిత్యవిరోధియైన పల్లవేంద్రు డొక్కడు తన్నిట్లు సగౌరవముగ నాహ్వానించుటలో నంతరార్థమేదియో యుండవలెనని యాతడనుకొనెను. ఇంతలో నాతని మనసున మెరుపు మెరిసినట్లు పల్లవ రాజు తన కంపిన యాహ్వానమున కర్థము గోచరించినది. తనయన్న పులకేశి చక్రవర్తి మూడవ కుమారుడు పదునారేండ్లవాడయినను వీరవిక్రముడు. ఆ బాలకునోడించి, తొల్లిపరాభవము దీర్చుకొనవలెనని పల్లవ యువరాజు నరసింహవర్మ కందనోలుపై (కర్నూలు) దండు వెడలినాడు. ఆదిత్యవర్మ మేనమామలైన కదంబులను సహాయమడిగి సైన్యముల రప్పించుకొన్నాడు.
చాళుక్యులను స్నేహితులుగ మహేంద్రవర్మ పరిగణించినచో, యువరాజగు నరసింహవర్మను కుమారుడగు నాదిత్యవర్మపై బంపుటేల! దీనికి బ్రతి తాను కాంచీపురముపై దండెత్తుటమాని, పడమటకు జైత్రయాత్ర మరలించి తొందర తొందరగ బ్రయాణము సాగించుచు బది దినములలో, గందనోలు ముట్టడించి, యుద్దము సాగించుచున్న నరసింహవర్మపై బడుటయే! అనుకొనుట యేమి ఆతడట్లొనరించినాడు.
నరసింహవర్మ చేయునదిలేక పరాజితుడ నైతినని ఖడ్గమర్పించినాడు. విష్ణువర్ధను డన్నకుమారు నాదిత్యవర్మను గలిసి, యాతని గాఢముగ గౌగిలించుకొని, నరసింహవర్మ ఖడ్గము నాతనికి బహూకరించెను.
విష్ణువర్ధనుడు తన ద్వితీయోపసేనాధిపతి ఇంద్రదత్తుని సైన్యాధిపతిగజేసి, విక్రమసింహపురమున (నేటి నెల్లూరు) గావుంచినాడు. మూడువంతుల సైన్యమును విక్రమపురము ననే యుండ నేర్పాటుచేసినాడు. ఏనుగులు, గుఱ్ఱములు, భూషణములు విష్ణువర్ధను నకర్పించి, నరసింహవర్మ కాంచీ పురమునకు దరలిపోయినాడు. విష్ణువర్ధను డాతని వెనుకనే చళుక రాష్ట్రమున నధిపతియొద్ద కప్పముగొని, పదునైదు దినములలో విక్రమ సింహపురము తిరిగి వచ్చెను.
పల్లవులతో దనకు విరోధము లేదనియు, పోక రాష్ట్రమునకు దక్షిణమున పల్లవులు నిరాటంకముగ బరిపాలించ వచ్చుననియు దన యన్నగారు చాళుక్య చక్రవర్తి తన్నాంధ్ర
అడివి బాపిరాజు రచనలు - 6
269
అంశుమతి (చారిత్రాత్మక నవల)