పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శక్తిశ్రీ సాలంకాయన: స్త్రీలు యుద్ధసన్నద్ధలై అలా వెళ్ళడం మన ఆచారంకాదు ఇక్ష్వాకు మహాప్రభూ!

మహాశ్రీ బృహత్పాలాయన: ఇది తాము పంపించినదా?

ధనకప్రభవు: మన వారి ఉద్దేశం మహారాజుకు తెలియదు.

వాసిష్ఠి ఉదయశ్రీ: మా మరదలు శాంతిశ్రీదేవి సేనానాయకురాలై ఆ సైన్యాన్ని నడుపుతున్నదట.

మాఠరగోత్రజుడు ఆనందశ్రీ: మా మనుమరాండ్రందరూ కూడా ఉన్నారని వినికిడి.

(4)

శాంతిమూలప్రభువు: మహాప్రభువులందరికీ నా మనవి ఒక్కటే ఉంది. పూంగీయ మహారాజ్ఞి బౌద్దదర్మాభిరత. ఆమెకు బౌద్ధక్షేత్రాలన్నీ దర్శనం చేయాలని కోరిక పుట్టింది. ఆమె పూంగీయమహారాజు అనుమతి అడిగి తనకడ ఉండే నారీ సైన్యాన్ని వెంటబెట్టుకొని యాత్ర ప్రారంభించింది. ఇందులో మనం భయపడవలసిన పని ఏముంది? ఆమెకూ రాజకుమారికలకూ సైన్యానికీ ఆపత్తు ఏదన్నా వస్తుందంటే వెంటనే మనసైన్యం శరవేగంతో అక్కడకు వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తుంది.

మాఠరిప్రభువు: మహాప్రభూ! ఆపద వచ్చినవెనుక మనకు తెలియడ మెప్పుడు? మన సైన్యాల్ని పంపడమెప్పుడు?

ధనకప్రభువు: మహాప్రభూ! నన్ను వెంటనే సైన్యాలతో వారికి సహాయంగా వెళ్ళుమంటే....

వాసిష్ఠప్రభువు: నేను సిద్దంగా....

సాలంకాయనప్రభువు: నేను వెంట.....

బృహత్పాలాయనప్రభువు: నేనూ అంతే!

శాంతిమూల: మీ కందరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత!

పూంగీయ మహారాజు: మహాప్రభూ! మాకందరకూ వెంటనే అనుజ్ఞ ఈయ కోరుతున్నాను.

శాంతిమూలమహారాజు: (చిరునవ్వునవ్వి) నేను మూడుదినాలపాటు ఆలోచించి తమకందరికి మనవి చేస్తాను. నేను మూడు దినాలు వ్యవధి ఎందుకు అడిగానో అదిన్నీ మనవి చేస్తాను.

మహారాజు ఈ మాటలు అనగానే సభ సమాప్తమయింది. మహారాజులందరు దగ్గరిచుట్టాలు. అందరు ఈ విచిత్ర సన్నివేశం ఎప్పుడూ ఎరుగము అనుకున్నారు. శాంతిమూలుడు తిన్నగా పట్టపురాణి మాఠరీ సారసికాదేవి అంతఃపురానికి వెళ్ళినాడు. సారసిక భర్తపాదాలు కడిగి నీళ్లు తలపై జల్లుకుని, పూజించి ఆ పూవులు తలలో పెట్టుకున్నది.

సారసికాదేవి: అవధారు!

శాంతి: దేవీ! అమ్మాయి మేనత్తతోకలిసి వెళ్ళింది. మా చెల్లెలు ఈ ప్రయాణం ఎందుకు తల పెట్టిందో?

సార: ప్రభూ! వదిన హృదయంలో ఉన్నదే మా అందరి హృదయంలో ఉంది.

అడివి బాపిరాజు రచనలు - 6

• 208 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)