పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాంతి: విన కుతూహలం కలిగినది.

సార: ధర్మం విచ్ఛిన్నం అయిపోతున్నదని అందరి హృదయాలలో భయం ఉద్భవించింది. అతడు కొంత సేపాగి,

శాంతి: ధర్మం విచ్చిన్నం అవడం ఎలా సాధ్యం?

సారసిక చటుక్కున భర్త పాదాలకడ చతికిలబడింది. ఆ అరడుగుల మహోన్నత రూపుడు, శాంతిమూలుడు దేవిని ప్రేమతో లేవదీసి తన ప్రక్క సింహాసనంమీద కూర్చుండబెట్టుకున్నాడు.

దేవి తలవంచి, “ప్రభూ! నాకు ఏమీ కాంక్షలు లేవు. అది మీకు తెలుసును” అన్నది.

“దేవీ! అది నాకు నువ్వు చెప్పాలా? నీ హృదయం ఈనాటి స్త్రీలలో ఎవరికి ఉంది?”

“నేను సామ్రాజ్ఞిని కావాలని ఆశించుటలేదని హృదయేశులే బాగా ఎరుగుదురు.”

శాంతమూలుడు పల్చని బంగారు శలాకవంటి తన మహారాణిని అవబృధ స్నాతమైన సారసికాదేవిని తన హృదయానికి అదుముకొన్నాడు.

“ఎవరైనా నీకు ఇసుమంతైనా కాంక్ష ఉందని అనగలరా, దేవీ?”

“కాని ధర్మరక్షణకోసం తాము చక్రవర్తి సింహాసనం అధివసించి తీరాలి. ధర్మసంస్థలు, బ్రాహ్మణ వంశాలు, ప్రజాకోటి క్షేమంగా ఉండాలంటే, దేశంలో కాటక మహారాక్షసి అవతరించకుండా ఉండాలంటే, తాము చక్రవర్తులు కావాలి. ఈనాడు మన కందరు చుట్టాలు. రేపు వారిలో వారు రాజరాజాధిపత్యం కోసం యుద్ధాలు చేయవచ్చును. మహా ప్రభూ! ఇవన్నీ మేము ఆలోచించాము. మా వదినగారు తాను చేసేపనికి సహాయం చేయమని మాత్రం మమ్ము కోరింది. మా పరిచారికలలో దిట్టమయిన వారి నందరికి తాను వీరాంగనలుగా శిక్షణ ఇచ్చింది. బిడ్డల నందరిని తీసుకువెళ్ళింది. ఆమె అంటే మా కందరికి సంపూర్ణ విశ్వాసం. అంతకన్న నాకు ఏమీ తెలియదు ప్రభూ!” శాంతి మూలుడు విశాలమైన తనపాలాన బొమలు ముడివడ ఆలోచించి ఒకసారిగా చిరునవ్వు నవ్వినాడు.

(5)

వీరాంగనాసైన్యం మహావేగంతో ప్రతిష్టానపురం చేరింది. ఆ మహానగరంలో ఇప్పుడెవ్వరూ చక్రవర్తి ప్రతినిధిగా లేరు. ఒక సేనాపతి గండర గండలయిన వీరులతో కాపలా కాస్తున్నాడు. శాంతిమూల మహారాజు చెల్లెలూ, మేనకోడళ్లూ, ఆయన కొమరితా సైన్యాలతో వ్యాఘ్రానదీ సంఘారామం వెళుతూ వచ్చారని ఆ సేనాపతి - భోజుడయిన కుమారదేవుడు విన్నాడు. ఏమి చెయ్యాలో అతనికి తోచలేదు. ఏ కారణంచేతనో స్వామికడనుండి ఎట్టి వార్త రాలేదు.

తమ్మందరినీ మోసంచేసి ఓడించిన ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారి ఈ స్త్రీ సైన్యంలో ఉంది. స్త్రీల సైన్యం రావడమే చాలా కొత్తగా ఉంది కుమార భోజునికి. అలాంటిది ఆ

అడివి బాపిరాజు రచనలు - 6

• 209 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)