పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

అబలాసచ్చరిత్ర రత్నమాల.

వెనుకనుండి వచ్చుచున్నదనిన వదంతి నొకదానిని మరాఠా వారి సైనికులకుఁ దెలియునట్లుచేసెను. అందువలన వారు తమకు గెలుపు దొరకుట దుస్తరమని యనుకొని తెల్లవారిన తోడనే తమసైన్యమును వచ్చినత్రోవనేమరలఁ గొనిపోయిరి. రాణీసాహెబుకువరు జయము గాంచి విశేషవైభవముతో మరలి పటియాలకు వచ్చి మహావైభవముతో రాజ్యపరిపాలనము చేయుచుండెను. కొన్నిదినములు నడచినపిదప నారాజ్యమునందు కొందఱు రాజద్రోహులై రాజ్యమునందంతట ననేక యుపద్రవములను జేయుచుండిరి. అప్పుడు రాణీసాహేబుకువరు తానుగొంతసైన్య సహితమయి నహనను పట్టణమున కరిగి యచట మూడు నెలలు వసియించి యా రాజద్రోహుల నందఱిని రూపడంగించి రాజ్యమును సుఖప్రదముగాఁ జేసి మరలి పటియాలకు వచ్చి యెప్పటివలె రాజ్యపాలనము చేయుచుండెను.

ఈమె రాజ్యము నేలుటవలన రాజునకు, సహచరులగు దుష్టులకుతంత్రము లేమియు సాగవయ్యె అందువలన వా రామెకు శత్రువులయిరి. చట్టా సంస్థానాధీశ్వరుఁడగు సరదార్ గురుదాసు సింహునిబిడ్డయు, రాజునకుఁ బత్నియునైన ఔస్కువరు రాజ్యము నేల సమర్థురాలును యువరాజునకుఁ దల్లియు నైనందువలన నామెయు నాఁడుబిడ్డ రాజ్య మేలుటకు సమ్మతింపదయ్యె. రాజ్యమునందంతటను రాణీసాహేబు కువరుకు విరోధులు బహుజను లగుటవలన వా రామెపై ననేకదోషములను మోపసాగిరి. వారామెయందు ముఖ్యముగాఁ గనిపెట్టిన గొప్ప నేర మేదనఁగా నహనుపట్టణములో జరిగిన మహాయుద్ధమునందు జయము గాంచినందుకై యచటిసామంత రా జామె