పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణీసాహేబ్‌కువరు.

181

కిచ్చిన మత్తగజము నామెరాజున కియ్యక తానే యుంచుకొనుట ఆమె శౌర్యమహిమవలన దొరకిన బహుమతి నామె యుంచుకొనఁదగదఁట. ఆమె సహోదరుని యాజ్ఞను బొందకయే తనజహగిరిలో నొకకోటను గట్టెను. అదిరాజునకుఁ గోపము వచ్చుటకుఁ గారణమయ్యెను. రాజల్పబుద్ధి గలవాఁడు గాన తనకామె చేసినమేలును మఱచి యామె నామెభర్తకడ కరుగుమని చెప్పెను. అందువలన నామె రాజధానిని విడిచి తనజహగిరిలోనున్న కోటలోనికిఁ బోయి యచటనే వసియించెను. యామె యచటనుండి తన కేమి యపాయము చేయునో యని భయపడి రాజు కొంతసైన్యము తీసికొని యామెతో యుద్ధమున కరిగెను. కాని బుద్ధిమంతులు కొంద ఱతనితో స్త్రీతోడి కలహమున కరుగుట యుచితము గాదని చెప్పి యతని ప్రయత్నమును మాన్పి వారిరువురకును సంధిచేయ నెంచి రాణిని పటియాలకుఁ బిలువనంపిరి. కాని యామె పటియాలకు వచ్చుచుండఁగా రాజు తనను పిలిపించి చంపునని యామెకుఁ దెలిసినందున నామె మరలి తనకోటలోనికిఁ బోయెను. కాని రాజు మరల నామెను నమ్మించి తననగరమునకుఁ బిలిపించి కారాగృహమునం దుంచెను. ఆమె యచటఁ గొన్ని దినములుండి యొకదినము తనబట్టలను దనదాసికి నిచ్చి దానిబట్టలను దాను గట్టుకొని యుపాయముగానందుండి బయలుదేరి తనకోటలోనికి వచ్చిచేరెను. తదనంతర మామె 1799 వ సంవత్సరమునందు పరలోకమున కేఁగెను.