పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ముహూర్తము తెలియుటకయి నీటిలో ఘటికాయంత్రము (సన్నచిల్లి గలగిన్నె) నొకదాని నునిచి, పురోహితసమేతుఁ డయి ముహూర్తము నెదురు చూచుచుండెను. అంతఁ గొంత సేపటికి లీలావతి యాగిన్నెలోనికి నీరు వచ్చువిధము చూడగోరి కొంచెము జరిగి చూచుచుండెను. అట్లు చూచునపు డామె శిరోభూషణమునం దుండిన యొక సన్ననిముత్య మాగిన్నెలోఁబడి నీరు వచ్చుమార్గము నరిగట్టెను. ముత్యము పడిన సంగతి యెవరును చూచినవారుకారు. ఎంతసేపు చూచినను గిన్నె మునుఁగకుండుటఁ గని దానికారణము నెఱిగి ఆచార్యులవారు హతాశులయి యేదో యొక ముహూర్తమునందు లీలావతి వివాహము గావించిరి.

వివాహానంతరము స్వల్పకాలములోనే లీలావతికి వైధవ్యము ప్రాప్తించెను కూఁతున కిట్టిదురవస్థ సంభవించినందునఁ దండ్రి మిగుల పరితపించెను. కాని యాయన యంతటితోఁ దనకొమార్తె జన్మమునిరర్థకమని తలఁపడయ్యెను. లీలావతికి సంసార సౌఖ్యము లేక ఫొయినను ఆచార్యులవా రామెకు విద్యానంద మొసంగఁ దలఁచిరి. లీలావతి యదివఱకే విద్యావతి యగుట వలన నామెకుఁ దండ్రి గణితశాస్త్రమును నేర్పసాగెను. లీలావతియు విద్యాభిరుచి గలదై తనదు:ఖమును మఱచి సదా గణితాభ్యాసమే చేయుచుండెను. కొన్నిరోజుల కామెకు గణితశాస్త్రమునం దపారపాండిత్యము గలిగెను. ఈమె తనగణిత ప్రావీణ్యముచేత గణించి యరగంటలో వృక్షమునకుఁ గల యాకులసంఖ్య చెప్పుచుండెనని యొకలోక వార్త గలదు. ఈలోకవార్తయెంతమాత్రమును నమ్మఁదగినది గాక పోయినను,