పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

135

స్వల్పసైనికులతో నొకయబల యోడించి పంపుట యెంతయు వింతగదా! అచటినుండి బయలుదేరి యారాత్రియామె కాల్పీనగరమున నానాసాహేబునొద్దఁ బ్రవేశించెను. ఇట్లు నిద్రాహారములు లేక యామె యశ్వారోహణము చేసి 108 మైళ్ళుప్రయాణముచేసెను. దీనినిబట్టిచూడఁగా నామెధైర్యమును అశ్వారోహణశక్తియు నందఱికి నత్యద్భుతమని తోఁచక మానదు.

రాణీలక్ష్మీబాయిగారు కాల్పీకి వచ్చినసంగతి విని బందేవాలానవాబు సహితము తనసైన్యములతో రావుసాహెబు పేష్వాగారికి సహాయుఁ డయ్యెను. వీఱందఱును తమసైన్యముల యుద్ధసన్నద్ధములుగాఁ జేయుచుండిరి. రాణిగారిశౌర్యము నెరిగియు రావుసాహెబు పేష్వా గారు తనకుఁ కలస్వాభిమానము వలనఁ దనసర్వసేనాధిపత్యమును నొకస్త్రీ కిచ్చుటకు సమాధానపడఁడయ్యె. కాన రాణిగారు కొంతవఱకు యుద్ధమునందు నిరుత్సాహు రాలయియుండిరి.

సర్ హ్యూరోజ్ దొరగారు ఝాఁశీనుండి బయలుదేరి కాల్పీని గెలుచుటకయి సైన్యసమేతముగా రాత్రిం దినప్రయాణములు చేయుచు కాల్పీ సమీపమునందలి కూచయనుగ్రామమున పేష్వాగారి సైన్యముల నెదిరించిక్షణములో నోడించిరి. కాన పేష్వా, బందేసంస్థానపు నవాబు మొదలగువారితో రాణిగారు కాల్పీకి వెళ్ళవలసివచ్చెను. ఆసమయమునం దామె సొంత సైన్యము లేనందున పేష్వాగా రామెను మన్నింప నందునను ఈయుద్ధమునం దామె ప్రతాప మేమియుఁ దెలిసినదికాదు. కాని కాల్పీకి వెళ్లినపిదప నామెసైన్యము బందోబస్తునుగుఱించి తనయభిప్రాయము పేష్వాగారికిఁ దెలిపెను. అప్పుడాతఁడు