ఇట్లచ్చమాంబగారు పెద్దలయొక్క ప్రేరణగాని, పాఠశాలకు బోవుటగాని, తనకు సంభవింపకపోయినను స్వయంకృషిచే నిన్ని భాషల నందింతటి సామర్థ్యము సంపాదించుటయే కాక, అప్పుడు పైబడిన సంసారభారము చక్కగ వహించుచు, ఊలుఅల్లికలు, దారపు అల్లికలు, మొదలగు ననేకములగు నల్లికపనుల యందును, గుట్టుపనుల యందును, గృహిణీభూషణములగు గొప్ప గొప్ప వంటకముల యందును గూడ నిరుపమాన నైపుణ్యము గడించెను. ఈమె యెపుడు దన యింటిపను లితరులచే జేయించుకొని యెరుగదు.
ఇట్లనేక విద్యలయందును, గృహకృత్యములయందును విశేష నైపుణ్యము గల్గి, తనకుగల సవతికూతుతో నీటితో బాలవలె గలిసి వివేకవతి యయి కాపురము చేయుచుండ, నచ్చమాంబగారి కొక పుత్రుడును, బుత్రికయును గల్గిరి. ఇంతలో ధనవంతుడు లోకదీపముగా గాను సృజించిన యీ సాధ్వీరత్నము యొక్క హృదయగాంభీర్యము లోకమునకు ప్రర్శించుటకును, దదవకాశము నీమెచే ననేకములగు మేళ్లను జేయించుటకును దలచి, ఈమెకుగాను దయచేసిన పుత్ర, పుత్రికలను బరలోకగతులను జేసెను.
"ఖండితంబయ్యు భూజము వెండిమొల్చు
క్షీణుడయ్యును నభివృద్ధి జెందు సోము
డివ్విధంబు విచారించి యెడలు తెగిన
జాములకు గానమొందరు సాధుజనులు."
మరియు నాపదలయొక్క రాపిడి గలిగినపుడే గదా మహాజనుల ధైర్య గుణము ప్రజ్వరిల్లును. అచ్చమాంబ గారు తన కిట్లు పుత్ర పుత్రికావియోగము వలన గల్గిన దు:ఖము నెట్లు సమన్వయించుకొనెనో కనుడు! పురుష శ్రేష్ఠులకు గూడ నసాధ్యమైన రచనాసామర్థ్యముతో వొప్పుట్టియు, దనకుదానే సాటియగు నట్టియు, సోదరీలోకంబు కనుపమేయ ఫలదాయకం బగునట్టియు, వేయేల; యనిర్వచనీయ మహిమాడ్యమగు ట్టి "అబలా సచ్చరిత్ర రత్మమాల" యను నుదాత్త సద్గ్రంథరచనకు గారణ మచ్చమాంబగారికి బుత్ర పుత్రికా వియోగమే. అచ్చమాంబగారు పుత్రపుత్రి వియోగదు:ఖమున నుండగా