వంశము నాశమొందుటకు వగచి భీమసింహుని కనిష్ఠపుత్రుని నొక దాదిచేతికిచ్చి సమీపారణ్యమునకు బంపిరి. పిదప వారందరు రాజవంశమున కంకురముగలదని నిశ్చయించుకొని సమరరంగమున కరిగిరి. ఆదిన మా రజపూతుల శౌర్యాగ్ని మరింత ప్రజ్వలింప వారు శత్రువులకు మిగుల దుస్సాధ్యులని తోచిరి. కాని విస్తీర్ణమగు మ్లేచ్ఛసైన్యము ముందల్పమగు రజపూత సైన్యమున కెట్లు జయముదొరుకును? ఆ సాయంకాలము వరకు క్షత్రియ వీరులందరు వీరస్వర్గమున కరుగగా జయలక్ష్మి అల్లాఉద్దీనునే పొందెను.
భీమసింహునితోడ సకల రాజపుత్రులును యుద్ధమున మడియుట నగరమునందుండిన స్త్రీలకు దెలియగా, పద్మినియు సకల రజపూతుల భార్యలును, పాతివ్రత్య రక్షణమునకై అగ్ని ప్రవేశముచేయ నిశ్చయించుకొనిరి. ఇట్లువారు కృతనిశ్చయురాండ్రై యొక గొప్పచితి బేర్చి దాని కగ్ని ముట్టించిరి. అందుపై పద్మిని తాను ముందాయగ్నియందు దుముకగా నందరు స్త్రీలును దుమికిరి. (ఈ యగ్ని ప్రవేశమునే రజపూతులు జోహారు, లేక జహరవ్రతమనియెదరు) బాదుషా విజయానందముతో పురప్రవేశము చేయగా నా గ్రామమంతయు చితామయమయి యుండెను. అందు తానింత ప్రయత్నము జేసి చేకొనదలచిన పద్మిని దేహము భస్మమయి యుండగా జూచి, అల్లాఉద్దీను మిగుల వగచెను. యుద్ధమునకు బ్రయాణమైనపుడు భీమసింహుడే స్త్ర్రిల నందర నొక గుహలోనికి దోలి యా గుహను మూసి గుహద్వారమున కగ్ని యంటించెనని కొందరు చరిత్రకారులు వ్రాసియున్నారు.