పుట:Aandhrakavula-charitramu.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

692

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

            క. తన బ్రతుకు భూమిసురులకుఁ
               దన బిరుదులు పంటవంశధరణీశులకున్
               దన నయము భూమి ప్రజలకు
               ననవేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్.

ఈ పద్యములతరువాత సంబంధ మేమియుఁ దెలుపకయే లింగారెడ్డి తేఁబడి తదాదిగా కృతిపతియైన రాఘవ రెడ్డివఱకును వంశము చెప్పఁబడినది. కృతిపతిని సంబోధించెడి చతుర్థాశ్వాసాంతమునందలి యీ క్రింది పద్యమునందు బసవయరాఘవరెడ్డి సరిగా ననవేమభూపాలుని వంశమువాఁడనియే చెప్పఁబడినది.

           మ. అనవేమక్షితిపాన్వయోత్తమ! సముద్యద్వైభవోపేంద్ర ! కాం
               చనభూమీధరధైర్య ! శాశ్వతయశస్సంపన్న ! దైతేయశా
               సనపూజాపరతంత్ర ! నామితరిపుక్ష్మాపాలకోటీర ! శాం
               తనవప్రాభవ ! సత్కవీంద్రకవితాతాత్పర్య ! శౌర్యోన్నతా!

కృతిపతియైస రాఘవరెడ్డిపైని జెప్పఁబడినట్లన వేమక్షితిపాన్వయుఁడే యయిన పక్షమున, అనవేముఁడు పురుషసంతానము లేనివాఁ డగుటచేత నాతనిపుత్రసంతతివాఁడు గాక దుహితృసంతతివాఁడయి యుండవలెను. లేదా యనవేముని పినతండ్రి సంతతిలోనివాఁడయి జ్ఞాతివర్గమునఁ జేరిన వాఁడయి యుండును. కృతిపతిజనకుఁడైన తమ్మయబసవరెడ్డియుఁ దరువాత నీరాఘవ రెడ్డియు ప్రౌఢదేవరాజాదులగు కర్ణాటకచక్రవర్తులచేత నుదయగిరి రాజ్యపరిపాలకులుగా నియమింపఁబడి చిన్న సంస్థానమునకు ప్రభువులయి యుండినట్టు కనుపట్టుచున్నది.

            క. వారలలోపల బసవ
               క్ష్మారమణుడు పేరుపెంపుగల మన్నీఁడై
               భూరిప్రతాపజయల
               క్ష్మీరతుఁడై వెలసె నుదయగిరిరాజ్యమునన్