పుట:Aandhrakavula-charitramu.pdf/718

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

691

వె న్నె ల కం టి సూ ర న్న

ఈ విష్ణుపురాణ మలసాని పెద్దన్న ప్రబంధరచనకు దారితీయుటకుఁ గొంత కాలము ముందుగా పదునైదవ శతాబ్దాంతమునఁ జేయబడినదిగా నున్నది. ఈ కవి శ్రీనాథాదులను దన పుస్తకమునందుఁ బూర్వకవులను గా స్తుతింపక,

          ఉ. మున్నిటికాళిదాసకవిముఖ్యులకుం బ్రిణమిల్లి వారిలో
              నెన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కనసోమయాజినిన్
              నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాధునిన్
              వెన్నెలగంటిసూర్యుఁ బదివేలవిధంబుల గొల్చి భక్తితోన్

అని వెన్నెలగంటి సూర్యునికాలమువఱకు నున్నకవులను మాత్రమే స్తుతించినను, ఇతఁడు శ్రీనాథాదుల కాలమునకుఁ దరువాతివాఁడయినట్టు విష్ణుపురాణకృతిపతియైవ రావూరి రాఘవరెడ్డి కృతు లందిన తన పూర్వులను గూర్చి చెప్పిన యీ క్రింది పద్యమువలన తేటపడుచున్నది.
  
          క. ఆనవేమమండలేశ్వరుఁ
             డును వళ్ళయవీరభద్రుఁడును మొదలుగఁ గ
             ల్గినతొంటిరెడ్డిరాజులు
             ఘనకీర్తులు గనిరి కృతిముఖంబున ననుచున్.

శ్రీనాథునిచేఁ గాశీఖండము కృతినంది 1435 వ సంవత్సరప్రాంతములం దుండిన వీరభద్రరెడ్డిని తన పూర్వులలో నొకనిగా కృతిపతియైన రాఘవరెడ్డి చెప్పుటచేత విష్ణుపురాణము రచియింపఁబడినకాల మటు తరువాత నేఁబది యఱువది సంవత్సరములయిన నయి యుండవచ్చును. కృతిపతియైన రాఘవరెడ్డి యనవేమారెడ్డి వంశజుఁడని చెప్ప నుద్దేశించిన పద్యములీ విష్ణువురాణములోఁ గొన్ని కలవు.
  
         ఆ. అట్టి పంటకులమునందు నేడవ చక్ర
             వర్తి యన్న వేమవసుమతీశు
             డుద్బవించి కీర్తియును సత్ప్రతాపంబు
             నెసఁగ భూమి యేల్ల నేలుచుండె.