పుట:Aandhrakavula-charitramu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

ఆంధ్ర కవుల చరిత్రము




క. ఆదిని భీమకవీంద్రుడు
   గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున నా
   మీఁదట రాజనరేంద్ర
   క్ష్మాదయితునిపట్టి దాని మహి వెలయించెన్ [ ఆ.1-51 ]

అను పద్యములు కనఁబడుచున్నవి. అంతేకాక పింగళి సూరకవి విరచితమైన రాఘవపాండవీయమునందును దత్కృతివతి యగు వేంకటాద్రిరాజు కవి నుద్దేశించి,

 "శా. రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
      కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగునే నోహో యనం జేయదే !
      పాండిత్యం బిఁక నందునుం దెనుఁగు కబ్బం బద్భుతం బండ్రు ద
      క్షుం డెవ్వాఁ డిల రామభారతకథ ల్జోడింప భాషాకృతిన్.


  ఉ. భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయెకాని యందు నొం
      డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన; రటుండ నిమ్ము
      నా నా మహితప్రబంధరచనా ఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్
      నా మదిఁ దద్వయార్ధకృతినై పుణియుం గల దంచు నెంచెదన్."
                                          [రాఘవ-పీఠిక–10, 11]


లని యన్నట్టు చెప్పఁబడి యున్నది. ఈ రెండు పుస్తకములలోను వ్రాయఁ బడినదానినిబట్టి చూడఁగా భీమకవి రాఘవపాండవీయమును రచించినట్టును అది యే హేతువుచేతనో నశించినట్టును స్పష్ట మగుచున్నది. ఆ పుస్తకము నశించుట కప్పకవి చెప్పినదానినిబట్టి యొక వేళ నన్నయభట్టు కారకుఁడయిన నయి యుండు ననుకొన వచ్చును గాని యీ యిరువురు కవులును సమకాలీనులు కాకపోవుటచేత నీయూహ కవకాశము లేశమును లేదు. ఈ ప్రకారముగానే యధర్వణాచార్యుని భారతమును గూడ నన్నయభట్ట డఁగఁద్రొక్కినట్టు లోక ప్రతీతి కలదు. అధర్వణాచార్యుఁడు భారతమును దెనిఁగించి దానికి రాజనరేంద్రుని కృతిభర్తనుగాఁ జేసి బహుమానమును పొందవలయునని రాజమహేంద్రవరమునకు వచ్చి నన్నయభట్టునకు