పుట:Aandhrakavula-charitramu.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

562

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యందు-ఆ రాజ్యమును తురుష్కులనుండి యుద్దరించుట యటుతరువాత జరిగి యుండవలెను. పోలయవేముని శాసనము లించుమించుగా 1320-వ సంవత్సరమునుండియుఁ గానఁబడుచున్నందున, ఆ సంవత్సర ప్రాంతమునందే యాతని యాంధ్రదేశపరిపాలన కాలమారంభమయి యుండవలెను. పోలయనాయకుఁడు త్రిలింగ దేశమును ముష్కర తురుష్కహస్తములనుండి విడిపించి కొంతకాల మేలుటయు, తదనంతరమునందు కాపయ నాయకుఁ డా రాజ్యభారమును వహించి కొంతకాల మేలి స్వర్గసుఁడగుటయు, అతని తరువాత పోలయవేముఁడు ప్రభుత్వమునకు వచ్చుటయు, అంతయు నొక్క సంవత్సరములోప జరిగెననుట యసంభావ్యము గాన, నిది కల్పితకథ యయి యుండవలెను. ఇందుఁ బేర్కొనబడిన పోలయ నాయకుఁడు పోలయ వేముని తండ్రియే యయి, వేముఁడు ప్రోలయయనంతరముననో కాపయయనంతరముననో రాజ్యమునకు వచ్చుట నిజమయి యుండినయెడల ప్రోలయ వేమారెడ్డికే యంకితము చేయబడిన హరివంశమునం దెఱ్ఱా ప్రెగడ యీ యంశము నించుకయైన సూచించియైననుండఁడా ? శ్రీనాథవిరచితములయిన గ్రంధములలో నెల్ల కాశీఖండ మే కడపటి దయినట్టు కనబడుచున్నది. ఇది రచియించునప్పటి కీ కవికి డెబ్బది సంవత్సరము లుండి.ను, దీనియందు కవితాపటిమ యెంతమాత్రమును కొఱవడక బహు కావ్యరచనచేత నాఱితేఱినదానివలెనే చూపట్టుచున్నది. కాశీ ఖండరచనానంతరమున నల్పకాలములోనే రాజమహేంద్రవరపు రెడ్డిరాజ్యమునకు సహితము వినాశము సంభవించెను.

శ్రీనాధుఁడు లాక్షణికుఁడయిన గొప్పకవి. ఇతని కవిత్వము సంస్కృతపద భూయిష్ఠమయి రసవంతమయి యుండును. మొత్తము మీద నీతని శైలి సులభమైనది కాదు. ఇఁతడు రచించిన గ్రంధము లన్నిటిలోను నైషధము శృంగారరస ప్రధానమై ప్రౌఢముగా నుండును. దీని నాంధ్రకావ్యపంచకములోఁ బ్రధానమైనదానినిఁగాఁ జెప్పుదురు.

ఇతఁడు శివభక్తుఁడు యౌవనదశయందు శృంగారనాయకుఁ డయి స్త్రీలోలుఁడై తిరిగెనని చెప్పుదురు. అది యెంత నిజమో కాని వయసు