పుట:Aandhrakavula-charitramu.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

455

బోయెడు కుమారుఁడు బ్రతుకు ననియు, వంశమువారికిఁ దనపేరు పెట్టుచు వచ్చినయెడల వారు మహాధనవంతులును, ప్రభువులును నయి భువనమునఁ బ్రఖ్యాతిఁగాంతు రనియు, తన మూలమున వచ్చిన ధనములో సగము ధర్మార్ధముగానుపయోగింప వలసినదనియు చెప్పెనఁట! అల్లాడ రెడ్డి దాని కొప్పుకొని తరువాతఁ బుట్టిన తన కొమారునకు తండ్రిపేరితోఁజేర్చి కోమటి పోలయ (వేమన) యని పేరు పెట్టెను. ఆతcడు చిరకాలము జీవించి మహాధనికుఁ డయి తన పంటకులపురెడ్లలో వన్నె వాసి గాంచి తన ధనమును త్యాగభోగముల యందు సద్వినియోగము చేయుచు వచ్చెను. ఈ కోమటి ప్రోలయయే కొండవీటి పంటరెడ్ల వంశమునకు మూలపురుషుఁడయ్యెను. ఆతని పుత్రులు మహాశూరులయి పతాపరుద్రునియొద్ద దండనాథులయిరి. అల్లాడ రెడ్డియింటి పేరు దొంతివా రనియు, దేసటివా రనియు కూడ నుండి యుండును. ఈతఁడు కోమటియెుక్క కుండలదొంతిని సంగ్రహించుట దొంతివాఁ డయ్యెనని యొక కథ గలదు. ఈ యల్లాడ రెడ్డి మిక్కిలి పాటుపడువాఁడయి విశేషధనము నార్జించి ప్రసిద్దికెక్కి యుండును.

ఆతని కంత ధనము వచ్చినందుకుఁ గారణముగాఁ దరువాత నీకథ కల్పింపఁబడి యుండును. కథయెట్టిదయినను ప్రోలయ రెడ్డికిని నాతని సంతతివారికిని కోమటియనియు, వేమన యనియు, నామములు వచ్చుట కేదో కారణ ముండి యుండవలెను. అల్లాడ రెడ్డి స్పర్శవేదియను మందుపసరును గాక పోయినను కోమటిధనము నపహరించి యాతడుఁ పిశాచమయి పట్టెనన్న భీతిచేతఁ దన కుమారునికిని, సంతతివారికిని కోమిటి వేమన యను పేరులుంచి యుండవచ్చును.

1.కోమటి ప్రోలయవేమారెడ్డి

రెడ్డిరాజ్యమును స్థాపించినవాఁడు కోమటిప్రోలయ ద్వితీయ పుత్త్రుడయిన వేమారెడ్డి, కోమటిప్రోలయ కూడ దండనాథుడుగా నుండె నని చెప్పుదురు గాని యాతనికాలములో రెడ్లకు రాజ్య మేదియు లేదు. కోమటిప్రోలయకు మాచారెడ్డి, వేమారెడ్డి, దొడ్డారెడ్డి, అన్నారెడ్డి, మల్లారెడ్డి అని యేవురు