పుట:Aandhrakavula-charitramu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

131

తిక్కన సోమయాజి

రాజీయమునుబట్టి కాకతిరాజు శా. శ. 919 వ సంవత్సరములో రాజ్యమునకు వచ్చినట్టు వ్రాసి యున్నారు. నాయొద్ద నున్న సౌమ దేవరాజీవము వ్రాఁతప్రతిలోను, శ్రీరామమూర్తి గారి యాజ్ఞానుసారముగా ముద్రించcబడిన యచ్చు ప్రతిలోనుగూడ తొమ్మిదివందలతొంబది యని యున్నదిగాని వారు వ్రాసినట్లు తొమ్మిదివందలతొమ్మిది యని లేదు. తమవద్దనున్న పుస్తకానుసారముగా ముద్రింపఁబడిన తరువాత, 909 ఉన్న ప్రత్యంతరము వారి కెక్కడ లభించినదో.

తిక్కన నన్నయభట్టుకాలములోనివాఁడు కాఁడని నేను జూపిన గ్రంథ నిదర్శనముల నీ ప్రకారముగా ఖండించి పంతులువారు తిక్కన సోమయాజి నన్నయ భట్టారకుని కాలములోనివాడే యని కొన్ని యద్భుతమార్గములచేత సిద్ధాంతము చేసి యున్నారు.అందు మొదటి మార్గము వాసిష్ఠ రామాయణ గ్రంథకర్త యగు సింగనకవి తన తండ్రి తిక్కన సోమయాజుల మనుమరాలి కొడుకనియు, అతఁడు (తనతండ్రి) శా. శ. 1222 మొదలు 1250 వఱకును రాజ్యము చేసిన తొయ్యేటి యనపోతభూపాలునిమంత్రి యనియు, వ్రాసినందున తల్లి పితామహుఁడగు తిక్కనసోమయాజి యతని కంటె సూటయేఁబది సంవత్సరములు పూర్వము నందుండవలెనని. ఒకఁడు డెబ్బదిసంవత్సరములు బ్రతికినట్టయిన దనకాలములోనే మనుమరాలిబిడ్డలను జూడవచ్చును. హిందువులలో నొకయువతి బిడ్డను గనునప్పటి కామెతాత నూటయేఁబది సంవత్సరముల క్రిందట మృతుఁడగుట యెప్పుడును సంభవింపదు. శ్రీరామమూర్తి గారు చెప్పిన ప్రకారముగానే తొయ్యేటి యనపోత రెడ్డి రాజ్యకాలము క్రీస్తు శకము 1266 మొదలు 1328 వఱకు నగు చున్నది. ఆతని మంత్రియు నాకాలములోనివాఁడే కదా? ఆ యయ్యలమంత్రి యొక్క మాతామహుని తండ్రి యగు తిక్కనసోమయాజి యయ్యలమంత్రి కంటె నూఱేండ్ల ముందే పరమపదము నొందె ననుకొన్నను, తిక్కన సోమయాజి 1228 వ సంవత్సరమువఱకైన జీవించి యుండవలెను. పంతులవారు చూపిన యీ మార్గమువలన నే నేర్పఱిచినకాలమే