పుట:2030020025431 - chitra leikhanamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాయను వ్రాయునపుడు బహుజాగరూకులమై యుండవలెను. నీడయు వెలుతురును అనుపాతముగ నుండవలెను. తెల్లని వస్తువునందు నల్లనిచుక్క నొకదానిని పెట్టిన నసందర్భముగ నుండును. ఇట్టితప్పులనుండి తప్పించుకొనుట కభ్యాసమే ముఖ్యము కాని నేను చెప్పుట కేమియు లేదు.

అందఱి యాలోచనయందును సృష్టియొక్కమోస్తరుగనుండదు. కనుక నొక్కొక్క రొక్కొక్క విధముగ వ్రాయుచుందురు. కురుచైన చిత్రకారుడు మనుష్యాకారములను పొట్టిగ వ్రాయును. పొడగైనవాడు పొడుగుగ వ్రాయును.

సాధారణముగ చెట్లు ఆకుపచ్చగ కనబడునని తలతురు. నమ్మెదరు. అభ్యాస మైనకొలదిని అవి సాధారణముగ నట్టి యాకుపచ్చగ కనబడదని తెలిసికొనెదరు. దూరమునుబట్టి రంగులు మాఱుచుండును. సూర్యరశ్మి తగులుటవలన నాకులపైభాగములు గాడ మైనరంగులను కలిగియుండును. క్రిందికి ఉన్నవైపులు మట్టిరంగు మిశ్రితమైనవై యుండును. అందువలన నీరంగులు మిశ్రితమైనట్టి ఆకుపచ్చగ కనబడవని నేను దృడముగ చెప్పగలను.

గాలియం దనేకమైన పదార్థము లుండును. ధూళి యెగురుచుండును. నీటివాయువు కలిసియుండును. కొన్ని సమయములయందు మంచు పడుచుండును. అందువలన దూరపువస్తువులు దగ్గరవస్తువు లంత శుభ్రముగ కానరావు. దూరమున నున్నవస్తువులచాయ యంతదట్టముగ కానరాదు.

సాధారణముగ పర్వతములు నీలిగ నుండునని యందుము; కాని యవి నిశ్చయముగ నారంగు కలవి కావు. మనకవి లీలిగనే కనబడును. వాటి నిర్మితస్థలమునుబట్టి సూర్యునిగమనమునుబట్టి వాటిరంగు మాఱుచుండును. దూరముగ నున్నవస్తువులు నీలిరంగుగ నుండు ననుసంగతి మనకు విదితమే గడ్డిచే కప్పబడు పర్వతములకంటె, చెట్లమయ మైనగిరులు నీలిరంగుగ కనబడును.

ఇంకొకసంగతిని గమనింపుడు దూరముగనున్న పర్వతములరంగు, దానిదగ్గరనున్న ఆకాశముయొక్క రంగున కనుగుణముగ నుండును. పర్వతములు నీలిగనైనను ఊదాగనైన నున్న నాదగ్గరనున్న యాకాశపురంగు నీలిగనైనను ఊదాగనైన నుండును. ఆకాశ మెఱుపుగనున్న పర్వతము లూదాగా నుండును.

అంతెందుకు? ఆకాశపురంగునుబట్టి సృష్టియొక్క రంగును మాఱుచుండును. ఈగ్రంథము ఇరువదవపేజీయం అచ్చువేసిన చిత్రములను చూచిన మీకు బాగుగ బోధపడును. ఇందుకు కారణమేమని మీ రడుగవచ్చును.

ఎఱ్ఱని వెలుతురునం దొకవస్తువును పెట్టినయెడల దానియొక్కరంగు చాలవఱకు యెఱ్ఱగ మాఱుచుండును.

ఇటులనే నీటిరంగును మీకడిగిన నీలియని చెప్పెదరు; కాని మనము చూచునప్పుడది నిజముగ నీలిరంగుగ కనబడదు. దీనిరంగు ముఖ్యముగ నాకాశపురంగునుబట్టి మాఱుచుండును. ఏలయన: ఆకాశపురం గీనీటియందు ప్రతిబింబిత మగుచుండును. చుట్టునున్న చెట్లు మున్నుగాగలవి కూడ ప్రతిఫలించును. నీటియొక్క రంగు గమనింపవలసియున్నది. స్వచ్ఛమైననీటికి రంగు లేకపోయినప్పటికిని జలసమూహము నీలిగనే కనబడును. కొంతనీరు మట్టిరంగుగ నుండును. మఱికొంత నల్లగ గనబడును. మధ్యధరాసముద్రపునీ రన్నిటికంటె నీల మైనదని కనిపెట్టబడినది. వీటినన్నిటిని గమనించి మనము చిత్రింపవలెను.

తలవెండ్రుకలు నల్లనిరంగు గలవి. అవి యెల్లకాలములయందును మనకు నల్లగ కనబడును. కాని అవి మెఱయుచుండుటవలన వాటియొక్కరంగు మాఱుచుండును. కాన ప్రదేశచిత్రములను వ్రాయునప్పుడు వేళను ఆకాశపు స్థితిని గమనించుచుండవలెను.

దగ్గరగనున్న వస్తువులు దూరముననున్న వస్తువులకంటె బాగుగ కనబడునని యిదివరకే చెప్పియుంటిని. దగ్గరనున్న గడ్డిపోచ కనబడవచ్చును కాని దూరముననున్న చిన్నమొలకకూడ కనబడకపోవచ్చు ననికూడ యిదివఱకు చెప్పియుంటిని. వీటిని మఱచిపోరాదు.

ఈ నిబంధనల నన్నిటిని చూచి మీరు బెంగ పెట్టుకొనరాదు. అభ్యసించినకొలది నవియే యలవడును. లోకమునందు మనుజుడు చేయలేనిపని లేదు. చావును జయించుటకంటె నివి గొప్పవియా?