పుట:2015.392383.Kavi-Kokila.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

నీకేలయిట్టి ఘోరమరణము ప్రాప్తించినది? [దు:ఖించును]

విజ : [నిట్టూర్చుచు] అయ్యో ఎంతకష్టము! నేనెంత దురదృష్టవంతుఁడను! మీయింట నే నతిథినై యుండునప్పుడే యిట్టియిక్కట్టులు వాటిల్ల వలయునా?

శాంత : ఇందుకు ఎవరేమి సేయుదురు? దైవము మాయెడ క్రూరము. ముసలి ముప్పున నిట్టి పుత్రశోక మనుభవించుటకు మేమెవరికేమి యెగ్గుచేసితిమి?

మాధ : ఇదియంతయు స్వప్నమువలెనున్నది. నేను నమ్మఁజాలను. రాజశేఖరుఁడు మరణించి యుండఁడు.

శాంత : నీమాటలే సత్యమగుఁగాక!

పరిచారకుఁడు : అక్కడ ముగ్గురు నలుగురు మనుష్యులు పెనగులాడిన లాగా అడుగు గుర్తు లగుపడు తున్నాయి.

మాధ : అచ్చట చచ్చిపడియున్న అడవిపంది కళేబరమును చూచితిరా?

పరి : లేదండి దొరగారు.

మాధ : [ఆలోచించుచుండును.]

శాంత : [ఆతురతతో] మాధవా, నీకేదో కొంత తెలిసినట్లున్నది, దాఁచిపెట్టకుము. అడవిపంది యేమిటి - చెప్పుము? రాజశేఖరు నెవరు చంపిరి? ఆక్రూరకర్ముఁడెవ్వఁడైనఁ గాని వానిని కండలు కండలుగ చెక్కించి గ్రద్దలకు వేయించెదను. ఆ హంతకుఁడు నేన యైనను నన్ను మన్నించుకొనను.

విజ : మీరు ఘోరప్రతిజ్ఞచేయుచున్నారు. ఆడినమాట తప్పరని నాకు తెలియును. తొందర పడకుఁడు.