పుట:2015.370800.Shatakasanputamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

చెన్నమల్లుసీసములను సుప్రసిద్ధకవియగు పాలకురికి సోమనాథమహాకవి రచించెను. ఈకవి సంస్కృతాంధ్రములలో నిరర్గళముగాఁ గవితజెప్పుటలో నేర్పరియేగాక శైవమత మాంధ్రదేశములో వ్యాప్తికి దెచ్చిన వారిలో నొకఁడు. తొలుత సోమనాథుఁడు, ఉత్తమరాజు వారను కౌండిన్యసగోత్రులగు నియోగులశాఖలోనివాఁడై వేదవేదాంగాదులు సమస్తశాస్త్రములు నభ్యసించి మతావేశపరవశుఁడై వీరశైవమునఁ బ్రవేశించి దీక్షధరించెను.

సోమనాథుఁడు బసవేశ్వరునకుఁ గొంచెమావల కాకతీయరాజ్యమును రుద్రదేవచక్రవర్తి పరిపాలించుకాలమున సుప్రసిద్ధుడై యుండెను. బసవేశ్వరుని దైవముగా భావించి యాతనిమహత్వమునకు ముగ్ధుఁడై బ్రాహ్మ్యమును వదలి శైవజంగమైనవారిలో బసవనిగుణకీర్తనలచేఁ గవితను బునీతము గావించినవారిలో సోమనాథుఁడే యాద్యుఁడు. బసవేశ్వరునిలీలలను వృషాధిపశతకమునందును బసవపురాణమునందును సోమనాథుఁడు ప్రశంసించియున్నాఁడు. ఇతఁడు పశ్చిమచాళుక్యులకడ సేనానిగా నుండి యంత్యమున శ్రీశైలముఁ జేరి గురుమల్లికార్జునపండితారాధ్యులవారిని బసవేశ్వరుని మేనల్లుఁడగు