సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

వికీసోర్స్ నుండి

తెల్లదొరలను గజ గడలాడించిన రేనాటి వీరుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

"అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
..............................
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
.......................................
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు."

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ళముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటుజెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

విజయనగర రాజులు తళ్ళికోట యుద్ధంలో బహమని సుల్తానుల చేతిలో ఓడిపోయారు. సామంతులుగా వుండిన పాలెగాళ్ళు తమ కత్తికి అడ్డం లేకుండా నియంతల వలె వ్యవహరింపసాగారు. రాజులమని గొప్పగా విర్రవీగేవారు.

1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పుడు రాయలసీమ నైజాం వశంలో ఉండేది. నైజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చారు. కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్ళుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్ సర్ ధామస్ మన్రో. పాలెగాళ్ళ పారంపర్య హక్కులను రద్దుచేసాడు. వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.

ఈనాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాళెగాడు పెద్దమల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. కోయిలకుంట్ల తాలూకా లోని ఉయ్యాలవాడ జాగీర్‌ను ఆంగ్లేయులు వశం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుండి 30 వేల రూపాయలకు పైగా రెవిన్యూ రాబడి వుండేది. జాగీర్‌ను వశం చేసుకున్న తెల్లదొరలు పెద్దమల్లారెడ్డి కుటుంబానికి రు. 70 ఫించన్ ఏర్పాటు చేశారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుదా 11 రూపాయలు 10 అణాలు 8 పైసలు ఫించన్ వచ్చేది. నరసింహారెడ్డి మాతామహుడైన (తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి ఏటా 22 వేల రూపాయల రెవిన్యూ వచ్చే జాగీర్‌ను వశం చేసుకుని నెలకు వేయి రూపాయల ఫించన్ ఏర్పాటు చేశారు. నొస్సం జమీందార్ నిస్సంతుగా మరణించడంతో ఫించన్ మొత్తం ఆపివేయబడింది.

తెల్లదొరలు క్రమంగా కట్టుబడి మాన్యాల వంశ పారంపర్య హక్కును రద్దు చేసి మాన్యాలను స్వాధీనం చేసుకోవడంతో కట్టుబడి బంట్రోతుల్లో అసంతృప్తి చెలరేగింది.

1846 జూన్ నెలలో తనకు రావలసిన మేనెల ఫించన్ పైకం కోసం, చీటి వ్రాసి కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపాడు నరసింహారెడ్డి. అదివరకు, పైకం పంపుతున్న తాసిల్దార్ ఈసారి వచ్చిన మనిషిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేకాని ఫించన్ పైకం యివ్వనన్నాడు. రెడ్డి ఉదాసీనంగా వుండటం గమనించిన తహసీల్దారు వారంట్ యిచ్చి బంట్రోతులను పంపాడు. వచ్చిన వాళ్ళను తన్ని తరిమేశాడు నరసింహారెడ్డి. ఈ విధంగా పోరాటం ఆరంభమైందంటారు.

మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు కొండజాతుల వాళ్ళు నరసింహారెడ్డిని ఆశ్రయించారు. నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 9 వేల మంది చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరారు. కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెట్టింది.

1846 జూలైలో (7, 8 తేదీలు కావచ్చు) నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేశాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయించారు. ఈ పోరాటంలో ఒక దఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.

నరసింహారెడ్డి బృందం మరుసటి దినం కోయిలకుంట్ల ట్రెజరి పైబడి ఆనాడు ఖజానాలో వున్న, ఎనిమిది వందల అయుదు రూపాయల పది అణాల నాలుగు పైసల మొత్తాన్ని దోచుకున్నారు. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకున్నారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపివేశారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపించారు. నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను, చుట్టుపట్ల గ్రామాలను దోచుకున్నాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకున్నది. నరసింహారెడ్డి తన బృందంతో అహోబిలం కోట చేరుకున్నాడు. నరసింహారెడ్డి ఆచూకీ తీయడం ప్రభుత్వానికి కష్టమైంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరాడు. జె. ఎచ్. కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద, నాట్‌ను కలుసుకునే ఏర్పాటు చేశాడు. తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంది. అక్కడికి మూడుమైళ్ళ దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోట, నరసింహారెడ్డికి కార్యాలయం అయింది. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా వుంచాడు.

నరసింహారెడ్డి 5 వేల బలగంతో పాట్సన్‌ను గిద్దలూరు వద్ద అడ్డుకున్నాడు. పాట్సన్ వద్ద సైనికులు వందమందే. ఆరు గంటలసేపు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరిగింది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణించారు. చీకటి పడటతో యిరుపక్షాల వారు తమదారిన తాము వెళ్ళిపోయారు.

కొండలలోని కాలిబాటలు అడ్డదారులు సైనికులకు పరిచయం లేవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలించింది. గ్రామాధికార్ల మీద, కట్టుబడిదార్ల మీద కేసులు మోపారు.

నరసింహారెడ్డి పాలెగాణ్ణి పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వ ప్రకటించింది.

నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్త కోటకు తరలించాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కు, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలను పట్టుకున్నారు. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలయ్యాయి.

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ళూ ఉండేవారు. నరసింహారెడ్జి కుటుంబాన్ని పట్టుకుని ప్రభుత్వం, వారిని కడపలోని ఒక బంగళాలో వుంచారు. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరాడు నరసింహారెడ్డి.

1846 అక్టోబర్ 6వ తేదీన ఎర్రమల నలమల కొండల మధ్యనున్న పేరసామల లోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపారు. వందమంది దాకా గాయపడ్డారు. కాలికి గుండు దెబ్బ తగలడంతో రెడ్డి ఫిరంగి దళాలకు పట్టుబడినాడు.

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు.

1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.

ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూచారు. వారికి నోళ్ళకు బీగాలు పడ్డాయి. నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినది.

చుట్టుప్రక్కల వారికి హెచ్చరికగా వుండాలంటూ నరసింహారెడ్డి శిరస్సును రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేటట్లు చేశారు ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం.

జానపదులు ఆ స్వాతంత్ర్య వీరుని అమరగాధను పాడుతూ మనలను ఉత్తేజపరుస్తున్నారీనాటికీ.

"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ళ కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి"