సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/సురవరం ప్రతాపరెడ్డి

వికీసోర్స్ నుండి

బహుముఖ ప్రజ్ఞానిధి

సురవరం ప్రతాపరెడ్డి

" ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ "
                             - దాశరథి

కనీసమైన మానవ హక్కులు లేక, నవాబు, నిరంకుశత్వంలో అలమటిస్తున్న తెలంగాణా ప్రజానీకాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దిన తెలంగాణ వైతాళికులు ముగ్గురు మనకు సదాస్మరణీయులు.

వారు కొమర్రాజు లక్ష్మణరావుగారు, మాడపాటి హనుమంతరావుగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు వారికి ముఖ్యంగా తెలంగాణాకు వెలుగును పంచిన మహనీయులలో ఎన్నదగినవారు సురవరం ప్రతాపరెడ్డిగారు.

ప్రతాపరెడ్డిగారు 1896 మే 28 తేదీన గద్వాల సంస్థానంలోని ' బోరవెల్లి' అను గ్రామంలో తమ అమ్మమ్మగారి ఇంట్లో జన్మించారు. వారి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా అలంపురం తాలూకాలోని ' ఇటికలపాడు '. తల్లి రంగమ్మ. తండ్రి నారాయణ రెడ్డిగారు. దాతగా విద్యాభిమానిగా పేరుగాంచిన పిన తండ్రి రామకృష్ణారెడ్డిగారి వద్ద కర్నూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. వెల్లాల శంకరశాస్త్రిగారి వద్ద సంస్కృతకావ్యాలు, వ్యాకరణం చదువుకొన్నారు. నిజాం కాలేజీలో ఎఫ్.ఎ. మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో బి.ఏ. చదివిన తర్వాత బి.ఎల్. చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారు. కాని వారు ఎంతో కాలం ఆ వృత్తిలో ఉండలేకపోయారు.

భారత దేశంలో గాంధీజీ నాయకత్వంలో సాగుతున్న స్వాతంత్ర్యపోరాటం వారిని ఆకర్షించింది. తెలంగాణా ప్రజల దైన్యం, దారిద్ర్యం, ప్రాథమిక హక్కులను కూడా నోచుకోని దుస్థితి చూచి చలించి పోయారు ప్రతాపరెడ్డిగారు. మాతృభాషలో చదువుకొనే అవకాశాలు లేవు. అంతా ఉర్దూమయం. నిజాం నిరంకుశ పరిపాలన. నిద్రాణమైన తెలంగాణాను జాగృతం చేయాలని దీక్ష వహించారు రెడ్డిగారు.

ఆనాటి నైజాంలో తెలుగు భాషకు, సంస్కృతికి పట్టుగొమ్మగా ఉండిన వారు రాజా బహదుర్ పింగళి వెంకటరామారెడ్డిగారు. ప్రతాపరెడ్డి గారిని వారు 1924లో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ కార్యదర్శిగా నియమించారు. వెంకటరామారెడ్డిగారు కొత్వాలు (నేటి పోలీస్ కమీషనర్) గా ఉండేవారు. ప్రతాపరెడ్డిగారు హాస్టల్ విద్యార్ధులలో క్రమశిక్షనను నెలకొల్పి వారిని చైతన్య వంతులను కావించారు. పేరుకు రెడ్డి హాస్టల్. కాని అన్ని కులాల వారికి ప్రవేశం ఉండేది. ఆ హాస్టల్ లో విలువైన పుస్తకాలతో చక్కని గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు ప్రజల విజ్ఞానానికి తెలుగులో పత్రికను ప్రారంభించాలని నిశ్చయించారు. హాస్టల్ కార్యదర్శి పదవిని మానుకొన్నారు. రాజా బహదుర్ గారి ఆశీస్సులతో 1926 మే 10వ తేదీన 'గోలకొండ' పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక వారానికి రెండు మార్లు వెలువడుతుండేది.

పత్రికలోని ఒక సంపాదకీయంలో "మేము మా పత్రికాస్థాపన కాలం నుండి రెండు అంశాలను దృష్టిపథంలో ఉంచుకొని దేశీయుల సేవ చేస్తున్నాము. మొదటిది ఆంధ్ర భాషా సేవ, రెండవది జాతి, కుల వివక్షత లేక నిష్పక్షపాతముగా ఆంధ్రులలో సర్వశాఖల వారి యొక్క సత్వరాభివృద్ధికి పాటుపడుట" అని వ్రాసి పత్రిక ఆశయాలను వెల్లడించారు. పత్రికా నిర్వహణలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జాతీయ భావాలను ధైర్యంగా ప్రచారం చేశారు. 1947 ప్రాంతంలో అది దిన పత్రికగా మారింది. పోలీస్ చర్య వరకు ప్రతాపరెడ్డిగారు 'గోలకొండ' పత్రికా సంపాదకులుగా పనిచేసారు. వారి తర్వాత నూకల నర్వోత్తమ రెడ్డిగారు, రాజా రామేశ్వరరావు గారు కొన్నాళ్ళు పత్రికను నిర్వహించారు. 1966 దాకా పత్రిక నడిచింది. కొంతకాలం దేవులపల్లి రామానుజరావుగారు కూడా సంపాదకులుగ పనిచేశారు.

ప్రతాపరెడ్డిగారు సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లభాషలలో గొప్ప పండితులు. కాశీనాథుని నాగేశ్వరరావుగారు, తెలుగు దేశంలొ మొట్టమొదటి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు సురవరం వారికి స్నేహితులు. ఆ కాలంలో సభలు సమావేశాలు జరుపుకొనడం చాలా కష్టం. ఆ పరిస్థితిని ' వాగ్బంధన శాసన శృంగార తాండవ విశేషం ' అన్నారు ప్రతాపరెడ్డిగారు. 1951 లో ప్రతాపరెడ్డిగారు, పులిజాల హనుమంతరావుగారితో కలిసి 'ప్రజావాణి' దినపత్రికను స్థాపించి రెండేళ్ళు నడిపారు.

ఆంధ్రుల చరిత్ర మరియు సంస్కృతి పట్ల వారికి ప్రగాఢమైన అభిమానం ఉండేది. ప్రజలలో విజ్ఞాన వికాసానికి గొప్ప రచనలు చేశారు. గొప్ప పరిశోధకులుగా, కవిగా, నవలా రచయితగా, కథారచయితగా, సాహిత్య విమర్శకులుగా వారు సుప్రసిద్ధులు. తెలంగాణా ప్రజల భాషనుకాని, వారి సంస్కృతినిగాని తక్కువ చేసి మాట్లాడితే సహించేవారు కాదు.

"బ్రిటిష్ ఆంధ్రులు బ్రౌణ్యాంధ్రం (ఇంగ్లీష్ తెలుగు) మాట్లాడితే మేము తారక్యాంధ్రం (ఉర్దూ తెలుగు) మాట్లాడుతాము. వారిది ఇంగ్లీష్ దడదడ, మాది ఉర్దు గడబిడ" అనేవారు.

ముడుంబ వెంకట రాఘవాచార్యులు అను వ్యక్తి తెలంగాణాలో కవులు లేరన్నారట. ప్రతాపరెడ్డిగారు వారికి తగిన సమాధానం చెప్ప నిశ్చయించి నాలుగు నెలల్లో 354 కవుల జాబితా, వివరాలతో 'గోల్కొండ కవులు' అను గొప్ప సంచికను ప్రచురించారు. అదీ వారి పట్టుదల.

సురవరం వారు దాదాపు 40 గ్రంథాలు రచించారు. నిజాం రాష్ట్ర పాలనము, మొగలాయి కథలు, సంఘోద్ధరణము, ఉచ్చల విషాదము, గ్రంథాలయము, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానం మున్నగు గ్రంథాలను రచించారు. వారి రచనలలో ప్రధానంగా పేర్కొనదగినవి రామాయణ విశేషములు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, దక్షిణ భారతదేశంలో సాంఘిక చరిత్ర వ్రాసిన వారిలో మొదటివారు సురవరం వారే.

' ఆంధ్రుల సాంఘిక చరిత్ర ' లో వెయ్యి సంవత్సరాల చిత్ర సంగ్రహం ఉంది. అందలి విశేషాలను, డా. ఎన్. గోపి, ఉదహరిస్తూ 'పరిశోధన' (సంచిక - 4) లో పేర్కొన్న ముఖ్యాంశాలివి.

1. నన్నయ తిక్కనల కాలంలో పురుషులు కూడా మట్టెలు ధరించేవారు.

2. తెలుగు వర్ణమాలను, ఓనమాలు అనటం శైవ సంప్రదాయం నుండి వచ్చిందని (ఓం నమః శివాయ) గుర్తించారు.

3. రెడ్లు, వెలమలు తెలుగువారు కాదనీ ఉత్తరాది నుండి వచ్చిన రాష్ట్ర కూటులు రెడ్లయినారని, తమిళదేశం నుండి వచ్చిన వెల్లాలు వెలమలైనారని, ప్రతాపరెడ్డిగారు పేర్కొన్నారు. వెలమలు సంఘ సంస్కరనాభిలాషులనీ, రెడ్లు పుర్వాచారపరాయణులనీ, ఈ రెండు తెగల మధ్య ఎప్పుడూ స్పర్థ ఉండేదని, శ్రీనాధుని కాలంలో ఇద్దరూ సమానులుగా పరిగణింపబడ్దారనీ వివరించారు.

4. విజయనగర కాలంలో మాన్యాలు మిరాశీలు ఏర్పడ్డాయి. గ్రామ వ్యవస్థలో 12 విధాల ఆయగాండ్లు ఏర్పడ్డారు. పోర్చుగీసు వారితో వ్యాపారం ప్రారంభమైంది. ఫ్రెంచి, ఇంగ్లీషువారు కూడా వ్యాపారార్థం రావటం ప్రారంభమైంది. 5. క్రమంగా గ్రామవ్యవస్థలో మార్పులు తటస్థించి పంచాయితీ సభలు ఏర్పడ్డాయి. ఏడాదికో గ్రామ పెద్దను ఎన్నుకోవటం ప్రారంభమైంది.

6. అరణ్యాలను కొట్టి భూములను సేద్యానికివ్వడం, సమిష్టి సేద్యం మొదలైనవి ఆనాటి వ్యవసాయ పద్ధతులు. భూముల కొలతలు, బార, మూర, గద, కుంట అని ఉండేవి.

7. విజయనగర కాలం నాటికి ఇస్లాం ఇక్కడ వేళ్ళూనింది. హిందువుల బౌద్ధుల పతనం అత్యంత లజ్జాకరమైంది. యుద్ధతంత్రంలో ముస్లింలు హిందువుల కన్నా నిస్సందేహంగా నిపుణులు. రెడ్డి, వెలమ, విజయనగర రాజులు ప్రతిఘటించినంత కాలం తెలుగు ప్రాంతం ముస్లింలకు లొంగ లేదు. విజయనగర పతనంతో ఆంధ్రుల పతనం పుార్తి అయింది. తురక, క్రైస్తవాల ప్రాబల్యం నుండి ఆంధ్ర దేశాన్ని రక్షించింది రాజులు కారని ఆనాటి తత్వవేత్తలని ప్రతాపరెడ్దిగారు అభిప్రాయపడ్డారు. వారిలో ముఖ్యులు వేమన, వీర బ్రహ్మం.

8. శ్రీనాథుడు వర్ణించిన కన్నడ దేశాన్ని ఆనాటి కర్ణాటక భాగమైన రాయలసీమగా భావించారు రెడ్డిగారు. పన్నులు వసూలు చేయుటలో శ్రీనాథ కవిని హింసించిన పద్ధతులు హైదరాబాద్ రాజ్యంలో 1900 వరకు ఉండేవన్నారు సురవరం వారు.

తెలంగాణా రాజకీయ చరిత్రలో ప్రతాపరెడ్డిగారు ప్రముఖ పాత్ర వహించారు. 1927లో ఏర్పడిన ఏకైక ప్రజాసంస్థ అయిన ఆంధ్ర మహాసభ యొక్క ప్రథమ మహాసభకు అధ్యక్షత వహించారు. వారి సేవలు అందుకొనని సంస్థ తెలంగాణాలో ఏ ఒక్కటి లేదు.

ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన ఆంధ్ర భాషా నిలయం, హిందీ ప్రచారసభ మున్నగు సంస్థల ప్రగతికి ఎంతో కృషి చేశారు.

రెడ్డిగారి మిత్రులైన గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు కర్నూలు నుండి శాసనసభకు పోటీచేయమని కోరగా రెడ్డిగారు తిరస్కరించారు. కాని పోలీస్ చర్య అనంతరం 1952 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో, మిత్రుల ఒత్తిడిపై వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. కాని రాజకీయాలు వారి కంతగా రుచించలేదు.

సురవరం వారు రచించిన ' ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ' కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ' లభించింది.

త్యాగము, దేశభక్తి, భాషాభిమానం ప్రజా శ్రేయస్సు పరమార్ధంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డిగారు 1953 ఆగష్టు 25న దివంగతులయ్యారు.