హిమబిందు/ప్రథమ భాగం/4. విషబాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పాండ్య చోళ కేరళ పాంచాలములనుండి దిట్టరులగు వారు వచ్చిరట. ఇంకను పెక్కుమంది యున్నారు.

ప్రభా: గెలిచినవారికి కానుకలమాట చెప్పవైతివి?

సమ: ప్రతివర్షము నిచ్చునదిగాక, ఈ ఉత్సవమున అన్ని పరీక్షలకు అదనపు కాన్కల నిత్తురట సార్వభౌములు.

ప్రభా: ఉక్షశకటపరీక్షకు అదనముగా ఏమిచ్చెదరో చెప్పుకోండి. ఇవిగో పదిపణాలు పందెం.

చాలమంది వివిధ వస్తునామము లుచ్చరించిరి. ఇంతలో ప్రతీహారియగు నొకదళపతి లోనికి విచ్చేసి నమస్కరించి “జయము జయము వీర శ్రీమంతులకు! ఉపాధ్యక్షులవారు విజయము చేయనున్నారు. వారి రథము మూడవద్వారము దాటినది” అని నిర్గమించెను.

ఆయుధపాణులగు నలువు రంగరక్షకులు వెంటరా నుప సైన్యాధ్యక్షులగు కాకుండకులు సంపూర్ణ కవచధారియై విచ్చేసిరి. ఒక్కసారిగా సేనాధికారులందరు లేచి నమస్కరించిరి. అందరికి ప్రతినమస్కృతులిడి కాకుండకు లోక దంత పీఠ మలంకరించి వారిని “కూర్చుండు”డని సంజ్ఞచేసిరి.

“రేపటి మహోత్సవమునకు శతస్కంధుడు, ప్రమానందుడు, చండకేతుడు, గుణవర్మ రథ గజ తురగ పదాతులతో రక్షకులై వచ్చునది. ముప్పది ఏనుగులు, రెండువందల రథములు, అయిదువందల గుఱ్ఱములు, మహాఖేలనా స్థలము చుట్టును విడిసి ఉండవలసినది. సార్వభౌముల ఊరేగింపు మహోత్సవమున నూరు ఏనుగులు, అయిదువందల రథములు, రెండువేల పదాతి దళము, వేయి గుర్రములు కావలికాయునది. అందులకు వలయు నాయకులను అమలనాధులవారు ఏర్పాటు చేయుదురుగాక. వారే ఆ ఉత్సవమునకు అధిపతులు. వారి నాయకత్వమున ఇంక నన్ని సైన్యములు ఊరేగింపు టుత్సవమున పాల్గొనవలసినది. కుంభీరకులు, ఉపపాదులు, అనుగ్రహులు, ఉద్ఘాటకులు యీ నలువురు సేనాపతులు చక్రవర్తికి అంగరక్షకులుగా వెళ్ళవలయునని సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞ. అమలనాధులు ఎన్నుకొనిన ఉపసేనానులూరేగింపుటుత్సవ సైన్యములు నడుపునట్లు ఆజ్ఞ. ఆయా యోధాగారాలలో వంతు వచ్చినవారు కావలియందురు గాక. తక్కినవారు మహోత్సవమునందు పాల్గొనవచ్చును. ఈ ఉత్సవము నవదినముల నీ యాజ్ఞయే వర్తించును. తథాగతుడు మీకు రక్ష” అని కాకుండకులు యథోచితముగ వెడలిపోయిరి. 

4. విషబాల

బుస్సు” మని యా పాము లేచినది. దాని కన్నులలో నవ్వుతాండవ మాడినది. ఆ కన్య యా పాము నెత్తుకొని, కుడిచేతితో పడగనందికోని, ముక్కుతో ఆ ఫణిరాజు ముట్టెను ప్రియమార రాచినది. అది భయంకర కాలోరగము. ఆరడుగుల పొడవుతో మిలమిలలాడు నీలనీరధి కల్లోలము అర్జునుడను ఆ పన్నగేంద్రు డాయోషాతిలకమును అలmeను. నాగవల్లివలె చుట్టుకొనిపోయెను.

“అర్జునా! నీవు మంచివాడవోయీ! నీ కన్నులు వజ్రాలవలె మిలమిల లాడుచున్నవి. నీ తలమానికము తళతళ తోచుచున్నది. నీ దేహన నీలరత్నాలు మిరుమిట్లు కొలుపుచున్నవి. నీకును ఉలూపికిని ప్రణయకలహము తీరినదా? నీవు సంతోషాన నింత జ్వలించు చున్నావు? నీ నాల్కలు చాచి నా పెదవుల నంటెదవు. వద్దు! నా కెంగిలి అసహ్యము. ఈరోజున పరుగుపందెములో నిన్ను ఓడించగలనుసుమా!” అని సౌందర్య రాశియగు నాబాల పకపక నవ్వినది.

ఇంతలో మొగలిరేకువంటి శ్వేతోరగి యోర్తు ఆ బాలకడకు వేగాన ప్రవహించుచు వచ్చినది. దానిని చూడగనే అర్జునుడా కన్యకా హస్తాల నుండి నేలకుజారి, ఓంకారరూపమై ఆడజొచ్చెను. ధవళఫణియు, గ్రక్కున నా యువతిపై కెగబ్రాకి ఆమె మూర్థాననుండి ఫణము క్రిందకువాల్చి యాబాలిక ముక్కు బుగ్గలు, పెదవులు, గడ్డము, నాల్కలనంట సాగెను.

చంద్రకిరణమువలె మిలమిలలాడు స్నిగ్ధస్విన్నాంగముతో నాభుజగి ఆ జవ్వని లేతపొన్నాకు చెవికడ సంగీత స్వనాన బుసకొట్ట నారంభించినది. బాలికయు “ఏమి ఉలూపీ! భర్తపై నేరాలుమాని ప్రేమవాక్యాలు పలుకుచున్నావు! ఆహా! మూడునాళ్ళ కలహపు ముచ్చట నేటితో తీరెనేమి? ఏది! నాయెదుట ఒకరినొకరు కౌగిలించుకొను “డని కోకిల పులుగుపలుకుల కుహుకుహూలాడినది. తక్షణమే యా పన్నగి క్రిందకుజారి అర్జునుని మెలివేసికొనిపోయినది.

ఆ మందిరమునం దెల్లయెడల విషోరగములు భయంకరములై తిరుగాడుచున్నవి. పాములు నివసించుటకు గోడలపొడుగునను మట్టితో కృత్రిమ వల్మీకములు నిర్మింప బడినవి. ఆ బాలిక అందలి నాగములతో మంతనమాడుచు, నాడుకొనుచు ఒక ముహూర్తకాలము వినోదించి యా మందిరము వెల్వడినది.

ఒక కక్ష్యాంతరముదాటి యామె ఉద్యానవనవాటిక ప్రవేశించెను. అందు నాభితీగెలు కంచెలయందు దట్టముగా నల్లికొని ఎర్రని పుష్పములు పూచి యున్నవి. శృంగి, మదనబేరి, ముష్టి విపక్షీర విసబొద్ది వృక్షములు అచ్చటచ్చట తమ విషపత్రముల నాడించుచున్నవి. అది భయంకర సుందర వనవాటిక. అది మృత్యుబాలికా నృత్యరంగము.

ఆ వనాంతమున వివిధవర్ల శిలలతో నిర్మింపబడిన జలాశయము నాకృశాంగి సమీపించి విగతవస్త్రయై, యందు దుమికి, యీదులాడజొచ్చినది. ఆ నీరములందు అగ్నికీలాసదృశములు నగు వివిధ విషాదులు సమ్మళితము చేయబడియున్నవి.

ఆ తన్వంగియందు గాలికి నూగులాగు బడబానల జిహ్వవలె నీదు కొన్నది. పిల్లిమిరెములు, బల్లటీలు కొట్టినది. ఆ విష దిగ్ధనీరముల బుక్కిట బట్టి పై కెగ జిమ్మినది. మునిగి తేలినది. ఓలలాడినది.

జలక్రీడలైన వెనుక సువ్వునలేచి పదునెనిమిదేళ్ళ చుఱుకు ప్రాయంపు టద్భుతసౌందర్య మొలుక బోసికొనుచు మెట్లెక్కిగట్టునకు వచ్చి, కురుల తడియార్చుకొని ద్విగుణీకృత దేహకాంతితో వెలుగుచు, కాటువేయబోవు పామునోటి కోరవలె తళతళమన్నది.

ఆమె సౌందర్యము సువాసనాలహరు లెగబోయు తరులగర్భములోని అగ్నివంటిది. తియ్యని విషము. విద్యున్మాలినీ విలసితము, పాయము తాల్చిన వ్యాఘ్రరాణి, పదునుపెట్టిన నిశితకృపాణము.

కుంతలములను వలిపెముతో తుడుచుకొనుచు దిసమొలతో నొయారముగ నడుగులిడుచు ఆ వనవాటి నంటియున్న భవనమార్గమును జేరినది. ఆమె దేహచ్ఛాయ తప్తకాంచనము. నల్లనై విడబారు కేశభారము జానువులవరకు వ్రేలాడినది. పరువములు తొంగిచూచు ఆమె వక్షోరుహద్వయము తరుణకదంబము పూచిన తొలిపూతగుత్తులు. ముగ్ధత్వమువీడని యా బాలికా తనూరేఖలు అపశ్రుతిరహిత రాగమాలికా మోహనతరంగములు. మత్సాకారములై దీర్ఘములైన యామె లోచనాల కలలు తిరగవు. అవి నిశితసారాచ ముఖధగద్ధగితములు. ఆమె అధరోష్టములు మథురములు, కరుగని అరణ్యక బింబ ఫలములు, నాభి కుట్మలములు.

ఆ బాల యభ్యంతరగృహమునకు విసవిసజని, సన్నని దుకూలము ధరించి స్తనవల్కలము జుట్టుకొని నగలుదాల్చి నాభీగంధకదంబితమగు పచ్చి సాంబ్రాణిబంక పొగవేసుకొని కుంతలా లార్చుకొనుచుండ నామందిర కవాటము తెరచుకొని పండువంటి యొకవృద్ధతపస్వి స్థౌలతిష్యులు లోనికి వచ్చిరి. మిసమిసలాడు నా బాలికాసౌందర్యము ఆపాదమస్తకము గమనించుచు, చిరునవ్వు మోమును వెలిగింప నాతడు చేరవచ్చినాడు.

“తాతయ్యా! నాకేమి తెచ్చినారండి!” యని యామె యాతని కౌగిలిలోనికి వ్రాలినది.

“కన్నతల్లీ! నీవు నా కోర్కెలీడేర్చు దివ్యముహూర్తము సమీపించుచున్నదిసుమి. అప్పుడు నీ ఇష్టమువచ్చినట్లాడుకొని, నాశనమొనర్ప అమూల్యము, సజీవమూ నగు నాటవస్తువు నీ కర్పించెదను. ఈలోన ఇతర వస్తువులు నీకు వలయునవి ఒసగుచుంటినిగాదా!?”

“ఆ వస్తువు అందముగా నుండునా తాతయ్య?”

“ఆ సౌందర్యమునకు దేశదేశములు తలలొగ్గుచున్నవి.”

“ఎప్పుడా ముహూర్తము తాతగారూ?”

“బ్రహ్మ సరస్వతిని విద్యాతేజఃపుంజముచే సృష్టించినాడు. కమలాక్షుడు కంటకుల నిర్మూలించుటకై చక్రమును సూర్యరజముచే త్వష్ట కల్పించినాడు. పరివేదనాతప్తమగు నాహృదయతాపమువోసి నిన్ను పెంచికొన్నాను. తల్లీ! నీ కన్నులు జాజ్వల్యమాన హల హలధారలై పోవుగాక! నీవక్షోజములు ప్రళయాగ్ని స్పులింగకలశములౌగాక! నీ దేహము జృంభా విస్ఫురన్మృత్యు ముఖదంష్ట్ర యగుగాక! ఆ దివ్యముహూర్తము ఇదిగో వచ్చుచున్నది. వచ్చుచున్నది తల్లీ!”

అతని కన్నులు ఫాలము భయంకరములగు కాంతులచే ప్రకాశించి పోయినవి. వణుకుచున్న అతని చేతులు ఆమె మూర్దమును తడివినవి.

ఇంతలో “ఘణఘణ” యొక జేగంట మ్రోత వినవచ్చినది.

ఆ తపస్వికి మెలకువవచ్చి తీవ్రత తగ్గిన కంఠముతో “అమ్మా! పూజా వేళయైనది. పరమశివుడు యోగనిద్రనుండి లేచి నా పూజకై నిరీక్షించుకొనియున్నాడు. నేను వెడలెద” నని పలికి రూపొందిన బ్రహ్మవిద్యవలె నున్న యాతడా గదినుండి వెడలిపోయినాడు.

తాతగారు వెడలిపోయిన వెనుక ఆ బాలిక వేరొక కవాటమును తెరచుకొని వివిధములగు ఆటవస్తువులున్న వేరొక మందిరమునకు బోయినది.

ఆ బాలిక బొమ్మలతో నాడుకొనుచు, కూనిరాగముల తీసికొనుచు ఆ క్రీడలో మునిగిపోయినది. వ్యాఘ్ర సింహాదులు కురంగాది జంతువుల తినుచున్నట్లు, దేవి రాక్షసుల వధించుచున్నట్లు కీలుబొమ్మ లనేకములందుగలవు.

బొమ్మల పెళ్ళిళ్ళు, బిడ్డబొమ్మల గుజ్జనగూళ్ళు ఆ పాప చిన్ననాటి నుండియు నెరుగదు. ఆమె ఆట పాట లన్నిటిలో వీరభయానకరౌద్రములే మెదిపి యుంచిరి. ఆమె చూపులకు విలయపయోద నీలిమలు కాటుకలైనవి. ఆమె యూర్పులు మృత్యు నిశ్వాస భుగభుగలతో సహాధ్యయనము చేసినవి.