హిమబిందు/ప్రథమ భాగం/2. శిల్పి

వికీసోర్స్ నుండి

2. శిల్పి

తని హస్తములు లలితములయ్యు శిలాశిక్ష నశ్రమముగ నిర్వహించుచున్నవి. పాలరాయితునుకలు దెబ్బదెబ్బకు ఉల్కలవలె నెగిరిపోవుచున్నవి. పాషాణధారణముపై సుత్తె అతివేగముగ, సున్నితమున వాలుచుండ, టంకగమనము నృత్య మభ్యసింపుచున్నది. క్రిందనున్న రాయి నిముస నిముసమునకు కావ్యరూపము దాల్చుచున్నది. ఆ శిల్ప మప్పటికే తెరచాటునుండి వచ్చిన వేషమువలె స్పష్టరూపము దాల్చినది. ఆ శిలాఫలక శిల్పమునం దొకటి రెండు విగ్రహములు మాత్ర మింకను పూర్తికాలేదు.

అప్పుడే కోటయం దాఱవ ముహూర్తము దెలుపు భేరీని మ్రోగించినారు. ఆ బాలకుడు లేచి వెనుకకు బోయి తన నేర్పరితనమును సవిమర్శ తీవ్రదృష్టితో కనుబొమ్మలు ముడిచికొని పరిశీలింప సాగినాడు.

ఒకచో విషయాసక్తుండగు రాజు ఉద్యావనమున అవరోధజన పరివేష్టితుడై క్రీడించుచున్నాడు. ఒక బాల రాజుతో మేలమాడుచున్నది. వేరొకతె మృదంగము వాయించుచున్నది. ఒక కృశాంగి నృత్యమున తన్మయత్వమునొంది, నిమీలిత నేత్రయైనది. ఒక చకోరాక్షి కాముకుడగు మనో నాయకుని వక్షోవిస్ఫూర్తి నవలోకించుచు నానంద పరవశయై యతని భుజమును చిగురువంటి హస్తతలముచే తాకుచున్నది.

ఈసమూహమునకు కుడిప్రక్క విజ్ఞానదము పుణ్యపురుషకథా పవిత్రమునగు దృశ్యము. బుద్ధుడు భిక్షార్థియై వీధులవెంట నరుదెంచినాడు. ఉపదిష్టధర్ములు, అష్ట మార్గావలంబకులు నగు ప్రజలు సందర్శనాభిలాషులై చేరుచున్నారు. బండివాడు, కాపు, నీరు తెచ్చు సుందరాంగి, పాలనమ్ముగొల్లది, భక్తిపూరిత నయనాల నా తథాగతుని నవలోకించుచున్నారు. వారందరితో పాటు రాజు, రాణులతో వెడలివచ్చి బుద్ధదేవుని సందర్శించుచున్నాడు. రాజు మోకరించియున్నాడు. రాణులు ఫలాదుల భిక్ష నర్పించు చున్నారు.

వ్యాఘ్రాజినముపై నిలుచుండి తదేకదృష్టితో శిల్పమును కనుంగొను నా యువకునకు పదియుతొమ్మిది సంవత్సరముల ప్రాయమున్నది. ఆతని మూర్తి సమున్నతము, కండలు తిరిగిన బాహువులు, విశాలవక్షము, తల పెద్దది, కోలమోము, సాధారణపు టాంధ్రనాసిక. అయినను ఆ బాలుని కన్నులు తీక్షణములై, నవ్వుచును సొగసులు ఒలకబోయును. ఆ కన్నులను జూచినవారు అతని మరుక్షణాన ప్రేమించి తీరవలయును. అందమున కన్నులతో నీడుజోడైన యాతని పెదవుల అరుణకుట్మలత్వము, నాసికా సాధారణత్వమును కప్పిపుచ్చి ఆతని ముఖ మంజులత్వాని కలంకారము దిద్దుచున్నది.

ఆతని కన్నులను, విశాల ఫాలమును, సుందర వదనమును వెలిగించునది. అతని భ్రూకుటి. అది యమునా గంగా సంశ్లేష పవిత్రము. అది హిమాచల సుమేరు పర్వతాలింగన సుందరము. అది కన్యాకుమారీ హృదయస్థ ప్రాక్పశ్చిమ సముద్రతరంగ సంయోగ గంభీరము.

ఆతని విశాల నయనాలు తీక్షణదృష్టులతో ఆ శిలాంతరాళమును జొచ్చిపోయినవి. ఆతడు నిట్టూర్పుపుచ్చి చేతనున్న టంకమును, అయోఘనమును ప్రక్కనున్న పనిముట్ల మందసమునందుంచెను. ఈ సాయంత్రమునకిది పూర్తి కావచ్చును. అప్పుడే ఆరు ముహుర్తములైనది. కోటలో భేరియు, స్తూపఘంటయు మ్రోగించినారు.

“రెండు మెతుకులు నోటవైచుకొని వచ్చి....” అను ఆలోచనములాతని హృదయమున పరువులిడినవి.

ఆ మందిరమం దెచ్చట చూచిననూ పాలరాతి విగ్రహములు వివిధ శిల్పావస్థలలో నున్నవి. చిత్రశోభితములై తోరణయుతములైన ద్వారకవాటములతో వర్ణమనోహరములైన కుడ్యములతో వర్ణములు కలుపుకొను పాత్రలతో, తూలికాది పరికరములుంచు మంజూషలతో, శిల్పశాస్త్ర తాళపత్ర గ్రంథములుంచిన పేటికలతో నా మందిరము విచిత్ర సౌందర్యము తాల్చినది.

మిసిమి వయస్సులోనున్న ఆ బాలశిల్పి అటుల నాలోచనాధీనుడై యుండ, ఇంతలో నొకజవ్వని ఇంటిలోనికి బోవు గుమ్మముకడకు వచ్చి “బాబూ సువర్ణ! భోజనమునకు రావా? మీ తండ్రిగారు కనిపెట్టుకొని ఉన్నారు. మీ అమ్మగారు వడ్డించుచున్నారు” అని పిలిచెను. బాలకుడు ఉలికిపడి.

“ఇదిగో, అందుకే లేచితిని, ఆరవ ముహూర్తనాదము వినబడినది ఇప్పుడే కాదా” అనెను.

“ఒక నాళిక పైగా దాటినది బాబూ!”

“ఏమిటీ! నాయనగారు బుద్దారాధనచేసి నా కొరకు కని పెట్టుకొని యుందురు. ఎంత మందమతిని! పాద ప్రక్షాళనముచేసి ఉడుపులు ధరించుకొని వచ్చెదను.” అనుచు నాతడు త్వరత్వరగా దొడ్డిలోనికి పోయెను.

ఇంతలో మహాలి మహానసగృహమునకుబోయి

“అమ్మా! కుమారుడు పాదప్రక్షాళనముచేసి శుభ్రవస్త్రములు ధరించి వచ్చుచున్నాడు. అది యెచ్చటి శిల్పదీక్షయో కాని మన సువర్ణకుమారునికి బాహ్యస్మృతియే ఉండదమ్మా!” అని పలికినది.

“అయ్యో, చిన్నతనాన వారును ఇంతే. ఆ తండ్రికి కొడుకుగాడూ! పోలిక లెక్కడికి పోవును! వారి జపమైనది, నా వడ్డనయు పూర్తియైనది. అబ్బాయివచ్చి కూర్చుండెనేమో చూడు, వానికి ఇష్టమని మామిడికాయ పచ్చడి చేసితిని.”

మహాలి భోజనాగారములోని కడుగిడి చూచి, వెనుకకువచ్చి, “అమ్మా! వచ్చి కూర్చున్నాడు. నేను పోయి, అమ్మాయిలకు స్నానాదికముల కేర్పాట్లు చేసెద” నని యామె గృహమున వేరొకభాగాన కేగెను.

తండ్రి కొడుకు లిరువురు భోజనము చేయుచుండిరి. తటాలున ధర్మనంది పుత్రుని గని, “రేపు సార్వభౌముని జన్మదిన ఖేలనోత్సవములకు వెళ్ళుదువా?” అని అడిగెను.

“చిత్తము,”

“ప్రదర్శనములో పాల్గొనుచుంటివా?”

సువర్ణశ్రీ మాట్లాడలేదు.

“పందెగాళ్ళలో నొకడవని వింటిని. బాబూ! శకటవేగ పరీక్షకు నీవు వెళ్ళుటా! నీవు ఎడ్లబండి తోలడ మెపు డలవరచుకొంటివిరా!”

సువర్ణశ్రీ కుమారుడు భోజనము చేయుటమాని బంగారుకంచా న వ్రేలు రాయుచుండెను. ధర్మనంది తన తనయుడు విద్యాసక్తితోపాటు దేహబలము వృద్ధి  నొందించికొనుటయు గమనించుచునే యున్నాడు. మల్లయుద్ధవిశారదులలో మేటి, ఉప సేనానాయకులలో నుత్తముడు నగు సోమదత్తుని వ్యాయామ వనములందు కుమారుడు సుశిక్షితుడై ప్రఖ్యాతి నందుచున్నాడనియు ఎరుంగును. అయినను తన కుటుంబము పూర్వకాలము నుండియు శిల్పవిద్యయందు యశము సముపార్జించుకొనుచున్నది. ఆ దివ్యవిద్యను వదలి పామరజనోచితమగు వీరవిద్యయందు కాలము గడుపుట యంతయవివేకము! ఆత్మరక్షణమునకు ఆర్త రక్షణమునకు యుద్ధాశక్తి అవసరమగును. అంతమాత్రమే.... అయిననిప్పుడు....?

“బాబూ! నీవు దిగులుకొనకు; నిన్ను వీరవ్యవసాయమునుండి మరల్చు పిరికిమానిసిని కాను. మనవిద్య భగవత్ప్రీతికరము, సర్వోత్కృష్టము. తథాగతుని గాథలు శిల్పంలో రూపించి తనకు ద్రష్టకు నిర్వాణ మార్గ సోపానములు కట్టుశిల్పి యెక్కడ, వీరవిద్య లెక్కడ? భిక్షులువాగ్ధార బోధించిన ధర్మమునే, మనము టంకణ ధారతో ప్రసరింప చేయుదుము.”

ధర్మనందుల ధర్మపత్నియగు శక్తిమతి భర్తనుజూచి “బాబు శిల్పదీక్ష మీకు తెలియదుకాబోలు. చిన్ననాటి మీ శిల్పవ్యసనమంతా జ్ఞాపకముచేస్తూ వుంటాడు. పోలిక లెక్కడికి పోతవి! అభయబాహు మహారాజుతో మీరుచేసిన మల్లయుద్ధ వినోదాలు జ్ఞాపకము లేవూ?” అని పలికినది.

సువర్ణ శ్రీజనకుని పవిత్రభావము నిముషమున ద్యోతకము చేసికొనెను. కాని శకటాధ్యక్షులగు మహాశ్రీకి తన విజ్ఞాపనపత్రమును సోమదత్తులవారు పంపియుండిరే! ఇప్పుడు వెనుదీయుటకన్న బేలతన మేముండును?

కుమారుని మోము తిలకించుచున్న ధర్మనంది “వత్సా! సరియే, కానిమ్ము. మనకుటుంబమున వెన్నిచ్చినవా డింతవరకు జన్మింపలేదు. నీవు క్షేమముగ విజయివై వచ్చెదవుగాక!” అని నయనములు ప్రకాశింప పలికి, భోజనము పూర్తిచేసెను.

సువర్ణశ్రీ కుమారుడును పై కుబుకు సంతోషము నడంచుకొన ప్రయత్నించుచు పితృభక్తి పూరితములగు నశ్రుబిందువులు నేత్రముల దొలక భోజన మెట్లెట్లో చేసెను.


3. సేనాధికారులు

మదర్శి మధ్యమ వర్చస్వి. అయిదడుగుల ఎనిమిదంగుళముల పొడవు. కండలుదేరిన అవయవస్ఫుట రేఖలతో రాతివిగ్రహమువంటి కఠినదేహముకల పోటుమానిసి. అనేక యుద్దముల ఆరితేరిన బంటు. మదించిన మగధ మహిషమువలె మత్తిల్లియుండి, వాహినీపతులలో నుత్తముడై, మహారధుడై యిరువదిరెండువర్గాల పడుచుప్రాయంపు వీరుడై వెలయువాడు.

ఉత్తమాశ్వారూఢుడై, ఎడమచేతనున్న కళ్ళెము గుర్రము మెడమీద వదలి, మీసాలు మెలికలు తిప్పుకొనుచు, జనుల కేలుమోడ్పుల చిరునవ్వుతో నందికొనుచు ఒక నా డాతడు ధాన్యకటక నగరవీధుల హుటాహుటి స్వారి చేయుచు కోటనానియుండు యోధాగార గోపుర ద్వారముకడకు బోయినాడు. అచ్చట కావలిగాయు దళపతికి సంకేతము దెలిపి స్వారి చేయుచునే లోపలికి బోయెను.