హిమబిందు/ప్రథమ భాగం/14. నిర్దోషి

వికీసోర్స్ నుండి

ఆ మరునాడు కోటలో ప్రాడ్వివాకసభా భవనమున చంద్రస్వామి విచారణము ప్రారంభించిరి. చంద్రస్వామికి అన్ని సౌఖ్యములు రాజపురోహితు లొసగిరి. ఉదయాస్తమయముల గాయత్రి జపించుకొనువాడు. తపస్సు చేసికొనువాడు. భగవన్నామ స్మరణానందప్రేంఖణమగు గానపరవశత్వ మందువాడు. చంద్రస్వామి భక్తుడు. భక్తులకు భయము, ప్రఫుల్లపద్మసూనంబులకు దుర్గంధము, పండువెన్నెలలకు వేడిమి యెచ్చట?

పూర్వకాలమునందు న్యాయవిచారణ నేటికన్న వేయిమడుంగులుత్తమముగ నుండెడిది. దేశమునకంతకు మహారాజసభ ప్రధాన న్యాయస్థానము. దాని వెనుక ప్రాడ్వివాకులసభ స్థానీయ, ద్రోణముఖ, ఖార్వతిక, సంగ్రహణ యనునవి పోనుపోను చిన్నవి. ఎనిమిది వందల గ్రామములకు ద్రోణముఖమును, రెండువందల గ్రామములకు ఖార్వతికము, సంగ్రహణము పది గ్రామములకు న్యాయస్థానములు. ఈ సభలు రెండు విధములు: ధర్మస్థీయము, కంటకశోధము అనునవి. ధర్మస్థీయము వ్యావహారిక ధర్మమునే విచారించును. కంటకశోథసభ వర్తకము, వృత్తి, రాజకీయము మొదలగు విషయముల ధర్మనిర్ణయ మొనర్చును. ప్రాడ్వివాకునిసభ ధర్మస్థీయ కంటక శోధ విషయముల రెంటిని విచారించును. ఆ పైన రాజే సభాపూర్ణుడై స్వయముగా న్యాయ విచారణ చేయును.

నేడు చంద్రస్వామిని కోటలోనున్న ప్రాడ్వివాకుని సభకు గొని వచ్చిరి. రాజభటు లిరువు రాతని తీసికొనివచ్చిరి. ప్రాతఃకాలోచిత కృత్యములు దీర్చికొని పిమ్మట ఉదయము రెండవ మూహూర్తఘటిక మ్రోగు నప్పటికి సభావ్యవహారము ప్రారంభింతురు. సభయందు ప్రాడ్వివాకు డొక ఉన్నతాసనముపై నధివసించియుండెను. ధర్మశాస్త్ర పండితులగు సభ్యులు మువ్వు రితరాసనములపై వేరొకయెడ వసించియుండిరి. ఒక వేదికపై నలువురు బౌద్ధభిక్షువు లొక మృదులమగు ఖర్జూరపుచాపపై నధివసించి యుండిరి. సంధ్యాపాలుడు, లేఖకుడు, గణకుడు (లెక్కలవ్రాయువాడు) వారి వారి యథాస్థానముల నుండిరి. ఏ న్యాయ సభయందును నొక్కపురుషుడు ధర్మనిర్ణయము చేయుట పూర్వకాలము నందెప్పుడును లేదు. వారుకాక నేర మెచ్చటనుండి వచ్చినదో అచ్చోటునుండి ధర్మ సహాయులు కొందరు వచ్చెడివారు. వారుగాక, ఏవిషయమున అనుమానము తటస్థించినను తమ అభిప్రాయములనిచ్చి సందేహము తీర్చుటకు ధర్మశాస్త్ర పారీణులగు భిక్షులు, బ్రాహ్మణులు కొందరు సభయం దుందురు. మహారాజే స్వయముగా విచారించినప్పుడై నను వీరందరు నుండవలసినవారే.

ఎవరి పైనైనను నేరము మోపబడినపుడు ప్రాడ్వివాకానుజ్ఞాతుడై సంధ్యాపాలుడు రాజముద్రాంకితమగు “ఆ సేద్యము” (పిలుపు) పంపును. ఆ పైన వారు వచ్చి తీరవలయును. బాలబాలికలు, ముదుసలులు మొదలగువారు మాత్రము రానక్కరలేదు. చంద్రస్వామిని రాజభటులు కొనిరా, పండితుడును యువకుడునగు నా ద్విజోత్తముని నొక చిత్రాసనమున కూర్చుండుమని ప్రాడ్వివాకుడు కోరెను. ఉత్తమకులసంజాతుడును, ధర్మశాస్త్ర పారీణుడును, సత్యవాదియు నగువాడే ప్రాడ్వివాకుడుగా నుండనరుడు.

14. నిర్దోషి

గణకుడు వచ్చి చంద్రస్వామి నవలోకించి “ఆర్యా! మహామంత్రి శ్వైత్రులవారు మీరు మహారాజుపై కుట్రలు సలుపుచున్నట్లుగా నేరము మోపినారు. దాని నిప్పుడు ఋజువు చేయబోవుచున్నారు. తాము మీకోరిన ఋజుపత్రముల నావల కొనిరావచ్చును. నేరారోపణకానిచో అనగా మీపై నేరము ఋజువు కానిచో, తమ్ము క్షమింపుమని ప్రార్థింపుచు సభవారు మిమ్ము బంధవిముక్తుల గావించెదరు” అని వాక్రుచ్చెను.

తోడనే చంద్రస్వామి లేచి ప్రాడ్వివాకునిదిక్కు మొగంబై యిట్లనియె: “ఆర్యోత్తమా! ధర్మశాస్త్రములు నేరవిచారణ త్వరితముగ నొనరింపవలయు ననియు, లేనిచో సత్యము మరుగుపడిపోయి అన్యాయముగ నొకనికి శిక్ష కలుగుననియు ఉద్ఘోషించుచున్నవి. సత్పురుషుడును, మహాయోగియగు మీ తథాగతు డట్లు బోధించెను. పీఠకములట్లు సెలవిచ్చెను. ఆర్యధర్మము లట్లుపన్యసించినవి.”

“ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మశాస్త్రములట్లు ఘోషించుట నిజమే. కాని కాలమానస్థితులు నీ బంధనకు కారణములైనవి. అనవసరముగ న్యాయ నిర్ణయము చేయుట కాలసించిన మహాపాపమని శాస్త్రములు పలికినవి. ధర్మము దోషజుష్టము గాకుండ నీ పెద్దలందరును జూడగలరు. మహారాజెట్టి ధర్మ తత్పరుడో నీవు యెరుంగుదువు. బౌద్ధధర్మములైన నేమి, వేద మత సంప్రదాయములేమి అధర్మము చేయవలదని శాసించుచున్నవి. ఇచ్చట మతధర్మ విచారణ చేయ వీలులేదు. పవిత్రములు, భగవత్పూజాపరములు, నిర్వాణ సముపార్జన కారణంబులగు సమంతభద్రోపదేశములేమి, పురాతనములు, దైవస్వరూపములగు వేద మంత్రములేమి అవ్వాని విచారణ ఈసభది గాదు. మహారాజన్ని మతములయెడ సమానాదరణ కలవాడు. కాని యీ సభ వ్యావహారికసంబంధమైనది. జ్ఞానివి, విద్యా పారంగతుడవగు నీకు మే మేమియు చెప్పనవసరములేదు. విచారణ ప్రారంభించు చున్నాను” అని ప్రాడ్వివాకుడు చెప్పెను.

అంత గణకుడు నల్లచేవకర్ర పీటపై నుంచిన కొన్ని తాళపత్రములు, ఒక భూర్జపత్రము, రెండు మొగలిరేకులు గొనివచ్చి ప్రాడ్వివాకునికడ పీఠిక పై నుంచెను. “ప్రమాణములందు లిఖితసాక్ష్యమును, తరువాతి ఘటాగ్న్యుదక విషకోశ దైవికములు ముఖ్యమైనవి, ఉత్తమమైనవి. ఈ పత్రములు, చంద్రస్వామి వ్రాసిన లేఖలు, అతనికి వచ్చిన లేఖలును అని చెప్పి సభాధ్యక్షుడగు నా ప్రాడ్వివాకునకు ఒక్కొక్క లేఖయు వినిపింప నక్కడనున్న సభ్యులలో నొక్కరిని గోరెను. ఆ లేఖాపత్రముల నెవరు సముపార్జించిరో, ఏరు తెచ్చిరో తెలియదు.

“ఓ పితామహసమాన! మేరునిశ్చల! బుద్ధసన్యాసి చేసిన పాషండ బోధలు ప్రజల ముక్తిదూరుల చేసినను, మన ప్రయత్నములచే వారు దైవ భక్తులగుచున్నారు. గ్రామములు బౌద్ధమతమునుగొని దేవపూజల మట్టు పరచినని. వేదగానములు లేవు. పురాణ శ్రవణములు లేవు. హరిభజనలు లేవు. మహేశ్వరార్చనలు కానరావు. మన దేవులందరును సర్వవిశ్వరూపుడైన భగవంతుడును ఈ పాషండుని సేవకులట. మన్మథుడు మారపిశాచియై యా “దివ్యమూర్తిని భ్రమ పెట్టబోయి యోడిపోయెనట. అట్టిది నేడు మరల వేదగానములు, భగవద్గ్రంథపారాయణము వినుచున్నాము. కొన్ని యజ్ఞముల జరిపించినాము. ఇంతకును మన చక్రవర్తి బౌద్ధుడు. ఆతనికి వేద మతసంప్రదాయము బోధింపకున్నచో నేమియు లాభములేదు. ఆతనికి పాషండమత బుద్ధి నశించి, దైవభక్తి కలుగునట్లు ప్రయత్నము చేయవలయును.”

ఇట్టి లేఖలు నాలుగయిదింటిని సభ్యుడొక్కడు చదివెను. ఇంకొక లేఖలో చివర “ఆంధ్రమున బౌద్ధరాజ్యము నశించి వేదరాజ్యము ప్రబలమగు గావుత” యని యుండెను. అనేక సాక్షులను విచారించిరి. “చంద్రస్వామి వేదదేవతలను పూజించును. మహేశ్వరుడు ఆతనికి అధిదేవుడు” “గ్రామములో జరుగు నుత్సవముల కీతడు రాడు. పంచాయతీ సభ్యుల నెన్నుకొను సందర్భమున చంద్రస్వామి ఏ విధమగు నుత్సాహమును గనబరచలేదు.” “ఆతని ఇంటికి ఇతరదేశస్థులు కొత్తపురుషులు రాసాగిరి. అనేక రాజద్రోహసభ లాతని ఇంటిముందు జరుగుచున్నవని మాకు తెలియవచ్చినది.” “నేను చంద్రస్వామిచే బ్రాహ్మణమత దీక్ష గైకొంటిని.” “నాకు లేఖలిచ్చి వివిధ గ్రామములకు పంపుతారు” అని పలువురు సాక్ష్య మిచ్చిరి. “ఒకనాడు వేంగీపురమున సంచరణుని యింట నిట్టి సభ జరిగెను. నేను చంద్రస్వామితోకూడ అక్కడకు పోతిని. నన్ను వారు సభలోనికి రానీయలేదు. కాని యొక్కసారి పరధ్యానముతో నున్న నాకు మంజుశ్రీయను మాట వినబడినది” - అని చంద్రస్వామికి కొంతకాలము క్రిందట సేవకుడిగా నున్న యొకడు సాక్ష్యమిచ్చెను.

“అయ్యా! నేను మహేశ్వరానందుని సేవకుడను. శ్రీరాజకుమార మంజుశ్రీని తస్కరించుకొని పోయినవారలలో నొకడు మహేశ్వరానందుడు. ఆతడు చంద్రస్వామి, సంచరణుడు, సోమత్తరస్వామి మొదలగు వారలతో గూడియుండుట చూచితిని. అతడు శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొని పోయెనని నాకెట్లు తెలిసెనన ఒకనాడు, అనగా ఇప్పటికి సుమారు పదునాలుగు నెలలవెనుక, అతడును ఒంకొకడును “మంజుశ్రీని మేము హుటాహుటిగా కొనిపోయినాము. అంచెల యేర్పాటు విచిత్రముగా చేసినారు మనవాళ్ళు” అన్న మాటలు నాకు వినబడినవి. అటు తరువాత వారు సన్ననియెలుగుతో మాట్లాడినారు గాన వినబడలేదు” అని యింకొకడు తెలిపెను.

పిమ్మట చంద్రసామి యీ విధముగా సభ్యులదిక్కు మొగంబై చెప్పెను. “న్యాయా న్యాయవిచక్షణులగు సభ్యులకు నేనేమియు చెప్పనక్కర లేకుండగనే నాయందు దోషయేమియు లేదని తెలియును. నా అంతరాత్మయందు ఆద్యంతరహితమై, భగవత్స్వరూపమై వెలుగు వేదములే ప్రమాణములని నమ్మకము. ముక్కోటి దేవతలును ఏకబ్రహ్మ స్వరూపముకొన, ప్రజల దైవదూరులచేసి, మహాపాపము నెలకొల్పుచు, జంబూద్వీపమునే యమలోకమొనరించు నీ పాషండ బౌద్ధమతము నశియించి ధర్మ స్వరూపమగు వేదమతము పునరుద్ధరింపబడవలెనని నా యాశయము. ఇప్పటికిని నాకోర్కెయదియ. వారణాసీపురము, తక్షశిల, పూర్వశైలము ఉజ్జయిని మొదలగు ప్రసిద్ధదేశముల తిరిగితిని. మూడు వేదముల నభ్యసించితిని. ఉపనిషత్తులు, ఇతిహాసములు మొదలగు సమస్త మహా గ్రంథము లెరిగితి. బౌద్ధమత రహస్యములు గ్రహింప పీఠకములు, ధర్మ సూత్రములు మొదలగు గ్రంథరాజములు పాటలీపుత్రమున అభ్యసించితిని. కాని బౌద్ధ మతమున నాకు ద్వేషము మెండయినది. నా జన్మభూమి కేతెంచిన నాటగోలె నా దేశమున బౌద్ధమతము నాశనముచేసి వేదమతము పునరుద్ధరింప సంకల్పము దాల్చితిని. అందుకై అనేకులకు బోధచేసితిని. అనేకులు బౌద్ధులను, వారి దీక్ష మాన్పించితిని. ప్రాయశ్చిత్తములు చేయించితిని. కాని అన్ని దేశములకన్న ఆంధ్ర దేశమున బౌద్ధమతము లోతుగా వేళ్ళుబారియున్నది. నాగవంశములవారు, క్షత్రియులు ఈదీక్ష పుచ్చుకొనినారు. కాన ప్రాబల్యముగాంచిన ఈ చార్వాకమతమును పెల్లగింప నాయొక్కనిచే గాదు. అయినను నాబోటివారు అనేకులు నాతో చేరినారు. మా యుద్యమము విజయము గాంచ సిద్ధమైయుండెను. చక్రవర్తికి ముందు మత దీక్షయీయవలె, దానికై మా ప్రయత్నము, అంతియకాని మాకు సార్వభౌమునిపై కుట్రలేల? మహారాజుకు మతదీక్ష యెట్లీయ వలయునను కుట్రతప్ప ఇతరము నేనెరుగ.

“నేనున్న సభయందు శ్రీ రాజకుమార మంజుశ్రీమాట వినబడెనని ఆ సాక్షి తెలుపుచున్నాడు. ఎవరయ్యా శ్రీ రాజకుమార మంజుశ్రీని తస్కరించుకొని పోయినది?” అని యప్పుడు మేమనుకొంటిమి, అంతియ. ఇంకొక సాక్షి శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొనిపోయెనని యనుచున్నప్పుడు తాను వింటిననియు, వానితో నాకు స్నేహమనియు చెప్పినాడు. అది నిజమనుకొండు. అతడు శ్రీ రాజకుమారుని ఎత్తుకొనిపోయినవాడని మాకు తెలియగలదా? నా లేఖలలోగాని, నా నడతయందుగాని స్పష్టముగా శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొనిపోయితినన్న నిర్ధారణయేది? అప్రత్యక్షసాక్ష్యము పనికిరాదని ధర్మశాస్త్రము విధించియుండలేదా? దైవాంశమగు శాతవాహనవంశము వైదికమతము నుద్ధరించుచు చల్లగా మనుగాక” అని చంద్రస్వామి చెదరని కన్నులతో, నవ్వుగదురు ముఖముతో, గంభీరమగు అభినయముతో తన నిర్దోషిత్వము నుపన్యసించెను. ఇంకొక యామము విచారణ జరిగినది.

శిక్ష విధించుటకుముందు ఇరువురు భిక్షులు లేచి “ధర్మచక్ర మీ సభాస్థానమున విలసిల్లుగాక! భగవాన్ మహాశ్రమణకు డిందు ప్రత్యక్షమగుగాక!” అని ప్రాకృతమున శ్లోకములు చదివిరి. ఇరువురు బ్రాహ్మణోత్తము లప్పుడు ముందుకువచ్చి “సభాసదుల హృదయమున సర్వవ్యాపియగు ఆదినారాయణుడు నిండియున్నాడు. కాన వారు ధర్మదేవతాస్వరూపు లగుదురుగాక” యని మంత్రములు చదివిరి.

ప్రాడ్వివాకుడు సభ్యుల యభిప్రాయ మడిగెను. అందరును ఈతడు నిర్దోషి యని నమ్మజాలమని చెప్పిరి. అప్పుడు మహాపండితుడును, సకల మత ధర్మసారము నెరిగినవాడును, సత్యాన్వేషియునగు నా ప్రాడ్వివాకుడు చంద్రస్వామి నుద్దేశించి “ఓ బ్రాహ్మణోత్తమా! నీవు దోషివికావని చెప్పలేము. కాన నీకు ఒక సంవత్సరము పాతాళ గృహవాసము విధించితిని. నేను తప్పభిప్రాయము పడిన ధర్మము నన్ను శిక్షించుగావుత” అనియాతడు లేచెను. సభవారందరు లేచి నిలుచుండిరి.

అంత తేజస్వియు, ధర్మదేవతాస్వరూపుడు నగు ఒక భిక్షుకు డా సభాభవనము ప్రవేశించెను. అందనేకు లాయనకు సాష్టాంగనమస్కార మాచరించిరి. ప్రాడ్వివాకుడు మోకరించి ఆయన పాదములబట్టి కన్నుల నద్దుకొనెను. అంత నాతడు ప్రేమవంతములై, శక్తిసంపన్నములై, తేజోవంతములగు తన దృక్కుల నా ప్రాడ్వివాకునిపై బరపి “నాయనా! ఈ కుమారుడు నిర్దోషి కాన యీతని విడిచివేయు” మని సెలవిచ్చెను. అంతవృద్ధుడగు నా ప్రాడ్వివాకుడు నా నూత్నపురుషునికడ మోకరించియే “తండ్రీ! నేను శిక్ష విధించిన వెనుక తగ్గించుటకు నా కధికారము లేదని తమకు తెలియదా?” యని ప్రశ్నించెను.

ఆ తపస్వి నవ్వి “ఓయి! వెర్రికుమారా! నాకుమాత్రము ధర్మశాస్త్రము తెలియదా? ఇదిగో సార్వభౌముని ఆజ్ఞాపత్రము” అని యొకతాటియాకు పత్రము తన కాషాయాంబరములనుండి తీసి యాతని కిచ్చెను. ప్రాడ్వివాకుడు దానిని కన్నుల నద్దికొని చూచి, లేచి, యిట్లు చదివెను. “ఏ దోషములేదని శోణనగ గ్రామకాపురస్తుడగు చంద్రస్వామిని మేము విడిచిపుచ్చుచున్నాము. ఇయ్యది ప్రాడ్వివాకునకు మా ముదల. స్వహస్త్రనామాంకిత శ్రీ కౌశికీపుత్రశ్రీముఖశాతవాహన మహాశ్రమణ శక 483 పరాభవసం.ర చైతు. సప్తమి” అని యున్నది. అప్పుడు చంద్రస్వామి ముందుకరుదెంచి ఆ భిక్షుకునకు సాష్టాంగ నమస్కార మొనర్చెను. అతని కన్నులలో నీరు సుడిగుండములై దొన దొన జారినవి.

15. శృంగార విభావము

కామవిజయ నాట్యము, కామవిజయనాట్యమే అయినది. సువర్ణశ్రీ ప్రప్రథమమున హిమబిందును ఆ నాట్యమునందు చూచినాడు.

ఎవరీ బాలిక? ఎంత అద్భుతసుందరి! ఈ బాలిక స్వప్నమూర్తియా? నిజమా? ఏ మహాశిల్పి మలచినా డీ విగ్రహమును! ఏ చిత్రకారు డీ రూపరేఖలు దిద్దినాడో?

ఆ ఆలోచన లాతనికి కొంత వ్రీడాభావ మంకురింపజేసినవి. ఆ బాలికను చూడలేడు, చూడక ఉండలేడు. అతనికి తక్కిన ప్రపంచమంతయు మాయమైనది. తనచుట్టును ఆ బాలికలు నృత్యముచేయుచు, పాడుచు, అభినయించుచుండిరి. కాని ఆతని కా ఒక్క బాలికయే నాట్యమాడుచున్నట్లున్నది! ఆమె మనోహర కాదంబినీమాలికవలె క్షణక్షణము సుందరాతి సుందరరూపముల మారుచున్నది. ఆమె పాల్కడలి వాగులవలె భంగికా మనోహర యగుచున్నది. ఆమె వివిధకరణ నిమగ్నయై కుసుమమున మంద మలయానిలయమైనది. ఉధితస్వర రాగకంఠియై ఆ బాల శారదా కరచామీకర విపంచియైనది. ఆమె భుజరేఖలు సువ్వున జారి అంగుళీ రేఖలో వికస్వరమైనవి. బాహుమూల పార్వ శోభారేఖలు వక్షోపరిసమున్నత సుందరాకృతులు తాల్చి, వక్రపతనా వేగమున డిగ్గనురికి మధ్యదేశమున నించుక కాలూని, మలుపులై నితంబచక్రముల సుళ్ళుతిరిగి ప్రవహించి, ప్రవహించి పదరేఖలు మొగ్గలు దొడిగినవి.

ఇది సౌందర్యమా, సౌందర్యమూలకారణమా? ఆతని హృదయ వేగమునకు శ్రుతియైనది హిమబిందు బాలికాచరణసువర్ణమంజీరవేగము. రెండు వేగములు? మహారభటితవృత్తులై లయించినవి.

మహావైభవమున భద్రదంతావళమున సర్వమంగళవాద్యములుమ్రోయ ప్రజానీక సేవితుడై ఊరేగి, ఇంటికి చేరినాడు సువర్ణశ్రీకుమారుడు. కాని సుందరాతిసుందరమూర్తి ఆ బాలికయే ఆతని సమ్ముఖమున ప్రత్యక్షము.

తెల్లవారునప్పటికి ఇంటికి చేరిన సువర్ణశ్రీకుమారునికి శక్తిమతీ దేవియు, నాగబంధునికా సిద్ధార్థినికలు, మహాలియు, పుణ్యాంగనలు, బంధు స్త్రీలు హారతులిచ్చి, దృష్టితీసి, లోనికి తీసికొనిపోయిరి. సువర్ణశ్రీ తలిదండ్రులకు, బందుగులకు పాదాభివందన మాచరించెను. రెండు దినములు గడచినవి. ఆతని పరధ్యానము తల్లిదండ్రులనే యాశ్చర్య పూరితుల చేసినది.

ఎప్పుడును శిల్పగృహమునందో లేక వ్యాయామప్రదేశములందో కాలము గడపువానికి బండిపందెముల గెలుపుచే నిప్పుడీ పరధ్యానమేమి అని ధర్మనంది యనుకొనెను. ధర్మనంది భార్యనుజేరి, “అబ్బాయి అట్లున్నాడేమి? కారణమేమో నీకు తెలిసినదా?” యని పలుకరించెను. శక్తిమతీ దేవి భర్తను కనుంగొని “నాకునూ ఆశ్చర్యము కలిగించుచున్నది. ఏమయియుండును? భోజనము తిన్నగా చేయుటలేదు. ఏవియో రెండు మెతుకులు నోటవేసికొని ఎక్కడెక్కడనో తిరుగుచుండును” అని ప్రత్యుత్తర మిచ్చినది.