హిమబిందు/ప్రథమ భాగం/11. విజయ బహుమానము

వికీసోర్స్ నుండి

అప్పుడు సోమదత్తుని మోము పరికించి చక్రవర్తి యిట్లనియె “వ్యాయామాచార్యా! సోమదత్తా! ఈ బాలకు డెవరు? ఈతని యుదంతమేమి?” అని యడిగెను.

“మహారాజాధిరాజా! ఆంధ్రసార్వభౌమా! సర్వరాజన్యకిరీటమణి ప్రభాస్నాత పాదుకా! జయ జయ! ఈ బాలుడు దేవరశిల్పియై విఖ్యాతి గాంచిన మహాభక్తుడగు ధర్మనంది తనయుడు. సువర్ణశ్రీకుమార నామధేయుడు. నా శిష్యులలో నుత్తముడు. ఉక్షాశకట పరీక్షకు మా పరిశ్రమాలయ పక్షమున నొకవీరుని పంపుట పూర్వమునుండియు ఆచారము. శ్రీ శకటాధ్యక్షులు మాకు లేఖ నంపుటతోడనే మే మొక పందెము నేర్పరచి అందు విజయుడగువాని నీ ఉత్సవపరీక్షకుపంపుట దేవరకు విశదము. ఈ సంవత్సర మీబాలుడు విజయియై ఇచ్చటకువచ్చి ఇక్కడను జయము గొన్నాడు” అని విన్నవించెను. అప్పు డొక్కసారి వందిమాగధులు పాడినారు. దుందుభుల మ్రోగించినారు. జయ జయధ్వానము లొనర్చినారు. వైతాళికులు కీర్తించినారు. మేళపతులు శంఖ కాహళ నాగస్వరాది వాద్యముల పల్కించిరి.

11. విజయ బహుమానము

సద్దుమణగినంతనే సార్వభౌముడు మహామంత్రివైపు చూచెను. మహామంత్రి ప్రధాన వైతాళికుని కన్నుసన్న జేసెను. అప్పుడు తళుకు తళుకుమను దీపలక్ష్ములు, సర్వభూషణాలంకృతలై హారతులగొనివచ్చి, పాటలు బాడి మంగళము లిడిరి. ఇరువురు బాలికలు వెంటనే వివిధ సుమమాలల గొనివచ్చి యాతని మెడను వైచిరి.

అంత వీణానాదము మృదంగము వేణుస్వనము వినవయినవి. ఈ వలావలనుండి సుందరులగు ఇరువదిమంది బాలికలు నాట్యము చేయుచు విచ్చేసి సువర్ణశ్రీ కుమారుని చుట్టును “ధర్మవిజయము”ను అద్భుతాభినయపూర్వకముగ నాట్యమొనరింప నారంభించిరి. ఆ బాలికలలో సార్వభౌముని ఇరువురి తనయులు, రాజకుటుంబములోని బాలికలు, సచివుల సేనానాయకుల కుమార్తెలు, కోటీశ్వరుడగు చారుగుప్తుని పుత్రి హిమబిందును కలరు. ఆ నాట్యమునందు పాల్గొననుత్తమవంశ సంజాతలగు యువతీ రత్నములకే అర్హత.

మంగళవాద్యములు మ్రోగుచుండెను. దేవవేషమున నాట్యగురువు ప్రవేశించెను.

ఈ విజయ గీర్తింప
ఈ వియచ్చరులెల్ల
గగన పథముల వచ్చి
కాంతితో ప్రసరించి
పూలవర్షము కురిసి
తేలుచున్నారదిగొ
ఈ విజయ గీర్తింప”


బాలిక లప్సరసలవలె నభినయించుచు,

“ఓయి యౌవనమూర్తి
ఓయి సుందరస్వామి
రావయ్య జయదామి
కావక్షుడవు కమ్ము”

నాట్యమాడిరి.

నాట్యగురువు:

ఇంద్రుడిచ్చును కీర్తి
చంద్రుడిచ్చును విద్య
వాయుదేవుడు బలము
వరుణుడిచ్చును శక్తి.

బాలికలు నాట్యము సలుపుచుండిరి.

నాట్యగురుని శిష్యుడు మారువేషమున,

“ఎవడవోరీ మానవాధమా!
ఇవ్వనవాటిని నిలుచున్నావూ?

ఇరువురు శిష్యులు అహంకారుడు, స్వార్థుడు అను దేవతలుగా పాడుచు తాండవింతును.

“లోకముకొరకై సేవనుమానుము
లోకము నిన్నేకొలుచునురా!”

మారుడు :

మారుడ నేనే, శూరుడ నేనే
మాయలకంతకు నేతను నేనే
జగము లన్నిటిని కాలనుత్రొక్కెద
జగములు నన్నే పూజలు సేయును
నన్నుకొలిచికొనువారికే విభవము,
నాకము వారికి పాదాక్రాంతము,
ఛత్రచామరము సర్వరాజ్యములు
సర్వసంపదలు వారికె దక్కును;
రారా! రారా! విజయరూపుడా!
రారా, వచ్చియు నన్ను కొలువురా!

కొందరు బాలికలు మారుని కొమరితలవలె దివ్య వేషములప్రవేశించి:

జగంబంతట వీరహృదయులు
జిఘృక్షులుగా మోకరింతురు,
మాదగు సౌందర్యమ్మును చూచి
మమ్ములనే కామించి వత్తురు.

జగం.

మనృణకినలయబాహువల్లరి
మధురముగ నిను కౌగలించును
వినముకాదిది వాతెరసుధరా
మెనవరా దేవుడై వెలిగెదవు.

జగం.

ఇంతలో రాజపుత్రికలు, హిమబిందు, రాజబంధు తనయలు, అష్టమార్గ మూర్తులవలె విచ్చేసి నాట్యముచేయ నారంభించిరి. చక్రవర్తి ప్రథమతనయ మాయాదేవి విజ్ఞానదేవిగా, ద్వితీయ పుత్రిక శాంతశ్రీ సత్యచింతనాదేవిగా, హిమబిందు ధర్మకర్మదేవిగా, నాగబంధునిక ఉత్తమాశయదేవిగా, ఇతర బాలికలు తక్కినవారుగా నటించిరి.

విజ్ఞానదేవి :

జన్మంబు మాయరా
జగమే హుళక్కిరా
సర్వభోగము లవియు
ఛాయలే ఎరుగరా,

సత్యచింతన :

జగములో ఎవ్వరికి
సలుపకోయీ హింస
పాపకాంక్షలు నీకు
చూపవుర నిజపథము.

ధర్మకర్మదేవి :

ప్రేమయే నీ కర్మ
ప్రేమయే నీ దారి
సర్వ ప్రాణులు నీవె
సర్వబాధలు నీవే!

ఉత్తమాశయదేవి :

మూడురత్నము లివిగొ
చూడరా! వేడరా!
నాల్గు సత్యాలనే నమ్మరా, ఎరుగరా!

సత్యవచనదేవి :

అనృత మాడబోకు
ఆనంద మొందరా
 కానిచో మాటయే
కంఠాన రానీకు.

న్యాయజీవితదేవి :

పరధనము వలదురా
పరకాంత వలదురా
 వలదురా పరభూమి
వదలరా వాసనల.

శీలదేవి :

 వలదు భోగము మనకు
వలదు యశములు మనకు
కలలైన జన్మాలు
గాఢశత్రులు మనకు.

ఆనందదేవి :

ఏమి లేకుండుటే
ఎరుగు నిర్వాణంబు
కర్మరహితంబైన
 జన్మరహితంబౌన
 అదియ ఆనందమౌ
 అదియె నిర్వాణమ్ము.

హిమబిందుకుమారి సమవర్తి ఓడిపోయి రెండవవాడుగా మాత్రము వచ్చుట చూచి వెలవెలపోయినది. ఆమె హృదయము క్రుంగిపోయినది.

పెన్నిధి పోగొట్టుకొనినవానివలె క్రుంగిపోయిన తండ్రిని జూచి, యామె కన్నుల నీరు తిరిగెను. ఇంతకు నా నూత్నబాలకు డెవ్వరో తన తండ్రికి దుఃఖకారణుడైనాడు. ఆతడు పిశాచి, రాక్షసుడు. ఆమె ఆ బాలకుని ఇచ్ఛామాత్రమున నాశనముచేయ నూహించినది.

విజయము నందుటకుగాని, ఓడిపోవుటకుగాని ఆ పందెమున ఎద్దులే కారణమయినను, సారథిని కారకునిగా ఎంచి నిందించువారిలో చారుగుప్తుడును చేరినాడు. ఇంతలో అతనికి జ్ఞానోదయమై, తన్ను తానే నిందించుకొనినాడు.

తా నెన్నివేల ఫణములు పెట్టి కొనిననేమి? మహోత్తమ వృషభముల కనుగొనలేక పోయినాడు. ఆ చక్కని గిత్త లెచ్చటివి? ఏ జాతివి? తన గోపాలురకు, గోరక్షకులకు తెలియకుండ నెచ్చట పెరిగినవి? అలాంటి దివ్యవృషభములు లక్షఫణములు మూల్యమిచ్చికొన్ననేమి?

తన స్వప్నములు పటాపంచలైనవి. తాను కౌశికునివలె పన్నిన మొదటి ఎత్తే విచ్ఛిన్నమైనదేమి? ఇది అపశకునమా? ఛా, ఎన్నిసారులు ఓడిపోయి చాణక్యదేవుడు జయమందలేదు? అదిగో తన బంగారు ప్రోవు, దివ్యమూర్తి. హిమబిందు తన్నుజూచి బెంగపెట్టుకొన్నది.

అనుకొనుచు చారుగుప్తుడు కలకల నవ్వుచు, “మనమును విజయునకు కాన్క నీయవలె, హిమబిందూ! హరగోపా! అలంకారికుని, కుయవుని ఇటు రమ్మను!” అని ఆజ్ఞ యిచ్చినాడు.

కుయవానందుడు అద్భుతశిల్పి, అలంకారికుడు. ఆయన మందిరము వెనుక ప్రక్కనుండి ముందునకు వచ్చి, చారుగుప్తునితో రహస్యముగ మాట్లాడి అశ్వము నెక్కిపుర మార్గమున వెడలిపోయెను.

తండ్రిగారి సంతోషము కనుంగొని హిమబిందు హర్షవదనయై నాట్యమున కలంకరించుకొన చక్రవర్తి మందిరము వెనుకనున్న నేపథ్య మందిరమునకు బోయెను.

అచ్చటనున్న యా చకోరాక్షుల, ఆ యిందీవరనేత్రల, ఆ కురంగ లోచనల నడుమ హిమబిందు మహాపద్మనేత్రయై, తారకామధ్యచంద్ర బింబమువలె కాంతులీనుచుండెను. రావి వనములోని వటవృక్షమువలె విలసిల్లెను. మొదట హిమబిందును సమవర్తి చూచుచునే యుండెను. ఆమెవదన మవనతమై సమవర్తి హృదయమును గ్రుంగజేసినది. చేయి పెట్టి కలచివేసినది. తన దురదృష్టముచే మేనమామకు అపజయము కలిగినది కదా యని యాత డనుకొనెను. ఇంతలో చారుగుప్తుడును నవ్వెను. సమవర్తి మనస్సు చకితమై వికారమునందెను. పదునారేండ్ల ఎలప్రాయపు ఆ జవ్వని తన మనస్సంకల్పమునకు, భావనేత్రమునకు ఇదివరకు గోచరము కాని పొంకముతో, అత్యద్భుతసౌందర్య రూపమున ఎదుట ప్రత్యక్షమై నప్పుడు అతనికి మరేమియు కన్పట్టలేదు. నాగస్వరము నూదు పాముల వాని అభినయముల తదేకదీక్షతో చూచు సర్పమువలె నాతడు హిమబిందుగమనము చూపులతో ననుసరించుచుండెను. చక్రవర్తి సింహాసనపాదముమ్రోల విజయపీఠిక యమర్పబడినది. సువర్ణశ్రీ కుమారుని నందధివసింపజేసి వసిష్టు డాశీర్వాదముచేసి సువర్ణా క్షతల జల్లుటయు, సార్వభౌముడు, మహారాణియు, రాజబంధువులు, శ్రీకృష్ణసాతవాహన మహారాజు, మంత్రులు, సామంతులు, వేదపండితులు, శ్రమణకులు, ధర్మనందియు నక్షతల జల్లిరి. హిమబిందుకుమారి తన యపాంగవీక్షణముల సువర్ణశ్రీ కుమారుని గాంచెను. ఆమె హృదయము ఏలనో దడదడ కొట్టుకొనెను.

ఇంతలో నొక వైతాళికుడు శంఖమూదెను. అప్పు డా చంద్రరేఖలగు ముగుదలు నాట్యము చాలించి వారి వారి పీఠముల నధివసించిరి. చక్రవర్తి పీఠమునుండి లేచుటయు, మహాసభయంతయు లేచెను. శకటాధ్యక్షుడగు మహశ్రీ సువర్ణశ్రీకుమారుని చేయి పెట్టుకొని సార్వభౌముని కడకు గొనిపోయెను. ఆ బాలకుడు చక్రవర్తికి మోకరించి లేచెను. ఒక సచివుడు ప్రతీహారి అందిచ్చు నవరత్నఖచితమై, బంగారు పనితనముగలిగి, కన్యాకుబ్జ లోహకారకులచే నిర్మింపబడి, పదునేను మడతల ఉక్కురేకు కలిగి, పదునుకడ గాలిలో మాయమై, మొరవవైపు యవగింజ పరిమాణముకలిగి, జవజవలాడు, తళుకు తళుకులాడు, మహానిశితకృపాణమును సార్వభౌముడు దుకూలవస్త్రములతో, తాంబూలములతో బహుమాన మొనర్చెను. ఒక్కసారిగా భేరీ మృదంగాది వాద్యములు భోరుకొల్పబడినవి. మరల నిశ్చలత జనింపగానే, యువరాజు ముందున కేతెంచి సువర్ణ శ్రీకుమారుని మహశ్రీ తన వెనుక తీసి కొనిరా, మందిరముకడకు సూతుడు కొనివచ్చిన యొక కాంభోజాశ్వమును- నల్లనిదానిని, సన్నని ముట్టె కలదానిని, చామరమువంటి తోక గలదానిని కెరటములవంటి మెడజూలు కలదానిని, లేడి కాళ్ళవలె పాదములు కలదానిని పంచకళ్యాణము లున్నదానిని - కళ్లెముబట్టి సువర్ణశ్రీ కుమారుని చేతికందిచ్చెను. మరల దుందుభులు మ్రోగినవి. అప్పుడు మహారాజ్ఞి పరిచారికవచ్చి, యా బాలుని సింహాసనముకడనున్న రాణికడకు గొనిపోయెను. అప్పుడా సాధ్వి “ఇది నీ వివాహమునాడు నీ భార్యకి” మ్మని రత్నమంజూష నొకటి చెలికత్తెచే నిప్పించెను. సమస్తవాద్యములు ధ్వనించినవి.

ఇంతలో చారుగుప్తుడు ముందుకువచ్చి, ధర్మనంది చేయిబట్టి సువర్ణశ్రీ కడకు గొనివచ్చి “ధర్మనందులవారూ! మీ కుమారుడు సర్వతంత్ర స్వతంత్రుడయ్యా! మీ రిట్టిబాలుని కనుటచే ధన్యులు. ఈనాడు విజయమందిన మీ కుమారునకు, నేనును చిన్నకాన్కను సమర్పించుచున్నాను” అనుచు హరగోపుడందిచ్చిన రత్నఖచిత సువర్ణపేటికను మూత తెరచి, సువర్ణశ్రీ హస్తముల నుంచినాడు. అందు దంతపుటము లపై చిత్రించిన పరమపవిత్ర వినయపీఠిక గ్రంథమున్నది. సువర్ణశ్రీ ఆపేటికను కన్నులకు, శిరమునకు నద్దుకొని తన ప్రక్కనున్న రాజసేవకునకందిచ్చెను. ఉత్సవమంతయు నైనవెనుక సార్వభౌముడు మందిరము దిగి దురోన్ముఖుడై దంతావళ మారోహించెను. విజయ సింహుడగు సువర్ణశ్రీ కుమారుని అలంకారభూయిష్టమగు అంబారీ కల యొక మదగజముపై నధివసింపజేసి ధాన్యకటకపురిని ఊరేగింప బయలుదేరదీసిరి.