సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/పొట్టి శ్రీరాములు

వికీసోర్స్ నుండి

ఆంధ్రప్రదేశ్ అవరతణకు మూలపురుషుడు

అమరజీవి పొట్టి శ్రీరాములు

హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకుని ప్రచారం చేశారు. మండుటెండల్లో చెప్పులు, గొడుగు లేకుండా జాతీయోద్యమాన్ని చాటి ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు "పిచ్చి శ్రీరాములు" అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది.

’పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు వుంటే, మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్ర్యం తెచ్చి పెట్టగలను ' అన్నారు గాంధీజీ.

దేశభాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడాయన.

పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటపల్లెకు చెందినవారు. ఆయన తండ్రి గురవయ్య. తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు గారి బంధువుల కుటుంబాలు మద్రాసులో వున్నందున గురవయ్య గారు కూడా మద్రాసులో స్థిరపడ్డారు. శ్రీరాములుగారు మద్రాసు జార్జిటౌన్ అణ్ణాపిళ్ళె వీధిలోని 165 నంబరు ఇంటిలో 1901 మార్చి 16వ తేదీన జన్మించారు. ఇరవై ఏళ్ళ వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశారు. త్వరలోనే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో నెలకు రు.250/- జీతంగల ఉద్యోగంలో చేరారు. పాతికేళ్ల ప్రాయంలోనే ఆయన భార్య గతించింది. ఆ కారణంగా ఐహిక సుఖాలపట్ల ఆయనకు విరక్తి కలిగింది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని నిశ్చయించారు.

గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి జాతీయోద్యమ శంఖారావం పూరించారు. బాపూజీ పిలుపు విన్న పొట్టి శ్రీరాములు 1927లో తన ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. తన ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచి పెట్టారు. సబర్మతీ ఆశ్రమం చేరారు. గాంధీజీ శిష్యులుగా నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. మూడు సార్లు రాజకీయ నిర్భందితులుగా కారాగార వాసంచేశారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘనం వంటి ఉద్యమాల్లో అగ్రగామిగా వుంటూ గాంధీజీ ప్రశంసలందుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోను, వివిధ ప్రాంతాల్లోనూ, మన రాష్ట్ర మందలి కొమరవోలులోను నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప సేవచేశారు. 1941-1942 సంవత్సరాల సత్యాగ్రహం, 'క్విట్ ఇండియా' ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1944లో నెల్లూరు కార్యక్షేత్రంగా ఖద్దరు ఉత్పత్తి, వ్యాప్తి కార్యక్రమాల్లో తీవ్రంగా కృషి చేశారు.

1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ఫలితంగా హరిజనులు ఆలయంలో ప్రవేశింపగలిగారు. ఆ సంవత్సరంలోనే మద్రాసు ప్రభుత్వంచే హరిజనుల ఆలయప్రవేశం, హరిజనోద్ధరణకు సంబంధించిన రెండు శాసనాలను ఆమోదింప చేసేందుకు 23 రోజుల నిరశన దీక్ష చేశారు. ఆయన వజ్ర సంకల్పం ఫలించింది. మూడో మారు వార్థాలో 1948లో నిరాహార దీక్ష 29 రోజులు సాగించారు.

ఆయన పదవులకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం ఏనాడూ పోరాడలేదు. గాంధీజీ బోధించిన సత్యాహింసలు, హరిజనోద్ధరణ ఆయన జీవితాశయాలు. మిత్రుల వత్తిడిని కాదనలేక కొంత కాలం ఆంధ్రరాష్ట్ర గాంధీ స్మారక సంఘ కార్యదర్శిగా పనిచేశారు.

శ్రీరాములుగారు జీవితపు చివరి దశలో నెల్లూరులో వుంటూ హరిజనోద్ధరణకు నిర్విరామంగా పనిచేశారు. హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని వ్రాసిన అట్టలను మెడకు, వీపుకు తగిలించుకుని ప్రచారం చేసేవారు. త్యాగమే ధనంగా పెరిగిన ఆయన ముతక ఖద్దరు దుస్తులు ధరించి, నెల్లూరు పట్టణ వీధుల్లో దయగలవారు పెట్టిన ఆహారంతో బ్రతికారు. కాళ్లకు చెప్పులుగాని, తలపై గొడుగుగాని లేకుండా మండుటెండల్లో తిరుగుతూ జాతీయ ఉద్యమ ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు "పిచ్చి శ్రీరాములు" అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది.

మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న సవతి తల్లి దృష్టిని ఆయన గమనించారు. మద్రాసు నగరంపై ఆంధ్రులకు హక్కు వున్నదని, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం వల్లనే ఆంధ్రులు బాగుపడగలరని ఆయన భావించారు. 1952 అక్టోబరు 19వ తేదీన మద్రాసులోని మైలాపూర్‌లో బులుసు సాంబమూర్తిగారి బసలో 4వ సారి నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆ దీక్ష అవిచ్ఛిన్నంగా సాగింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి పోయింది. ప్రజల్లో ఆందోళన పెరిగింది. తనకు స్పృహ తప్పిన పక్షంలో తన వ్రతానికి భంగం కలిగించే విధంగా ఎట్టి పని చేయరాదని ఆయన శాసించారు. ఆంధ్రనాయకులు దేశాధినేతలకు విన్నపాలు పంపారు. కేంధ్రప్రభుత్వం చూస్తూ వుండిపోయింది. చివరకు ఆ దధీచి 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రాణత్యాగం చేశారు.

శ్రీరాములుగారి మరణవార్త మెరుపుతీగలా దేశమంతటా వ్యాపించింది. ఆంధ్రుల సహనం హద్దులు దాటి విశృంఖలంగా దౌర్జన్యానికి దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభంజనానికి ఎదురు నిలువలేక ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అంగీకరించింది.

1953 అక్టోబర్ 1 వ తేదీన కర్నూలు రాజధానిగ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

'ఆంధ్రరాష్ట్రము వచ్చె
మహాంధ్రరాష్ట్ర మేరుపడువేళ
పొలిమేర చేర పిలిచె'

అని దాశరథి

ప్రజలనుత్తేజపరిచారు. ఆంధ్రుల అంతిమ లక్ష్యమైన ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ రాజధానిగా అవతరించింది.

మైలాపూర్ రాయపేట హైరోడ్‌లోని 126 నంబర్‌న పొట్టి శ్రీరాములుగారు కన్నుమూసిన ఇంటిని ఆ త్యాగమూర్తి స్మృతిచిహ్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ వున్నది. ఆ స్మృతి మందిరాన్ని పవిత్ర సాంస్కృతిక క్షేత్రంగా పెంపొందించటం తెలుగు ప్రభుత్వం మొదటి కర్తవ్యం.