సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/కల్నల్ కాలిన్ మెకంజీ

వికీసోర్స్ నుండి
మన చరిత్రకు మహోపకారం చేసిన

కల్నల్ కాలిన్ మెకంజీ


"పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అన్నాడు మన వేమన.

ఆంగ్లేయులు మన దేశాన్ని మూడు వందల ఏళ్ళు పాలించారు. ఇంగ్లండు నుండి వచ్చిన అధికారులలో దాదాపు 90 శాతం మన దేశాన్ని దోచుకున్నారు.

తక్కిన 10 శాతం కొందరు మాత్రం మన దేశాన్ని, మన భాషలను సంస్కృతిని గౌరవించారు. మన ప్రజలను ప్రేమించారు. ఆ కొందరే వేమన అన్నట్లు పుణ్య పురుషులని చెప్పవచ్చు. ఆ కొందరు మనం మరవరాని, మరవకూడని వారు. వారెవరు? వారిలో ముఖ్యమైన వారెవరు? తెలుగు ప్రజలు మరవరాని వారిలో మొదటి ఆంగ్లేయుడు సర్ థామస్ మన్రో. అతడు శాంతిభద్రతలను సుస్థిరమొనర్చి, రైతులకు ఎంతగానో సహాయపడినాడు.

అగ్గిపురుగులకు ఆహారం అవుతున్న తెలుగు కావ్యాలను వేలాదిగా సేకరించి శుద్ధ ప్రతులు వ్రాయించి, నిఘంటువులను సమకూర్చి తెలుగు సాహిత్యానికి మహోపకారం చేసిన దొర సి.పి.బ్రౌన్. గోదావరిపై ఆనకట్ట కట్టించి, మరెన్నో జలాశయాలు నిర్మింపజేసి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం కావించిన అన్నదాత సర్ ఆర్థర్ కాటన్.

మన చరిత్రకు కావలసిన ముడి సరుకును సమకూర్చి, మెకంజీ కైఫియత్ లుగా పేరుగాంచిన అమూల్యమైన చరిత్రలను మనకు అందించిన మహనీయుడు కల్నల్ కాలిన్ మెకంజీ.

మెకంజీ స్కాట్లండుకు పడమరగా వున్న లూయీ అనే ద్వీపంలోని స్టార్నొవే అన్న గ్రామంలో క్రీ.శ. 1754లో జన్మించాడు. తండ్రి మర్దొక్ మెకంజీ. తల్లి బార్బరా మెకంజీ. తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ తన గ్రామంలో పోస్టు మాస్టరుగా వుండేవాడు.

స్టార్నొవేలోని బడిలో చదువు సాగించాడు కాలిన్ మెకంజీ. గణితంపట్ల ఆసక్తి ఎక్కువగా వుండేది. కొంతకాలం స్టార్నొవేలోనే పన్నులు వసూలు చేయు ఆఫీసులో గుమస్తాగా పనిచేశాడు మెకంజీ. జాన్ నేపియర్ అను సంపన్నుడు మెకంజీని తనకు సహాయకుడుగా వేసుకొన్నాడు. నేపియర్ పూర్వీకులలో గొప్పవాడైన జాన్ నేపియర్ చరిత్ర వ్రాయుటకు కావలసిన ఆధారాలన్నీ సేకరించాడు. జాన్ నేపియర్ గణిత శాస్త్రమునకు చాలా అవసరమైన "సంవర్గమానములు" లోగరిథమ్స్ కనిపెట్టాడు. విషయ సేకరణలో మెకంజీ అతనికి బాగా తోడ్పడినాడు. అప్పుడే భారతీయ గణిత శాస్త్ర విషయం తెలుసుకున్నాడు.

నేపియర్ చనిపోయిన తర్వాత మెకంజీ 1782 లో మదరాసుకు వచ్చాడు. ఈస్టిండియా కంపెనీ వారు ఇతనికి ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగమిచ్చారు. నేపియర్ అల్లుడు శామ్యూయల్ జాన్‌స్టన్ అపుడు మధురలో కంపెనీ ఉద్యోగిగా వుండేవాడు. జాన్‌స్టన్ కోరికమేరకు మధురలో కొంతకాలం వున్నాడు. అచటి పండితులతో స్నేహం చేసి భారతదేశ చరిత్రకు కావలసిన కొంత సామగ్రిని సంపాదించాడు.

ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగి కావున కంపెనీ వారి సైన్యంతాపాటు దిండిగల్లు, కోయంబత్తూరు మున్నగు చోట్ల పనిచేశాడు. 1784-90 సం.ల మధ్య సర్కారు - రాయలసీమ ప్రాంతాలలో పని చేశాడు. నెల్లూరు నుండి తూర్పు కనుమల ద్వారా రాయలసీమ ప్రాంతానికి రహదారి మార్గాల నమూనాలతో దేశపటాలు తయారు చేశాడు. కొంతకాలం గుంటూరు ప్రాంతంలొ పని చేశాడు. తన పనిని ఎంతో శ్రద్ధతో, తెలివితేటలతో చేసినందుకు మెచ్చుకొన్న కంపెనీవారు మెకంజీని గుంటూరు సీమ సర్వే చేయుటకు 1790లో అధికారిగా నియమించారు. 1792 లో టిప్పు సుల్తాన్ యొక్క శ్రీరంగపట్నంపై కారల్ వాలిస్ దాడి చేశాడు. అప్పుడు మెకంజీ కంపెనీ సైన్యపు ఇంజనీర్ గా పని చేశాడు. కారన్ వాలిస్, మెకంజీని దత్త మండలాల (నేటి రాయలసీమ) తో పాటు నెల్లూరు సీమ సర్వే చేయుటకు నియమించాడు. రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన దేశపటాన్ని, నైసర్గిక పటాన్ని మొట్ట మొదట తయారు చేసిన వాడు మెకంజీ.

ఈ సర్వే పనులలో భాగంగా దేశమంతా సంచారం చేశాడు. సుందరమైన దేవాలయాలను చూచాడు. శాసనాలపట్ల ఆసక్తిని మరింత పెంచుకొన్నాడు. ఆ కాలంలోనే ఏలూరులో వుండిన కావలి వెంకట సుబ్బయ్యగారి కుమారులతో మెకంజీకి పరిచయం కలిగింది. వారు వెంకట నారాయణ, వెంకట బొర్రయ్య, వెంకట రామస్వామి, సీతయ్యగార్లు. వీరిలో బొర్రయ్య గొప్ప తెలివితేటలు గలవాడు. మెకంజీ యువకుడైన బొర్రయ్య సహాయంతో తెలుగు, కన్నడ శాసనాలలోని విషయాలను తెలుసుకొన్నాడు. గ్రామ చరిత్రలను వ్రాయుటకు, తాళపత్ర గ్రంథాలను సేకరించుటకు చరిత్ర కుపయోగించు నాణెములను సేకరించుటకు బొర్రయ్యకు వేతన మిచ్చి వినియోగించుకొన్నాడు. బొర్రయ్య 27 ఏళ్ళ ప్రాయంలోనే చనిపోయాడు. ఆ వయస్సులోనే బొర్రయ్య చాలా విషయాలు సేకరించాడు. బొర్రయ్య తమ్ముడు లక్ష్మయ్య మెకంజీకి సహాయకుడయ్యాడు.

1810 లో మెకంజీ మదరాసు ప్రాంత సర్వేయర్ జనరల్ గా నియమింపబడినాడు. 1811-15 లో జావా ద్వీప ఆక్రమణకు వెళ్ళిన సైన్యంలోని ఇంజనీర్లకు అధికారిగా వెళ్ళాడు.

1816లో భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్ గా నియమింపబడినాడు.

1793 నుండి 1816 వరకు దక్షిణ భారత దేశంలో ఉద్యోగం చేసినపుడు మెకంజీ తాళపత్ర గ్రంథాలు, వ్రాతప్రతులు 1560 వరకు సేకరించాడు. ఇవికాక అతని సేకరణలో ప్రధానమైనవి. 1) స్థానిక చరిత్రలు : 2070
2) శాసన పాఠాలు : 8076
3) దేశ పటాలు : 79
4) బొమ్మలు : 2630 (డ్రాయింగ్స్)
5) నాణెములు : 6218
6) శిల్ప చిత్రాలు : 106
7) పురాతన వస్తువులు : 40

మెకంజీని గురించి చెప్పేటప్పుడు బొర్రయ్యను మరవలేము. కంపెని కొలువు కోసం బొర్రయ్య మచిలీపట్నంలో హిందూస్తాని, పర్షియన్, ఆంగ్ల భాషలను బాగా నేర్చుకున్నాడు. జైనుల వృత్తాంతం, మొఘలుల తర్వాత కర్ణాటక మందలి సంఘటనలు అను రచనలను ఆంగ్లంలో చేశాడు. మెకంజీ బొర్రయ్య నెంతగానో ఆదరించాడు. తన ఆస్తిలో కొంత భాగం బొర్రయ్యకు చెందునట్లు వీలునామా వ్రాశాడు. బొర్రయ్య తమ్ముడు కావలి వెంకట రామస్వామి మొట్టమొదటిసారి దక్కన్ కవుల జీవిత చరిత్రలు వ్రాశాడు. తెలుగు కవుల జీవిత చరిత్రలను గ్రంథస్థం చేసిన వారిలో మొదటి వాడాయన.

మెకంజీ సొంత పైకం 15 వేల రూపాయలు ఖర్చుచేసి తాళపత్రాలు, శాసనాలు, నాణెములు మున్నగువాటిని సేకరించాడు. మెకంజీ సేకరణలను అతని మరణానంతరం కంపెని పరంగా వారన్ హేస్టింగ్స్ 10 వేల డాలర్లకు కొన్నాడు.

మెకంజీ కృషి వల్లనే అమరావతిలో బౌద్ధ స్థూపమున్న విషయం వెల్లడైంది. 1792లో అమరావతిని దర్శించిన మెకంజీ వెంకటాద్రి నాయుడు గారిని కలుసుకొని, అమరావతి స్థూపము యొక్క వర్ణనము ఏషియాటిక్ సొసైటీ వారి సంపుటాలలో ప్రచురించాడు. హైందవ విజ్ఞాన మందిరానికి కావలి బొర్రయ్య అను మహాద్వారము నాకు లభించెనని మెకంజీ వ్రాశాడు.

వారన్ హేస్టింగ్స్ సంస్కృతం, అరబ్బి, పారసీ, జాపనీస్, బర్మీస్ భాషలలోని తాళ గ్రంథాలను, శిల్పాలు, నాణెములు మున్నగు వాటిని ఇంగ్లాండుకు పంపాడు. దక్షిణ భారత దేశ భాషలలోని స్థానిక చరిత్రలు, తాళ పత్రాలు మున్నగునవి 5,31255 ఇవన్నీ మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో భద్ర పరచబడినాయి. దాదాపు 40 ఏళ్ళు మన చరిత్రకు కావలసిన వస్తు సామగ్రిని సేకరించినవారు మరొకరు లేరు. మెకంజీ 1821లో కలకత్తాలో చనిపోయాడు. నలభై ఏళ్ళ తర్వాత మెకంజీ సేకరించిన కైఫీయత్తులలో చాలవాటికి శుద్ధ ప్రతులు వ్రాయించి ఆ గ్రంథాలను మన కిచ్చిన మరో మహనీయుడు సి.పి.బ్రౌన్.