సప్తమైడ్వర్డు చరిత్రము/మొదటి అధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీ

సప్తమైడ్వర్డు చరిత్రము.

మొదటి అధ్యాయము.

వంశ చరిత్రము

శ్రీ యయిదవ జార్జి ఈకాలమున నింగ్లండు స్కాట్లండు అయిర్లండు కన్నడా ఆస్ట్రేలియా హిందూదేశము మున్నగు రాజ్యములను పాలించు చున్నాడు. ఈయనతండ్రి యేడవ యెడ్వర్డు. ఇతఁడు పైనఁ బేర్కొనినరాజ్యములను జార్జికిఁ బూర్వమున నేలెను. ఈ యెడ్వర్డునకు ముందు నాతని తల్లి శ్రీ విక్టోరియా మహారాజ్ఞి యాదేశములను బరిపాలించెను. ఈ యమకు ముందు నింగ్లండు స్కాట్లండు మొద లగురాష్ట్రముల నేలుచుండినవారి చారిత్రమును ఇంచుక చెప్పి యావల నేడవయెడ్వర్డు చరిత్రమును అభివర్ణించెద .

రమారమి రెండువేలేండ్లకుముందు రోమనుపురిపౌరులు ఇంగ్లండును పాలించిరి. వారి వెనుక జర్మని దేశస్థులు బ్రిటననురాజ్యమునకు వచ్చి దానిని ఆక్రమించుకొని దానికి నింగ్లండని పేరిడిరి. వా రీయింగ్లండున నివసించుటచే వారికి నింగ్లీషువా రని పేరు వచ్చెను. వా రింగ్లీషు భాషను మాటాడిరి. వా రాదేశమునఁ జిన్న చిన్న రాజ్యములకుఁ బ్రభువు లై ఆయారాజ్యములను బాలించు చుండిరి. వారు రోమనుపురినుండి ఇంగ్లండునకు వచ్చినక్రైస్తవ మతబోధకుల బోధనలను విని క్రైస్తవ మతము నవలంబించిరి.

ఈ యింగ్లీషువారు ఇంగ్లండునఁ జిన్నచిన్న రాజ్యములకు నధిపతులై యుండినపుడు అయిరోపాలో నుండుడెన్మార్కు రాజ్యమునుండి కొందఱు ఇంగ్లండునకుఁ జనుదెంచి కొంచె కొంచెముగ దాని నాక్రమించుకొని పాలింపసాగిరి. వారిలో ముఖ్యులు ఆల్ ఫ్రె డ్డనుగొప్పరాజును, ఎడ్గరును, కాన్యూట్ ప్రభువును, మున్నగువారు. వీరిదొరతనమున నింగ్లం డొక యొడయనికి లోబడి యుండెను

నార్మనుదేశస్థు లింగ్లండునకు వచ్చి డేనుల నోడించి యింగ్లండు నాక్రమించుకొని యేలఁ దొడఁగిరి. వారిలో మిక్కిలిబలము కలవాఁడు విల్లియము. అతఁడు ఇంగ్లండురాజ్యము తనకు రావలయు నని గొప్పసేనను గూర్చుకొని యింగ్లండునకు నేతెంచి యందు రాజ్యము సేయుచుండినహారెల్డును జంపి యారాష్ట్రమును స్వాధీనము సేసికొని పాలింపసాగెను. ఈవిల్లియము వెనుక రెండవవిల్లియము, మొదటిహెన్రి, స్టీపను అనువార లింగ్లండు నేలిరి. వీరిపాలనలో నింగ్లండు కొంచెముగ మంచిస్థితికి వచ్చెను. మొదటిహెన్రి ప్రభువునకు మటిలాయందు జననము నొందినరెండవహెన్రి ఇంగ్లండునకు నేలిక అయ్యెను. అతని దొరతనమున నింగ్లండు కొంతవృద్ధికి వచ్చెను. అతనికి మొదటిరిచ్చర్డును జాననునాతఁడు ననునిరువురు కొడుకు లుండిరి. కాని రిచ్చర్డునకు సంతతిలేనందున నాతనితమ్ముడు జాను రాజ్యమునకు వచ్చెను. ఇతనికాలమున నింగ్లండుజనుల కోరికప్రకార మాదేశపురాజు దొరతనము సేయుటకు నారంభించెను. అనఁగా అప్పుడు రాజునకు కలనిరంకుశాధికారము ముగిసెను. జనులకు నీహక్కు ఇతనికి ముందు లేదు. జానుప్రభువునకు మూఁడవ హెన్రియు నాతనికి మొదటియెడ్వర్డును ఆయనకు రెండవ యెడ్వర్డును అతనికి మూఁడవయెడ్వర్డును బుట్టి యింగ్లండు నేలిరి.

మూఁడవయెడ్వర్డు ఇంగ్లండును ఏఁబదియేండ్లు పాలించెను. అతనికి రెండవరిచ్చర్డు పుట్టెను. ఈరిచ్చర్డు దేశము నిరువదిరెండేండ్లేలి మిక్కిలిదుష్టుఁడ్రైనందున నితనితమ్మునికొడుకు నాలవహెన్రి, వానిని జంపి యింగ్లండుదీవికి నధిపతి యాయెను. ఈహెన్రి లంకాస్ట్రియను వంశస్థులలో మొదటివాఁడు. అతఁ డింగ్లండునఱువది రెండేండ్లేలెను. అతనియనంతరమున నైదవ హెన్రియు నాతనివెనుక నాఱవహెన్రియును రాజ్యమునకు వచ్చిరి. కాని నాలవయెడ్వర్డు ఆఱవహెన్రీని దఱిమి తాను రాజ్యము నాక్రమించుకొని ప్రభుత్వము సేయఁ గడంగెను. హెన్రి ఫ్రాన్సు రాజ్యమునకు వెళ్లి యచ్చటఁ జాలినంతసేనను జేర్చుకొని యింగ్లండునకు వచ్చి నాలవయెడ్వర్డును బాఱఁదోలి సింహాసనమును బడసెను. అయిన నేమి? ఎడ్వర్డు రహస్యమున నాఱవహెన్రీని జపించి తాను సింహాసనమును బొందెను. ఈయెడ్వర్డునకు నైదవయెడ్వర్డును, రిచ్చర్డును, అనుకుమారు లిద్ద ఱుండిరి. వారు వానివెనుక రాజ్యమునకు రానర్హులై యుండిరి. కాని వారు మిక్కిలి పసికూన లైనందున జనులు వారిపినతండ్రి యగుమూఁడవరిచ్చర్డును వారిమాఱుగ నింగ్లండును బాలింప నియమించిరి. అతఁడు మిగులక్రూరుఁడును, దురాశాబద్ధుఁడును, అయి యుండినందున నాచిఱుతలను జెఱసాలలో నుంచి యచ్చట రహస్యముగ వారిఁ జంపించెను. ఈ మూఁడవిరిచ్చర్డు నోరులేనిపసికూనలను జంపించినందున, జనులు వానియెడఁ గోపము కలవారై వానిని ద్వేషించి యుండిరి. ఇంతలో నేడవహెన్రి మూఁడవరిచ్చర్డును యుద్ధంబున మట్టుపెట్టి తాను రాజ్యమును బొందెను.

ఈ యేడవహెన్రి ట్యూడరువంశస్థులలో మొదటివాఁడు. ఇతనికి నార్థరు, ఎమిదవహెన్రి, అను నిద్దఱు కుమారులును మార్గరట్టు అనుకొమార్తయును బుట్టిరి. వారిలో నార్థరు స్వర్గస్థుఁ డయ్యె. ఎనిమిదవహెన్రి తన తండ్రివెనుకఁ దాను రాజ్యమునకు వచ్చెను. మార్గరట్టు స్కాట్లండు భూస్వామి యగు నాలవ జేమ్సును వివాహ మాడెను. ఎనిమిదియవ హెన్రి కాథరైను, అనిబొలియను, జేన్ సేమూరు, అను మువ్వురు పూఁబోడులను వివాహమాడి వారియందు వరుసగ మేరి, ఎలిజబెత్తు, అను కొమారితలను, ఆఱవ యెడ్వర్డు అను కుమారుని బడసెను. వెనుక ఆఱవయెడ్వర్డు ఇంగ్లండునకు నొడయఁ డయ్యె. అతనికి బిడ్డలు లేనందున నాతని తోఁబుట్టువులలో, బెద్ద దగుమేరీ రాజ్యలక్ష్మిని జేఁబట్టెను. ఆవనిత నిరపరాధు లగుప్రాటస్టెంటు క్రైస్తవులఁజంపించినందున బహు క్రూరురా లని పేరు పొందెను. ఈయమకు పిమ్మట నెలిజబెత్తు ఇంగ్లండును బాలించెను. ఈరాణి పెండ్లియాడకయే పరలోక గతురా లయ్యె. ఈమెకాలమున నింగ్లండు మహోన్నత పదవికి వచ్చెను. ఇంగ్లండునుండి హిందూదేశమున వ్యాపారము సేసికొనుటకుఁ దూర్పిండియా వర్తకపుసంఘమునకు ననుజ్ఞ నిచ్చినది ఈ యెలిజబెత్తను రాణియే సుమీ  ! ట్యూడరువంశస్థు లీమెతో నంతమొందిరి.

ఎలిజబెత్తు వెనుక స్టూవర్టువంశస్థు లింగ్లండునకును స్కాట్లండునకును బ్రభువు లైరి. వారిలోఁ జేమ్సు ప్రథముఁడు. ఇతని యనంతరము మొదటి చార్లసు. జను లీతనిఁజంపి, తామే రాజులేకుండ ఇంగ్లండును బాలించిరి. కాని వారిలో మేటి క్రాంవెల్. అతని వెనుక అంతగొప్ప శూరుఁడు లేనందున జనులు మొదటిచార్లెస్ పెద్దకుమారుని రెండవఛార్లెసును బిలిచి యారాజ్యమును బాలింపు మని ప్రార్థించిరి. అతఁడు వారి వేఁడుకోలునకు నియ్యకొని నెమ్మదిగ నింగ్లండును బాలింపఁ బూనెను. అతని యనంతర మాతని తమ్ముడు రెండవ జేమ్సు రాజ్యమును బాలించెను. అతనికి మేరి, యాని అను నిద్దఱు కుమార్త లుండిరి. అతని పిమ్మట నా మేరి తనమేనయత్తకుమారుఁ డగుమూఁడవవిల్లియమును బెండ్లియాడెను. ఆయిద్దఱకు శిశువులు లేరు. "యాని" అను నాయమ యింగ్లండును బాలించెను. కాని ఆరాణికి సుతులు లేనందున మొదటి జేమ్సు మనుమరాలి కొడుకు మొదటిజార్జి యింగ్లుడునకుఁ బ్రభువాయెను.

ఈ జార్జి హానోవరు. వంశస్థులలో మొదటి వాఁడు. ఇతఁడు పదుమూఁడేండ్లు ఇంగ్లండును బాలించెను. ఇతని యనంతరము రెండవజార్జి రాజ్యమునకు వచ్చెను. ఇతని కాలమున హిందూదేశమున బంగాళారాజ్యమును క్లైవు 1757 సం. న జయించెను. ఆంగ్లేయ దొరతన మది మొదలుకొని హిందూ దేశమున బాగుగఁ జెల్లుచు నున్నది. రెండవజార్జి వెనుక మూఁడవజార్జి ఇంగ్లండునకు స్వామి యై యఱువదియేండ్లు రాజ్యముసేసి కీర్తిశేషుఁ డయ్యె. ఇతని కాలమున నాంగ్లేయులు అమెరికాలోని సంయుక్త రాష్ట్రమును (United States)గోలుపోయిరి; ఇంగ్లండు వ్యాపారమును జేతివృత్తులలోను మేటి యయ్యె ; అయిరోపాఖండంబున నెపోలియ నను బలపరాక్రమ శేముషీమంతుండువాటర్లుయుద్ధమున నోడెను. నాలవజార్జి రాజ్యమునకు వచ్చి పదిసంవత్సరములుమాత్రము రాష్ట్రమును బాలించెను. అతని కాలమున నీటియావిరిబలమున నావలును, రైలు బండ్లును నడవఁ దొడంగెను. అతనికి బిడ్డలు లేరు. అతనితమ్ముఁడు నాలవ విల్లియము ఇంగ్లండునకు 1830 సం. న అధిపతి యాయెను. అతఁడు ఏడేండ్లు రాజ్య మేలెను. అతని దొరతనమున బానిస వర్తకము తుదముట్టెను. అతనికి కొడుకులుగాని కొమార్తలు గాని లేనందున అతని తమ్మునికొమార్త యగుశ్రీవిక్టోరియా మహారాజ్ఞి పదునెనిమిదియవ యేఁట రాజ్యమునకు వచ్చెను.

రెండవ అధ్యాయము.

ఎడ్వర్డు పుట్టుక

శ్రీ విక్టోరియా మహారాజ్ఞి కెంటురాజ్యముయొక్క ప్రభువునకు జన్మించె. ఈ కెంటుభూస్వామి భార్యయును, శ్రీ విక్టోరియారాణికిఁ దల్లియును అయినసాధ్వికి సాక్సుకోబర్గు గోతా (Saxe Coburg Gotha) అను రాజ్యమునకు నొడయఁడు సమానోదరుఁడు, అతని రెండవకుమారుఁడు, ప్రిన్సు ఆల్బర్టను నాతఁడు తనకు మేనయత్తకోమార్త యగువిక్టోరియా మహారాణిని వివాహ మాడెను. విక్టోరియా తన మేనమామ కుమారుని వరియించి పెండ్లి చేసికొనె ననిభావము. ఇంగ్లం