సత్యశోధన/ఐదవభాగం/20. కార్మికులతో సంబంధం

వికీసోర్స్ నుండి

20. కార్మికులతో సంబంధం

నేను చంపారన్‌లో కమెటీలో చేరిపనిచేస్తూ వుండగా ఖేడానుండి మోహన్‌లాల్ పాండ్యా, శంకర్‌లాల్ పారిఖ్‌ల జాబు వచ్చింది. ఖేడా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. కనుక పన్నులు రద్దు చేయడం అవసరం. అక్కడికి వెళ్లి ప్రజలకు మార్గం చూపించమని వాళ్లు ఆ జాబులో కోరారు. ఖేడా వెళ్లి అక్కడి పరిస్థితులు స్వయంగా తెలుసుకోకుండా సలహాలివ్వాలనే కోరిక నాకు కలుగలేదు.

మరో జాబు కార్మిక సంఘం విషయమై శ్రీమతి అనసూయాబాయి వ్రాసింది. వేతనాలు పెంచమని చాలా కాలాన్నుండి కార్మికులు కోరుతున్న విషయం నాకు తెలుసు. అది చిన్న విషయమే, అయినా దూరాన్నుండి సలహాయిచ్చే స్థితిలో నేనులేను. అవకాశం చిక్కగానే నేను అహమదాబాదు వెళ్లాను. అక్కడి వ్యవహారాలు సరిచేసి చంపారన్ వెళ్లి నిర్మాణ కార్యక్రమాలు సాగిద్దామని భావించాను. కాని అహమదాబాదు చేరిన తరువాత పనుల వత్తిడివల్ల అనుకున్న ప్రకారం నేను చంపారన్ వెంటనే వెళ్లలేకపోయాను. అక్కడ నడుస్తున్న పాఠశాలలు ఒక్కొక్కటే మూతబడ్డాయని తెలిసింది. నేను, నా అనుచరులు అంతా ఏమేమో చేద్దామని ఆకాశంలో మేడలు కట్టాం. అవన్నీ కూలిపోయాయి. చంపారన్‌లో గ్రామ్య పాఠశాలతో బాటు గోసంరక్షణ కార్యక్రమం కూడా ప్రారంభించాము. గోశాల, హిందీ ప్రచారం రెండు కార్యక్రమాలు ఇజరామార్వాడీ సోదరులు నిర్వహిస్తామని చెప్పారు. బేతియాలో ఒక మార్వాడీ సజ్జనుడు తన ధర్మసత్రంలో నాకు ఆశ్రయం ఇచ్చాడు. బేతియాలోగల మార్వాడీ సోదరులు తమ గోశాల విషయంలో నన్ను ఒప్పించారు. గోసంరక్షణను గురించి ఇప్పుడు గల భావాలే ఆనాడు కూడా నాకు వున్నాయి. గోసంరక్షణ అంటే గోవంశవృద్ధి, గోజాతి సంస్కరణ, ఎద్దులచేత తగినంత పనినే చేయించడం, గోశాలను ఆదర్శవంతమైన క్షీరశాలగా రూపొందించడమన్నమాట. ఇందుకు పూర్తిగా సహకరిస్తామని మార్వాడీ సోదరులు మాట ఇచ్చారు. అయితే నేను చంపారన్ వెళ్లలేక పోయినందున ఆ పని అసంపూర్తిగా వుండిపోయింది. బేతియాలో గోశాల నడుస్తున్నదేగాని అది ఆదర్శవంతమైన క్షీరశాలగా రూపొందలేదు. చంపారన్‌లో ఎద్దుల చేత అపరిమితంగా పని చేయిస్తున్నారు. హిందువులు ఎద్దుల్ని చావకొట్టి ధర్మానికి హాని కలిగిస్తున్నారు. ఆ ముల్లు నా హృదయంలో గుచ్చుకొని అలాగే వుండిపోయింది. చంపారన్ వెళ్లినప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ పనులను గురించి తలచుకొని నిట్టూర్పువిడుస్తూ వున్నాను. వాటిని అసంపూర్తిగా వదిలినందుకు మార్వాడీ సోదరుల్ని, బీహారీల్ని మందలిస్తూ వున్నాను. పాఠశాలలు అనుకున్న విధానంలో కాకపోయినా ఏదో విధంగా నడుస్తున్నాయి. కాని గోసంరక్షణ కార్యక్రమం అసలు ప్రారంభమేకాలేదు. అనుకున్నట్లు సాగలేదు. అహమదాబాదులో ఖేడాను గురించి చర్చలు జరుగుతూ వున్నప్పుడే నేను కార్మికుల పనికి పూనుకున్నాను.

నా స్థితి కడు సున్నితంగా వున్నది. కార్మికుల పక్షం బలంగా వున్నది. శ్రీ అనసూయాబెన్ తన సొంత అన్నతో పోరాటం సాగించవలసివచ్చింది. కార్మికులకు, యజమానులకు మధ్య ప్రారంభమైన ఈ దారుణపోరాటంలో శ్రీ అంబాలాల్ సారాభాయి ముఖ్యులు. మిల్లు యజమానులతో నాకు ప్రేమ సంబంధం వున్నది. వారితో పోరాటం జరపడం యిబ్బందికరమైన విషయం. కార్మికుల విషయమై వారిని కలిసి పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినమని ప్రార్ధించాను. కాని యజమానులు తమకు, తమ కార్మికులకు మధ్య నా మధ్యవర్తిత్వం అంగీకరించము అని స్పష్టంగా చెప్పివేశారు. కార్మికులకు సమ్మె చేయమని సలహా ఇచ్చాను. ఈ సలహా యిచ్చుటకు పూర్వం కార్మికులతోను, వారి నాయకులతోను బాగా కలిసి పోయాను. వాళ్లకు సమ్మె షరతులు తెలియజేశాను. ఆ షరతులు ఇవి.

  1. ఎట్టి పరిస్థితుల్లోను శాంతికి భంగం కలిగించకూడదు.
  2. పనికి వెళ్లదలచిన వారిని బాధించకూడదు.
  3. బిచ్చం మీద కార్మికులు ఆధారపడకూడదు.
  4. సమ్మె ఎంతకాలం నడిచినా గట్టిగా నిలబడాలి. దగ్గర డబ్బులేకపోతే మరోపని చేసుకొని పొట్టపోసుకోవాలి.

ఈ షరతులు నాయకులు తెలుసుకొని అందుకు అంగీకరించారు. కార్మికుల సభ జరిగింది. కోరికలు సబబైనవా కావా అని నిర్ణయించుటకు పంచాయతీ పెద్దల నియామకం జరగనంత వరకు పనిలోకి వెళ్లకూడదని కార్మికులు నిర్ణయించారు. ఈ సమ్మెకాలంలోనే శ్రీ వల్లభాయి మరియు శంకర్‌లాల్ బాంకరుగారలను, దగ్గరగా చూచి అర్థం చేసుకొనే అవకాశం లభించింది. శ్రీ అనసూయాబెన్‌ను గురించి అదివరకే నాకు తెలుసు. సమ్మె చేస్తున్న కార్మికుల సభలు నదీతీరాన ఒక చెట్టు క్రింద జరుగుతూ వుండేవి. వందల సంఖ్యలో కార్మికులు పాల్గొంటూ వుండేవారు. వారుచేసిన ప్రతిజ్ఞను వారికి నేను రోజూ జ్ఞాపకం చేస్తూ వుండేవాణ్ణి. శాంతి సంరక్షణ, వారి కుటుంబపోషణను గురించి రోజూ వారికి చెబుతూ వుండేవాణ్ణి. వాళ్లు తమ జండా పుచ్చుకొని పట్టణంలో రోజు తిరుగుతూ వుండేవారు. ఊరేగింపుగా వచ్చి సభలో పాల్గొంటూ వుండేవారు.

ఈ సమ్మె 21 రోజులు సాగింది. మధ్య మధ్య యజమానులతో నేను మాట్లాడుతూ వుండేవాణ్ణి. న్యాయం చేయమని కోరుతూ వుండేవాణ్ణి. “మాకు మాత్రం పట్టుదల లేదా? మాకు మా కార్మికులకు మధ్య తండ్రికొడుకుల వంటి సంబంధం వున్నది. మా యిద్దరి మధ్య మరొకరు కాలు యిరికించితే మేము ఎలా సహిస్తాం? యిందు పంచాయితీ పెద్దల ప్రమేయం ఎందుకు?” అని యజమానులు అంటూ వుండేవారు.