సంపూర్ణ నీతిచంద్రిక/స్వయంకృతా పరాధమువలన జెడిన సన్న్యాసికథ

వికీసోర్స్ నుండి

స్వయంకృతా పరాధమువలన జెడిన సన్న్యాసికథ

మలయపర్వత సమీపమున నొకానొక సాధువు నివసించుచుండు వాడు. ఆత డొకపుడు పండ్రెండుసంవత్సరములు పయనము సాగించి మలయపర్వత ప్రదేశమునుండి కాంచనపురమను నొకనగరము జేరెను. నాటిరేయి యానూతననగరమున నొకవిశాలభవపు టరగుమీద బండుకొనెను.

అదియొక వేశ్యాగృహము. గృహద్వారమున దారు నిర్మితమైన భేతాళ విగ్రహమొకటి గలదు. దాని శిరము మీద బ్రశస్తమైన యొకమణి ప్రకాశించుచుండెను. దానిం జూడగా నాసాధువున కాస కలిగెను. దానింగ్రహింపదలచి యాతడు చేయిచాచి తాకినంతనే బేతాలుని చేతు లా సాధువును బంధించి వైచినవి. బేతాళునిచేతుల బిగి కాగలేక యాత డాక్రందన మొనరించుచుండగా లోనుండి యొక పరిచారిక యరుదెంచి "ఓయీ! నీవు మలయపర్వతము దరినుండి వచ్చితివి. నీయొద్దనెన్నో మణులుండవలయును. వాని నన్నిటిని గౌరవముగా నిచ్చివేయుము. లేనిచో నీబంధము నుండి నీకు విముక్తిగలుగుట యసంభవము" అని స్పష్టపఱచెను. పది మందియు విన్నచో నింకను నవమానము గలుగునని వెంటనే తనతగ్గఱనున్న మణులన్నియు నిచ్చివైచి శూన్యహస్తుడై యాతడు మిక్కిలి విచారము నొందెను.

ఇట్లే యాషాడభూతి యనువానిచే మఱొక సన్న్యాసికి, మేషయుద్ధమువలన నొక నక్కకు స్వయంకృతాపరాధముచే హాని సంభవించెను. నీకాకథయు వివరించెదను వినుము.