Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గాణపత్యము

వికీసోర్స్ నుండి

గాణపత్యము :-

మానవుడు నిరతిశయ సుఖము నందుటకు భారతీయ సంస్కృతిలో సోపానములుగ నిర్దేశింపబడిన ఉపాసన మార్గములలో గాణపత్యము ఉన్నతస్థానము వహించి యున్నది. 'ఆదౌ పూజ్యో గణాధిపః' అను ఆర్యోక్తి ప్రకారము మిగిలిన వివిధ దేవతల యుపాస్తికి గణప త్యుపాసన పునాదివంటిది. సుముఖాది స్కంద పూర్వ జాన్త షోడశ నామములను స్మరించినచో, విద్యారంభము, వివాహము, ప్రవేశము, ప్రవేశము, నిర్గమము, సంగ్రామము మున్నగు సర్వకార్యములును నిర్విఘ్నముగ పరిసమా ప్తి చెంది ఫలించునని హిందువుల విశ్వాసము.

గణపత్యుపాసనలోని సూక్ష్మాంశములు చాలవరకు విస్మృతప్రాయము లైనట్లు కనపడును. తంత్రములందు గణపతి ప్రసక్తి బాగుగనే ఉన్నది. పురాణములందు విపులముగా గణపత్యాఖ్యానములు వివరింపబడి యున్నవి. కేవల గణపత్యుపాసకులు మాత్రము నర్మదా తీరస్థిత ఋష్యాశ్రమము లందును, మలయాళ దేశీయ ఉచ్ఛిష్ట గణపత్యుపాసకు లందును తప్ప తక్కిన ప్రాంతములందు అరుదుగ కాన్నింతురు. మంత్రశాస్త్ర సర్వస్వ మనదగిన శ్రీవిద్య నవలంబించు ఉపాసకులలో గణపతి మంత్రసిద్ధులు ఎందరో నేటికిని కలరు. కాని వారికి అంబికయందే చరమలక్ష్యము. శైవశాక్త

మాధవాచార్య కృత శంకర విజయనామక గ్రంథ మందును, దానికి వ్యాఖ్యగ ధనపతిసూరి రచించిన శంకర విజయ డిండిమ మందును గాణపత్య మతస్వరూపము నిరూపింపబడి యున్నది. ఈ గ్రంథములను బట్టి గాణపత్యము ఆరు విధములు . ఇవి- మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి అను ప్రభేదములు గల దేవతలకు చెందినవీ. ఈ విభాగమునకును శ్రీవిద్యా నిత్యాహ్నికగత పుర శ్చరణ ప్రకరణ మందలి పూర్వామ్నాయము ప్రకారము చెప్పబడు షడ్విధ గణపతి మనువులకును ఈషద్భేద మున్నది. ఇందులో మహా గణపతి సనాతనాచార ప్రవ ర్తకులగు శిష్టజనులచే గ్రాహ్యముగ పరిగణింపబడు చున్నాడు. తక్కిన విభేదములు, ముఖ్యముగ ఉచ్ఛిష్ట గణపతి అధికార భేదమునుబట్టి ఎవరికోగాని సరిపడవని తలపబడుచున్నవి. మొ త్తముమీద గాణపత్యము తప్తాంక ధారణమును బోధించుటను బట్టి శ్రీ శంకరాచార్యుల వారిచే నిరసింపబడినది. అయినను, అతప్తాంకము, వేద విరుద్ధము, అద్వైత భావనో పేతము అగు గణపత్యుపా సనము నిషిద్ధముకాదు; మీదు మిక్కిలి అజపామంత్ర తత్పరులకు మూలాధారాది షడ్చక్రములందు గణేశాది ధ్యానము ఆచార్యుల వారిచే విహితముగ ప్రతిష్ఠింప బడినది.

వేదమునందు గణపతి నుద్దేశించిన ప్రార్థనా సూక్తము ఉన్నవి. కాని గణపతియను నామముతో బాటు బ్రహ్మణస్పతియను నామము ప్రాముఖ్యము దాల్చి యున్నది. ఇది సుప్రసిద్ధమైన 'గణానాంత్వా గణపతిమ్... బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్నూతిభి స్సీద సాదనం 'అనుమంత్రమందు స్పష్టమగుచున్నది. ఈ బ్రహ్మణ స్పతి విఘ్నేశ్వరుడు కాడనియు, ఈ మంత్రమందలి గణపతి పదము గౌణము మాత్రమే అనియు తలప పని లేదు. ఏల యనగా, జైమిని మహర్షి కృత వేదపాద స్తవమందు గణపతి ప్రశంసగల స్తోత్రము : 'విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రో పేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే' అనునది పై సిద్ధాంతము నిరాధారము కాదని రుజువు పరచుచున్నది. కాలక్రమమున జనబాహుళ్యమునకు సుబోధక ములగు పౌరాణిక వర్ణనల మూలముగా విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు మొదలగు గౌణనామము లే ప్రచారము లోనికి వచ్చి, వైదిక నామములు వెనుకబడ సాగినవని ఊహించ వచ్చును. గణపత్యథర్వశీర్ణోపనిషత్తునందు గణపతీ మంత్రస్వరూపము, మాహాత్మ్యము, సర్వదేవ తాత్మకత్వము సువ్యక్తము చేయబడినవి. తైత్తిరీయా రణ్యక భాగమగు నారాయణోపనిషత్తులో గణేశునిదగు “ఏకదన్త వక్రతుండదన్తి" స్వరూపము ధ్యేయకోటిలో ఉద్ఘాటింపబడినది. వేద భాష్యకారులు తొలుత నే “వాగీశా ద్యా స్సుమనసస్సర్వార్థానా ముపక్రమే ॥ యంనత్వా కృతకృత్యాస్స్యుస్తం నమామి గజాననం" అనియు, "తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తంనో దంతః ప్రచోదయాత్" అనియు ప్రార్థించుటలో పత్యము యొక్క ప్రాధాన్యమును సూచించినారు.

విఘ్నేశ్వరుని సేవచే విఘ్నములు తొలగుట యటుంచి, భూనాయక, ధననాయకులను ప్రార్థించు వారలు భూమిని, ధనమును పొందగలుగు విధముగా, విఘ్ననాయకుని సేవించువారలు విఘ్నములు వినా ఏమి పొందక లరు? అను దురూహచే కాబోలు, సాధారణ జనులు విఘ్నేశ్వరునికొక దండము పెట్టి తమదృష్టినంతను తదితర దేవతలపై కేంద్రీకరించుట కలదు. కాని ఇందులో విఘ్నేశ్వరుని యా ధాత్మ్యమును ఎరుగజాలమివిచారింపదగినది.

బ్రహ్మవైవర్తపురాణ మందలి గణపతి ఖండములో 'విప త్తివాచకో విఘ్నః, నాయకః ఖండనార్థకః విపతం డనకారం తం, ప్రణయే విఘ్ననాయకం' అను శ్లోక వివరణము కలదు. ప్రారంభించిన పనికి అంతరాయ ములు వాటిల్లకుండు టే కాక, సర్వానర్థనివృత్తులు క లుగ జేసి అనాది మాయాసుప్తుడగు జీవునికి పరబ్రహ్మాను సంధానమను ఆనందప్రాప్తి వైపు మొదటి అడుగు వేయించునది గణపత్యుపాస్తియే అని భావము. గణేశ, బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరులు అను పంచలోక పాల కులను పూజించుటచే, క్రమముగా మనోనిగ్రహము, చిత్తశుద్ధి, ఈశ్వరభ క్తి, యోగసిద్ధి, జ్ఞానము అనుఫల ములు ప్రాప్తించునందురు. కాని సాధకుని సమస్త ప్రయత్నములును మనోనిగ్రహ లక్షణాంతములే అని గ్రహింపదగి యున్నది. గణపత్యనుగ్రహము నందిన వానికి తక్కిన మహాఫలములన్నియు ప్రా ప్తిప్రాయము లే అనవచ్చును. శంకరాచార్యులవారు ఉపాసనలన్నియు సాధన చతుష్టయ ప్రాప్తికేనని చెప్పినారు. గణపత్యుపా సనయు నంతే. గణేశుని వశిత్వసిద్ధి ప్రఖ్యాతము. 'నపా ర్వత్యాః పరాసాధ్వీ, నగణేశా త్పరోవశీ, నచ విద్యాస మో బంధుః, నాస్తి కశ్చిద్గురోః పరః" అనువాక్యము ఈ ఊహను బలపరచుచున్నది.

గణపతి పురాణము నందును, లీలాఖండమునందును, ఉపాసనా ఖండము నందును కన్పట్టు వర్ణనలను బట్టియు గణపతియొక్క నిఖిల పురుషార్థ ప్రధాన సామర్థ్యము వ్య క్తమగుచున్నది. ప్రణవమే గణపతిగ రూపుదాల్చినదని పౌరాణికో క్తి కలదు. ప్రణవము నుచ్చరించియే సకల శ్రుతిసూక్తులును ప్రవర్తించునట్లు, సర్వశాస్త్రములు ప్రణవపదమునే వివరించునట్లు, ప్రణవాత్మకుడగు గణ ప్రతి అర్చింపబడిన పిదపనే సకల దేవతా పూజలును సాగి, గణపత్యనుగ్రహముతోనే ఇతర దేవతాభిముఖ్యమును కలుగును.

గణపతి లీలలు ఇరవై యొకటి పురాణ ప్రసిద్ధములు. విష్ణువు యొక్క దశావతారములవలె ఇవియు భ క్తజన మనోరంజకములై యున్నవి. గణపతి జన్మ వృత్తాంతము వివిధ ఘట్టములలో వివిధముగ పేర్కొనబడినది. గౌరీ గాత్రమలజనితు డని మత్స్యపురాణగాథ. శివుని జ్ఞాన మహిమ చేతనే కలిగినాడని వరాహ పురాణ గాథ. ఈ రెండింటినుండి తేలు సారాంశ మేమనగా : శివపార్వతుల అవినాభావము, సామరస్యము అంత గొప్పదను విషయము. శివభక్తుడగు పరశురామునకును, ఈశ్వ రాంతఃపురమునకు ద్వారపాలకుడుగనున్న గణపతికిని ఒక ప్పుడు అంతఃపుర ప్రవేశమును గురించి వాదోపవాదము జరిగి, యుద్ధముగ పరిణమింపగా, గణపతియొక్క దంత మొకటి పరశురామునిచే పెకలింపబడినయంతట, గణపతి ఏక దంతుడా యెనని చెప్పెదరు. మరియొక పురాణ గాధ ననుసరించి గజాసురుని సంహరింప బూనిన గణ తన పతికి సకలాస్త్రశస్త్రములు విఫలములైనందున దంతము నే తీసి దానితో రాక్షసుని సంహరించెనని తెలియు చున్నది. దేవీభక్తులకు పరమేశ్వరియొక్క తనయుడైనను ఎదిరింపగల శక్తి పొడముననియు, అసుర ప్రవృత్తిగలవా డెంత బలశాలి యైనను, గణపతి బలమునకు లొంగితీరు ననియు ఈ రెండింటి నుండి తేలు సారాంశము.

గణపతి నేర్పరితనముగల లేఖకుడని ప్రతీతి యున్నది. వేద వ్యాసులు మహాభారత రచనకు ముందు గణేశుని తన లేఖకునిగ నెన్నుకొనెననియు, గణపతి లేఖిని నిలువ నవసరము లేకుండ వ్యాసుని కవితాధార కొనసాగె ననియు, వ్యాసుని అర్ధగాంభీర్యము, గణపతి సర్వజ్ఞత్వ మును మించిపో లేదనియు వినికిడి. దీని స్వారస్య మేమ నగా, మహాభారత రచన కొనసాగుటకు శ్రీకృష్ణ పర బ్రహ్మము యొక్క అనుగ్రహము కన్నను గూడ తదభిన్ను డయిన గణపతి ప్రసాదమే ముఖ్యావలంబనమైన దనుట. కృష్ణుడు శ్యమంతక మణిని గురించి అపనిందపా లైన సందర్భములో గణేశపూజ చేసిన పిదపనే నిందలు తొలగెనని స్కాందపురాణ మందు గలదు గదా!

విఘ్నేశ్వరాష్టోత్తరశతనామములందు 'బ్రహ్మచారి ణేనమః' అను నామమును బట్టి కొందరు గణపతికి వివా హము లేదందురు. దుర్వాసముని విరచిత 'ఆర్యా ద్విశతి'లో శ్రీనగర వర్ణన ఘట్టమందు, 'వందే గజేంద్ర వదనం వామాంకారూఢ వల్లభాశిష్టం కుంకుమ పరాగ ళోణం, కువలయినీజారకోరకా పీడం' అని స్తుతింపబడి నాడు గణపతి. దీనినిబట్టి ఒకే భార్య అనుకొనవలసి యుండును. కాని సిద్ధి, బుద్ధి అను శ శ క్తులిద్దరు కలరని గణపతి పురాణము. స్కాందపురాణమందు అణిమా, మహిమాది అష్టసిద్ధులను భార్యలుగ గణపతికి ప్రజాపతి యొసగెనని చెప్పబడి యున్నది. నిజము నరసినచో, గణపతి స్వశ క్తి కు డనకతప్పదు గదా ! ఆ శక్తికి అనేక రూపతయు ఉపపన్న మే యగును.

పార్వతికిని శివునకును చంద్రకళా శేఖరత్వమున్న టులే గణపతికిని కువలయినీజారకోర కాపీడత్వ మున్న దనుటను బట్టి అమృతత్వద్యోతన మున్నది. కావున అమృత పర్యాయమగు బ్రహ్మచారి నామముగూడ సమంజసమే.

శివకుమారుడగు గణపతిని శివారాధకులందరు శిరసా వహించుటేకాక, శివాభిన్ను నిగను భావించుచుందురు. బ్రహ్మాండ పురాణాంతర్గత లలితో పాఖ్యానమందు శ్రీనగర వర్ణనావసరమున మహాపద్మాటవికి వెలుపల శతరుద్రులతో నిండిన షోడశావరణములు కలిగి రుద్రా లయ మున్నదనియు, అందు మహారుద్రుడు వసించు ననియు, లలితా భ క్తులకు వీరు నిర్విఘ్న ఫలప్రదులగుదు రనియు చెప్పబడియున్నది. రుద్రాలయము యొక్క నవమావరణమునందు గృత్సపతి, వ్రాత, వ్రాతపతి, గణ, గణపతి, విరూప, విశ్వరూప మున్నగు అష్టాదశ రుద్రులు కలరందురు. ఇటు లే విష్ణ్వారాధకులలో గణ పతిని విష్ణురూపునిగను, విష్ణువునకు మేనల్లునిగను ధ్యానిం 331 గాణపత్యము చుట కలదు. ఇక, రత్నత్రితయములో మిగిలిన దేవిని ఉపాసించెడి వారలకు శక్తి జన్మయగు గణేశుడు అత్యంత ముఖ్యదేవతయై యున్నాడు. బ్రహ్మ గణపతిని పూజిం చిన పిదపనే తానొనర్చు సృష్టి వెర్రితలలు వేయుట మానెనని పురాణగాథ కలదు.

సాధకులకు మాయీయ, కార్మణ, ఆణవములు అను మలములు మూడు బ్రహ్మవిద్యా ప్రతిబంధక ములుగ నుండుననియు, అందు మాయీయ మలమును గణేశ తత్త్వమే - నివర్తింప జేయుననియు, కార్మణ మలమును శివతత్వము నివర్తింపజేయుననియు ఆణవమలమును అంబికా తత్త్వమే నివర్తింప జేయునవియు తద్దులు చెప్పుదురు. ఈ త్రివిధమలములతో అసంభావన, సంశ యము, విపరీత భావన అను మూడింటిని క్రమరీతిలో పోల్చవచ్చును. రాక్షసుడు

మహార్థమంజరీ పరిమళమను గ్రంథమందు గణపత్యు పా స్తీ ఆవశ్యకత, 'వాసనా మాతృలా భే2పి యో2 ప్ర మత్తోన జాయతే | తమనిత్యేషు భోగేషు యోజయంతి వినాయకాః' అను శ్లోక మున స్ఫుటీకరింపబడినది. విఘ్న శబ్దమునకు లలితోపాఖ్యాన రీతిగా అష్ట లక్షణములు చెప్పబడినవి: "అలసా కృపణాదీనా, నిద్రా తంద్రా ప్రమీలికా, క్లీ బాచ నిరహంకారా" అని. విశుక్రుడను లలితాకటకములోనికి జయవిఘ్నయంత్ర మును విసరి వేయుటతో, పైన చెప్పిన ఎనిమిది విఘ్న దేవతలు శక్తి సైన్యమును ఆవరించెనట. ఇట విశుక్రుడే జీవభావమని సౌభాగ్యభాస్కరమందు వ్యాఖ్యానింప బడినది. స్వసైన్యము వికావిక లగుట చూచి, విఘ్న యంత్రమును నిర్భిన్నము చేయుటకై లలితాంబ కామే శ్వర ముఖావలోకనము చేయగా, గణేశుడు ప్రాదుర్భ వించెనట. 'మహాగణేశ నిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా' అను నామమునకు వ్యాఖ్యలో పుర్యష్ట కాధీశ్వరుడగు ప్రమాత స్వాత్మస్వరూపనిష్క గజ్ఞానజన్యమయిన చిదా నంద లాభ ప్రదమధ్యవి కాసము నందుటే గణేళ పదార్థమని తెలుపబడినది. ఈ మధ్య వికాసము యొక్క సహాయము చేత నే దేహాత్మభ్రాంతి యనబడు భండాసురుని సంహారము సాధ్యమగునని వివరణ.

కేరళ దేశమున భగవ త్సేవ జేయు దినమున తెల్ల వారక ముందే గణపతి హోమము గావించి బ్రహ్మచారికి పెరు గన్నముతో భోజనము పెట్టి, సూర్యోదయానంత ర ము రంగవల్లులతో సింహాకృతి రచించి, స్వస్తికము, సర్వతో భద్రము లిఖించి, వానిపై దీపారాధన గావించి, మొదట గణపతిని ఆవాహనచేసి, పూజించి జొన్న పేలాలు నివేదిం తురు. గణపతిని విసర్జించకుండనే దేవీపూజ నిర్వర్తించి, దేవిని విసర్జించిన తరువాత గాని గణపతిని విసర్జించరు. దీని అభిప్రాయము బహుళః, గణపతి సేవ జరుగుచున్నంత వరకును పుత్రప్రీతిచే అంబికయు ప్రసన్నురాలై యుండు నని కావచ్చును.

తమిళనాడులో గణపతి చాల ముఖ్యమయిన ఇలవేలుపు. పిళ్లయార్ కోవెల లేని గ్రామము అరుదు. ప్రతి గోపురము పైన, ప్రతియింటిపైన వినాయకుని విగ్ర హము చూడగలము. విఘ్నేశ్వరునకు ప్రణామము చేయునపుడు ఆ ప్రాంతపు జనులు విశేషభక్తి ప్రపత్తులతో గుంజిళ్లు తీయుట, కణతలపై పిడికిళ్ళతో గ్రుద్దుకొనుట, ఆ విధాన మెరుగని క్రొత్తవారికి వింతగా కన్పించును. ఆంధ్ర ప్రారతములో గూడ గుంజిళ్ళుతీయు ఆచారము కలదు. కాని వినాయక చవితి అనబడు భాద్రపద శుద్ధ చతుర్థినాడు మాత్రమే ఇట్లు చేయుదురు. ఆనాడు పార్థివ గణపతిని పూజించుటకు ఊరుంబాలెములు తిరిగి నేరేడు, మారేడు, నెలవంక, మామిడి ఆకులను, దూర్వార, చెంగల్వ, ఉత్తరేణి పత్రములను, వివిధ పుష్పజాతులను వేరు వేరుగ తెచ్చి వేడుకతో పూజించు ఆచార మున్నది. గణపతి నవరాత్రుల ఉత్సవముచేయు ఆలవాటు కలదు. మహారాష్ట్ర దేశమున గణపతిపై చాల ప్రియము. ఔత్త రాహులలో సామాన్యజనము రామకృష్ణులకు, కాళీ మాతకు చూపు భక్తి మరి యే మూర్తికిని ఇవ్వరు. శిష్టులలో గాణపత్యము లేకపోలేదని యనుకొనవచ్చును.

ఈ విధమున భారతదేశమందు ఆసేతు శీతాచలము, ఆబాలగోపాలమునకు విదితమైన జాతీయ దైవము గణపతిదేహము పై తప్తాంకలింగ చక్ర ధారణము లేకుండ, సురాపాన స్వేచ్ఛావిహారము లేకుండ, శ్రద్ధాభ క్తులతో చేయబడు గణపత్యుపాస్తి ప్రశస్తము. అధవా, ద్వంద్వ మోహనిర్ముక్తులు కాని సాధారణ జనులు చేయునట్టి గణపతిదేవతాపూజ ఏ దేశాచార ప్రకారము జరిగినను, ఆయా సంప్రదాయములోని వారలకు నిఖిల పురుషార్థ ముల నొసగగలదని శాస్త్రసిద్ధాంతము.

వే. వే. సు. శా.