శ్రీ సాయిసచ్చరిత్రము /పదమూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (పదమూడవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయిలీలలు: జబ్బులు నయమగుట: (1) భీమాజీ పాటీలు (2) బాలాషింపి; (3) బాపుసాహెబు బూటీ (4) కాకామహజని; (6) హార్దనివాసి దత్తోపంతు


మాయ యొక్క యనంత శక్తి

బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్ధపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు. బాబా యిట్లనిరి. "నేను ఫకీరునయినప్పటికీ, ఇల్లువాకిలి, భార్యబిడ్డలు, తదితర బాదరబందీ లేవిలేకుండా, ఎక్కడికీ కదలక యొకచోట కూర్చునియున్నప్పటికి, తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది. నేను నన్ను మరచినను అమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు అమె నన్నావరించుచున్నది. హరి యొక్క అ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా, నావంటి దుర్బలుడయిన ఫకీరునగ నెంత? హరి ప్రసస్నుడైనప్పుడే అ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం." మాయశక్తిని గూర్చి బాబా అ విధముగా పలికెను. మహభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవప్రతిరూపములని ఉద్దవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలుకొరకు బాబా యింకా యేమి చెప్పియున్నారో వినుడు: "ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపములు క్షీణీంచినవో, వారే నన్ను భజించుటయందు తత్పరులై నాన్నెఱుగగలరు. ఎల్లప్పుడు ’సాయి సాయి’ అని స్మరించుచుండిన సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి యున్నచోటనే నా నివాసము." ఇక, తమకు పూర్తిగా శరణాగతులైనవారి క్షేమము కొరకు బాబా యేమి చేసెనో వినుడు.

భీమాజీ పాటీలు

పూనాజిల్లా, జున్నరు తాలుకా, నారాయణగాంవ్ వాస్తవ్యుడు భీమాజీపాటీలు. 1909వ సంవత్సరములో త్రీవమైన రుగ్మతకు గురయ్యెను. తుదకు అది క్షయవ్యాదిగా పరిణమించెను. అన్ని రకముల యౌషదములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. ఇక అశలన్నియు వదలుకొని, "ఓ భగవంతుడా! ఇక నీవే నాకిక దిక్కు! నన్ను కాపాడు!" అని ప్రార్ధించెను. మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనల నావరించునప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే భీమాజీ కూడ భగవంతుని స్మరించెను. అ తరువాత, తన అనారోగ్యవిషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కరుతో సలహ చేయవలెనను అలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నియు దెలుపుచు అయనకొక లేఖ వ్రాసి యతని యభిప్రాయమడిగెను. బాబా పాదముల పైబడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహపై అధారపడి శిరిడీకి పొవుట కేర్పటు లన్నియు చేసికొనెను. అతనిని శిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబు, శ్యామా కూడ నచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గతజన్మలోని పాపకర్మల ఫలితమనీ, అతని విషయములో తాను జోక్యము జేసికొనదలచుట లేదనియు బాబా చెప్పెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు నందుచే చివరకు వారి పాదముల నాశ్రయుంచితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనను. అతని ప్రార్దనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో నిట్లనిరి: "ఊరడిల్లుము! నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధలున్నవారైనను ఎప్పుడైతే యీ మసీదు మెట్లు ఎక్కుదరో వారి కష్టములన్నియు నిష్ర్కమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చట ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును తప్పక బాగుచేయును. అ ఫకీరుఅందరిని ప్రేమతోను దయతోను కాపాడును."

ప్రతి అయిదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన అ రోగి బాబా సముఖమున యొక్కసారియైన రక్తము గ్రక్కలేదు! బాబా వానిని దయతో గాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి యింటిలో బసచేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి అ ఇల్లు అంత సదుపాయమైనది గాని, అరోగ్యకరమైనదిగాని కాదు. కాని బాబా యాజ్ఞ జవదాటరానిది. అతడు శిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవముల నిచ్చి, వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్ధిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతిపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అ తరువాత అతడప్పుడప్పుడు శిరిడికి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియుందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగనమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్దనుంచి యేమియు కాంక్షిచెడువారు కాదు. వారికి కావలసిన దేమన, భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తియుందుంచుకొని, అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటయే. మహరాష్ట్ర దేశములో నెలకొకసారిగాని, పక్షమున కొకసారిగాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము. కాని భీమాజీ పాటీలు ఆ సత్యనారయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయిసత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను.

బాలాగణపతి షీంపీ

బాలాగణపతి యనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడెను. అన్నిరకముల యౌషదములు, కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ర్పయోజనమయ్యెను. జ్వరము కొంచెమైన తగ్గలేదు. శిరిడీకి పరుగెత్తెను. బాబా పాదములపై బడెను. బాబా వానికి లక్ష్మీమందిరము ముందరనున్న నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. ఈ వింత రోగనివారణోపాయమునేట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియలేకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్దముగా నుండుట జూచెను. రెండిటిని కలిపి లక్షీమందిరము వద్దకు దెచ్చెను. అచ్చటోక నల్లని కుక్క తోక యాడించుకొనుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటిలో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను.

బాపుసాహెను బూటీ

ఒకానొకప్పుడు బాపుసాహెబు బూటీ జీగట విరేచనములతోను వమనములతోను బాధపడుచుండెను. అతని అలమారునిండ మంచి మంచి మందులుండెను. కాని అవేమియు గుణమివ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపుసాహెబు బాగ నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడ పోలెకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి, అతడు రాగానే తమ ముందు కూర్చొండబెట్టుకొని, తమ చూపుడు వ్రేలాడించుచూ, "జాగ్రత్త! నీవిక విరేచనములు చేయకూడదు! వమనము కూడ అగవలెను!"అనెను. బాబా మాటలు సత్తువను గనుడు. వెంటనే అ రెండు వ్యాధులు పారిపోయెను. బూటి జబ్బు కుదిరెను.

ఇంకొక్కప్పుడు బూటికి కలరా సోకెను. త్రీవమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళె యను వైద్యుడు యన్ని యౌషదములను ప్రయత్నించెను. కాని రోగము కుదురలేదు. బాపుసాహెబు అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ యౌషదము పుచ్చుకొనినచో తన దాహము పోయి, జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదాముపప్పు, పిస్తా, అక్రోటు, నానబెట్టి, పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని యే డాక్టరుయినను చెప్పును. కాని బాపుసాహెబు బాబా యజ్ఞ శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను.

అళంది స్వామి

అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శమునకై శిరిడికి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్ర పట్టుకుండెను. శస్త్రచికిత్స కూడ చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ యెక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట కేదైన చేయమని షామా అ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతని నిట్లు అశీర్వదించెను. "అల్లా అచ్ఛాకరేగా" (భగవంతుడు నీకు మేలు చేయును). అ సన్యాసి పూనా చేరి, ఒకవారము రోజులు పిమ్మట శిరిడీకి ఉత్తరము వ్రాసెను. అ ఉత్తరములో తన చెవిపోటు తగ్గెననియు, కాని ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత యద్భుతమైనది.

కాకామహాజని

కాకామహాజని యని నింకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండునట్లు ఒక చెంబు నిండ నీళ్ళు పోసుకొని, దానిని మసీదులో నొక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను. సర్వజ్ఞుడయిన బాబాతో నేమియు చెప్పనక్కర లేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపొద్దీపితుడై బిగ్గరగా నరచెను. అందరు పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక పిడికెడు వేరుశనగపప్పు తీసి, చేతులతో నలిపి, పొట్టును ఊదివైచి, శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట శుభ్రపరచుట తినుట యొకేసారి జరుగుచుండెను. బాబా కూడ కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొని రమ్మని బాబా కాకాను అజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్ని నీళ్ళు త్రాగి, కాకాను గూడ త్రాగమనెను. అప్పుడు బాబా యిట్లనెను. "నీ నీళ్ళ విరేచనములు అగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరు తిరిగి మసీదు చేరిరి పని ప్రారంభింపబడెను. విరేచనములు అగిపోవుటచే కాకా కూడ వారితో కలిసెను. నీళ్ళు విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన యౌషదము బాబా యొక్క వాక్కే.

హార్దా నివాసి దత్తోపంతు

దత్తోపంతు హార్దాగ్రామ నివాసి. అతడు కడుపునొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ యౌషధము వానికి గుణము నివ్వలేదు. అతడు బాబా కీర్తి వివెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగు చేసెదరను సంగతి తెలిసికొని శిరిడికి పోయి బాబా పాదములపై బడెను. బాబా అతనిని దయాదృష్టితో యాశీర్వదించెను: బాబా అతని తలపై తమ హస్తము నుంచి, ఊది ప్రసాదమిచ్చి అశీర్వదించగనే యతనికి గుణమిచ్చెను. అ జబ్బువలన తిరిగి అతడు యెప్పుడు బాధపడలేదు.

ఇంకొక మూడు వ్యాధులు

(1) మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే భాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరిగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞలేకుండ పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా యాశీర్వాదముతో నయమయ్యెను.

(2) కాకామహజని అన్నగారైన గంగాధరపంతు అనేక సంవత్సరము కడుపునొప్పితో బాధపడెను. బాబాకీర్తి విని శిరిడీకి వచ్చెను. కడుపునొప్పి బాగుచేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి, భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటినుండి అతని కడుపు నొప్పి తగ్గి, వ్యాధి పూర్తిగా నయమయ్యెను.

(3) ఒకప్పుడు నానాసాహెబు చందోర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు అ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజక్షనులు ఇచ్చిరి. కాని యవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా అశీర్వాదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలిగిపోయెను.

ఈ కథలన్నియు నిరూపించునదేమన, అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషదము బాబా యొక్క వాక్కు, అశీర్వదములు మాత్రమేకాని, ఔషధములు కావు.


శ్రీ సాయినాథాయ నమః పదమూడవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు