శ్రీ సాయిసచ్చరిత్రము /పదునాలుగవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (పదునాలుగవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము పదునాలుగవ అధ్యాయము నాందేడ్ నివసియగు రతన్‌జీ వాడియా - మౌలాసాహెబు అను యోగి - దక్షిణమీమాంస


గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు, అశీర్వాదములచే అనేకమైన అసాధ్యరోగములేట్లు నయమయ్యెనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్‌జీ వాడియా యనువానిని బాబా అశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము.

ఈ యోగీశ్వరుని జివితము లోపల వెలుపల కూడ సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడచినా, భుజించినా, మాట్లాడినా, యే పని చేసిననూ అన్నియు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన అనందము. శ్రీసాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల ననేకకథల రూపముగా బోధించిరి. క్రమముగా నవి యసలైన మతమునకు మార్గమును జూపును. ప్రపంచములోని జనులందరు హాయిగా నుండవలెనని బాబా యుద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా అత్మసాక్షాత్కరమును సంపాదించవలెనని వారి యుద్దేశము. గతజన్మల పుణ్యముకొలది మనకు మానవజన్మ లభించినది. కాబట్టి దాని సహయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యము పొందవలెను. కనుక మన మెప్పుడును బద్దకించరాదు. ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమునునైన మోక్షమును సంపాదించవలెను.

ప్రతి నిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీసాయిని చూడగలవు. నీ మనస్సు వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీసాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన యెడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలసిపోదువు.

నాందేడు పట్టణ నివాసియగు రతన్‌జీ

ఇక ఈ అధ్యాయపు ముఖ్యకథను ప్రారంభించెదము. నైజాం యిలాకాలోని నాందేడులో పార్సీవర్తకుడొకడుండెను. అతని పేరు రతన్‌జీ షాపుర్జీ వాడియా. అతడు చాల ధనము నార్జించెను. పొలములు తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుఱ్ఱములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో గాన్పించెడివాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్నవారొక్కరు లేరు. ధనికుడగు రతన్‍జీ గూడ ఏదో చింతతోనుండెను. అతడు ఔదర్యము గలవాడు, దానధర్మములు చేయువాడు. బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు. అందరి కన్ని విధముల సహయము చేయుచుండువాడు. చూచిన వారందరును "అతడు మంచివాడు; సంతోషముగ నున్నా"డని యనుకొనిరి. కాని రతన్‌జీ చాలాకాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియై యుండెను. భక్తి లేని హరికథవలె, వరుస లేని సంగీతమువలె, జందెము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచజ్ఞానము లేని శాస్త్రవేత్తవలె, పశ్చాత్తాపము లేని యాత్రవలె, కంఠాభరణము లేని అలంకారమువలె రతన్‌జీ జీవితము పుత్రసంతానము లేక నిష్ప్రయోజనము గాను, కళావిహీనముగాను యుండెను. రతన్‌జీ యెల్లప్పుడు ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను.

రతన్‌జీ తనతో తానిట్లనుకొనెను. "భగవంతుడెన్నడన సంతుష్టి జెంది పుత్రసంతానము కలుగజేయడా?" మనస్సునందలి ఈ చింతతో అతడాహారమందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా లేదా యను నాతురతతో నుండువాడు. దాసగణు మహరాజునందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు దాసగణు మహరాజ్‌ని కలసి అయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగణు అతనికి శిరిడీకి వెళ్ళుమని సలహ యిచ్చెను. బాబాను దర్శించుమనెను; బాబా అశీర్వదము పొందుమానెను; సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్‌జీ దీనికి సమ్మతించెను. శిరిడీకీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత శిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి, దానిని బాబా మెడలో వేసి, ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్ధించెను:

"కష్టదశలోనున్నవారనేకమంది నీ దర్శమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీపాదముల నాశ్రయించితిని. కనుక దయయుంచి నాకు అశాభంగము కలుగజేయకుము." బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్‌జీ తన మనస్సులో దలచెను. బాబా అతనిని 5 రూపాయిల దక్షిణ కోరి, అతడా పైకము నిచ్చునంతలో, తనకు రూ.3-14-0 ఇంతకు పూర్వమే ముట్టియుండెననీ, కాని మిగిలిన రూ. 1-2-0 మాత్రమే యిమ్మనెను. ఇది విని రతన్‌జీ మిగుల అశ్చర్యపడెను. బాబా యాడిన మాటలను రతన్‌జీ గ్రహించకొనలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగత దక్షిణ యిచ్చెను. తాను వచ్చిన పని యంతయు బాబాకు విన్నవించి. తనకు పుత్రసంతానము కలుగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. "దిగులు పడకు! నీ కీడురోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చు"నని చెప్పెను.

బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్‌జీ నాందేడుకు వచ్చెను. దాసగణుకు శిరిడీలో జరిగిన వృతాంతమంతయు దెలిపెను. అంతయు సవ్యముగా జరిగె ననియు, బాబా దర్శనము, వారి యాశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని యనెను. తమకు అంతకుముందే రూ. 3-14-0 ముట్టినవని బాబా యాడిన మాటల కర్ధమేమని దాసగణు నడిగెను. "ఇంతకు మునుపు నేనెప్పుడు శిరిడీకి వెళ్ళియుండలేదే! నావల్ల బాబాకు రూ. 3-14-0 ఎట్లు ముట్టెను?" అది దాసుగణుకు కూడ యొక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు అలోచించెను. కొంతకాలమయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలసాహెబను మహత్ముని రతన్‌జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియనివారు లేరు. వారి నెమ్మదైన యోగి. రతన్‌జీ శిరిడీకి పొవ నిశ్చయించగనే ఈ మౌలాసాహెబు రతన్‌జీ ఇంటికి వచ్చెను. అనాటి ఖర్చు సరిగ 3-14-0 అగుట జూచి యందరు అశ్చర్యపడిరి. అందరికి బాబా సర్వజ్ఞుడని సృష్టపడినది. వారు శిరిడీలో నున్నప్పటికి దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. లేనిచో మౌలసాహెబు కిచ్చిన రూ. 3-14-0 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటేయని గ్రహించిరి.

దాసుగణు చెప్పిన సమాధానమునకు రతన్‍జీ సంతుష్టిచెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మసము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్దికాలము పిమ్మట అతనికి పుత్రసంతానము కలిగెను. అ దంపతుల యానందమునకు మితి లేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12 గురు సంతానము కల్గిరి. కాని నలుగురు మాత్రము బ్రతికిరి.

ఈ యధ్యాయము చివరన హరివినాయక సాఠె యనువాడు. తన మొదటి భార్య కాలముచేసిన పిమ్మట, రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరు కూమార్తెలు గలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కాని బాబా మాటలెన్నిటికి అసత్యములు గానేరపు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంత నతడు మిక్కిలి సంతుష్టి చెందెను.

దక్షిణ మీమాంస

దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి యీ యధ్యాయమును ముగించెదము. బాబా తమను జూచుటకు వెళ్ళినవారివద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట యందరికి తెలిసిన సంగతే. బాబా ఫకిరయినచో, వారికీ దేని యందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణ నెందు కడుగవలెను? వారు ధనమునేల కాక్షించవలెనని యెవరైన అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా యేమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన యగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. భక్తులను గాని, తదితరులనుగాని బాబా యేమియు నడిగెడివారు కారు. ఎవరైన నొకకాని గాని రెండు కాసులుగాని యిచ్చినచో వానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడిగాని, చిలుముగాని పీల్చెవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలు బాబా ముందర పెట్టెవారు. ఒక్కకాని యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడివారు. అర్దణా అయినచో తిరిగి యిచ్చేవారు. బాబా కీర్తి యన్నిదిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ యడుగుచుండెను.

"దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తికాదు" అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగులపూజలో మాత్రమేల యుండరాదు? శాస్త్రములలో గూడ నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని గోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసలకు ’ద’ యను నక్షరము బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు ’దమము’ నవలంబించవలెనని గ్రహించిరి. (అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట) మానవులు ఈ యక్షరమును ’దానము’గా గ్రహించిరి. రాక్షసులు దీనిని ’దయ’ యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమ మేర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించ వలయునని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోను, ధారళముగను, అణకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరుచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేకమందికీ జరిగెను. దీనికొక యుదాహరణము. గణపతిరావు బోడస్‌యను ప్రముఖ నటుడు, తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు, దీని ఫలితముగా అనాటినుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడస్‌కు దొరకుచుండెను.

బాబా ’దక్షిణ’ యడిగినపుడు ధనమే ఇవ్వనక్కర లేదను నర్ధము గూడ పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండుదాహరణములు.

(1). బాబా 15 రూపాయలు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్ జి.జి.నార్కే నడుగగా, నతడు తన వద్ద దమ్మిడీయయిన లేదనేను. దానికి బాబా యిట్లనెను. "నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగవాసిష్ఠము చదువుచున్నవు గదా? దాని నుంచి నాకు దక్షిణ యిమ్ము!" దక్షిణ యనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని యర్ధము. (2). ఇంకొకసారి, తర్‌ఖుడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ యిమ్మని బాబా యడిగెను. తన వద్ద పైకము లేకుండుటచే నామె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే యున్న అమె భర్త బాబా వాక్కులకు అర్దము జెప్పెను. తన అరుగురు శత్రువులను (కామక్రోధ లోభాదులను) తమకు పూర్తిగా సమర్పించవలెనని బాబా భావమని యతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగ సమ్మతించెను.

బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి, దానినంతయు వారు అనాడే పంచి పెట్టుచుండిరి. అ మరుసటి యుదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయులు దక్షిణరూపముగా పుచ్చుకొనినను, మహసమాధి చెందునాటికి ఏడు రూపాయులు మాత్రమే వారి చెంత మిగిలెను. వేయేల బాబా దక్షిణపుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుటకొరకే.

దక్షిణగూర్చి యింకొకరి వర్ణన

బి.వి.దేవ్ ఠాణానివాసి; ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు; బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన "శ్రీసాయిలీలా మాసిక్’ ప్రత్రికలో నిట్ల వ్రాసియున్నారు:

బాబా యందరిని దక్షిణ యడుగువారు కారు. అడుగుకుండ ఇచ్చినచో నొక్కొకప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తులవద్ద దక్షిణ యడుగుచుండెను. బాబా యడిగినచో యిచ్చెదమనుకొనువారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ యిచ్చినచో, బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైన దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా యడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి యుండును. స్త్రీలు, పిల్లలు వద్ద కూడ బాబా దక్షిణ యడుగుచుండెను. వారు అందరు ధనికులనుగాని అందరు బీదలను గాని దక్షిణ యడుగలేదు.

తాము అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించియుండలేదు. ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో, తెచ్చిన వారు దానిని మరచునప్పుడు, వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి, అ దక్షిణను పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణనుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి పూజలో పెట్టుకొనమనెడివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను. అనుకున్నదానికంటె నెక్కువ యిచ్చినచో, కావలసినదానినే యుంచుకొని మిగతాదానిని తిరిగి యిచ్చి వేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులనుకొనిన దానికంటె నెక్కువగా ఇవ్వుమనుచుండువారు. లేదనినచో నెవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని, అడిగితీసుకొనిగాని ఇవ్వుమనుచుండిరి. కొందరివద్ద నుంచి యొకేరోజు మూడు నాలుగు సారులు దక్షిణ కోరుచుండిరి.

దక్షిణరూపముగా వసూలుయిన పైకమునుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు, ధునికొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయిలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొకరికి నిత్యము దానము చేయుచుండువారు. శిరిడీ సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్టమాయి సలహచే భక్తులు తెచ్చి యిచ్చిరి. ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తి యంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబీరేలు గ్లాసు మాత్రమే యనియు అయినప్పటికి భక్తులనవసరమైన నిష్ర్పయోజనయయిన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు

మన పారమార్ధికమునకు అటంకములు రెండు గలవు: మొదటిది స్త్రీ, రెండవది ధనము. శిరిడీలో బాబా యీ రెండు సంస్థలను నియమించియున్నారు. అందోకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచి పెట్టిరో పరీక్షీంచుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ యడిగి పుచ్చుకొని, "బడికి" (రాధాకృష్ణమాయి గృహమునకు) పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన అశీర్వాదమువలన వారి పారమార్దికప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను.

భగవద్గీతలోను, ఉపనిషత్తులలోను, పవిత్రమైన స్థలమందు పవిత్రున కిచ్చిన దానము, అదాతయొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది. శిరిడీకన్న పవిత్రస్థల మేది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న యెవరు?


శ్రీ సాయినాథాయ నమః పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు