శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదియైదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదియైదవ అధ్యాయము - 7వ రోజు పారాయణము)



శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదియైదవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము బుధవారము 1. కాకా సాహెబు సంశయము 2. అనందరావు దృశ్యము 3. కొయ్య బల్ల మంచము


గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిశరీరమును మన దృష్టినుండి నిష్క్రమించెను గాని వారి యనంతస్వరూపము లేదా సాయిశక్తి యెల్లప్పుడు నిలిచియే యుండును ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందినపిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందకముందు వారిని జూచిరో వారు నిజముగా నదృష్టవంతులు. అట్టివారిలో నెవరైన ప్రపంచసుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడేకాదు ఇప్పుడు కూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమయిన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానము గాని చేయ పూనుకొనినచో దాని మనఃపూర్వకముగాను అత్మశుద్ధితోడను చేయవలెను.

పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమను, భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతొ పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధి పొందుటకు తండ్రిగాని, తల్లిగాని సోదరుడుగాని యింక తదితరబంధువు లెవ్వరుగాని తోడ్పడరు. అత్మ సాక్షాత్కారములకు దారిని మనమే వెదకుకొని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదము తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము. దానివాలన ప్రపంచవిషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యమోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించినవారును ప్రపంచమును కతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశియందు జూడగలిగి పుజించెదము. ఇదియే అద్వైతభజనము లేద పూజ. ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై అత్మసాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను, వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును.

కాకాసాహెబు సంశయము - అనందరావు అనుభవము

కాకాసాహెబు దీక్షిత్‌ను ప్రతిరోజు శ్రీఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థరామాయణమును చదువుటకు బాబా అదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడ అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో నున్న కాకా మహజని యింటిలో కాకాసాహెబు దీక్షీత్ ఏకనాథభాగవతము చదువుచుండెను. శ్యామా, కాకామహజని కూడ నచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షీత్ ఏకాదశస్కంధములోని ద్వీతీయధ్యాయమును చదువుచుండెను. అందు వృషభకుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్‌హొత్ర, దృమిళ, చమన్, మరియు కరభాజన్‍లు భాగవతధర్మసూత్రములను జనకమహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని యడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానము లిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్‍హొత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని యవతారములను వారి లీలలను, చమస్ భక్తుడుకానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహముతో శ్యామాతో నిట్లనియె: "నవనాథులు భక్తి విషయమై చప్పినది యెంత అద్భుతముగా నున్నది? దాని నాచరించుట యెంత కష్టము? నవనాథులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేకజన్మ లెత్తినను మనము దాని సంపాదించలేము. ఆట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్ల? కాబట్టి యట్టిదానిని మన మాశించరాదని తెలియుచున్నది" కాకాసాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను" : ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు నిరాశ చెందనేల? నవనాథులు భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకుగాని అందోళనకుగాని యవకాశమేది?" శ్యామా చెప్పిన సమాధనముతో కాకాసాహెబు సంతుష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందులెట్లు? అను మనోవేదన కలిగి అందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి యుదయమే యీ క్రింది యద్భుతము జరిగెను.

అనందరావు పాఖాడే యనువాడు శ్యామాను వెదకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబు భాగవతమును చదువుచుండెను. పాఖాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణకాలక్షేపమునకు కొంచె మాటంకము గలుగజేసెను. కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని యడిగెను. శ్యామా యిట్లు నుడివెను. "నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి సమాధన మిదిగో! బాబా పాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము. "రక్షకమైన భక్తి" గాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు" అందరు ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్ప నారంభించెను.

లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలచితిని. హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహసనముపై బాబా కూర్చొనియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల అనందించితిని. అది నిజమువలె నుండెనే కాని స్వప్నమువలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని యనుకొనలేదు. మాధవరావు కూడ అచ్చట నిలచియుండెను. శ్యామా "అనందరావు! బాబా పాదములపై బడుము" అని సలహనిచ్చెను. "నాకు కూడ నమస్కరించవలెననియే యున్నది. కాని వారి పాదములు నీటిలో నున్నవి. కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను?" నేను నిస్సహాయుడను. "అని నేనంటిని. అది విని యతడు బాబాతో నిట్లనెను. "ఓ దేవా! నీటిలో నున్న నీ పాదములను బయటకు దీయుము." వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసిరి. క్షణమైన అలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. "ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము గాని అందోళన గాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు."

బాబా యజ్ఞానుసారము పాఖాడే పట్టుధోవతిని తెచ్చెను. మాధవరావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామా యందులకొప్పు కొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లువేసి తెలిసికొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటి వేసి సంశయమును దీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. "పుచ్చుకొనుము" ’నిరాకరించుము" అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదకల వద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదాని తీయించిరి. ’పుచ్చుకొనుము" అను చీటి ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి. దానిని శ్యామా యంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను.

ఇతర యోగుల మాటలను కూడ గౌరవించవలసినదని యీ కథ ప్రభోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పుర్ణమైన భక్తి విశ్వాసము లుండవలెను. వారి భోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖము లితరులకంటె వారికే బాగుగ తెలిసి యుండును. నీ హృదయఫలకమందు బాబ చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. " ఈ లోకము ననేకమంది యోగులు గలరు. గాని మన గురు వసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల! హృదయపూర్వకముగ నీగురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు."

కొయ్య బల్ల మంచము బాబాదే, మహాల్సాపతిది కాదు

బాబా శిరిడీకి చేరిన కొద్దికాలమునకే 4 మూరల పోడవు, ఒక జానెడు వెడల్పు గల కొయ్య బల్ల మీడ నాలుగు చివరల దీపపు ప్రమిదులు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళ గడచిన పిమ్మట బాబా దానిని విరచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని యతడు బాబా కిట్లనియె. "మీ కింకను కొయ్య బల్లయందు మక్కువ యున్నచో నింకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడు వేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును." అందుకు బాబా ఇట్లనెను. "మహల్సాపతి దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనుట కిష్టము లేదు." కాకాసాహెబు ఇట్లనెను. "మహల్సాపతికొర కింకొక బల్లను తయారు చేయించెదను." బాబా "అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్లమీద అంత ఎత్తున పడుకొనుట సులభముయిన పనికాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరయితే కండ్లు దెరచి నిద్రించగలరో వారికే యది వీలుగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుంది తన చేయి నా హృదయముపై నుంచుమనెదను. అచ్చటనుంచి వచ్చు భగవన్నామస్మరణమును విను మనెదను. నేను పండుకొనినచొ నన్ను లేవగొట్టు మనెదను. దీనినే యతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్! అని పిలచెదను. వెంటనే కండ్లు తెరచి కదలును. ఎవడయితేనేల పై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండ యుండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో, వాదు ఎత్తెన బల్లమీద నెట్లు పండుకొనగలడు?" అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచే నిట్లనెను. "మంచిగాని చెడ్డగాని, ఏది మనదో యది మన దగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరులవద్ద నున్నది."



శ్రీ సాయినాథాయ నమః నలుబదియైదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు